కశ్మీర్ ప్రజలకు మా మద్దతు.. భారత్ తో చర్చలకూ సిద్ధం : పాక్ దేశాధ్యక్షుడు
కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం భారత్ తో చర్చలు నిర్వహించేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని ఆ దేశాధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ ఉద్ఘాటించారు.
ఇస్లామాబాద్: కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం భారత్ తో చర్చలు నిర్వహించేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని ఆ దేశాధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ ఉద్ఘాటించారు. 77వ పాకిస్తాన్ డే సందర్భంగా గురువారం ఇస్లామాబాద్ లో జరిగిన వేడుకలో ఆయన మాట్లాడారు.
కశ్మీర్ అంశంపై భారత్ అస్థిరంగా ఉన్న కారణంగానే ప్రాతీయంగా శాంతి స్థాపన కష్టంగా మారిందని ప్రెసిడెంట్ హుస్సేన్ పేర్కొన్నారు. కశ్మీర్ అంశంపై భారత్ తో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, ఐక్యరాజ్య సమితిలో ఉన్న తీర్మానానికి అనుగుణంగా కశ్మీర్ పై చర్చలు నిర్వహించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
హక్కుల కోసం పోరాటం చేస్తున్న కశ్మీర్ ప్రజలకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. శాంతియుతంగా కశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు ప్రపంచ దేశాలు కూడా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఏ దేశం పట్ల కూడా తమకు దూకుడు స్వభావం లేదన్నారు. ఆర్మీ, ప్రజలు చేస్తున్న త్యాగం వల్ల దేశం గతంలో కంటే ఎక్కువ సురక్షితంగా ఉందన్నారు. పాక్ గణతంత్ర వేడుకల సందర్భంగా భారీ ఎత్తున ఆ దేశ సైన్యం విన్యాసాలు నిర్వహించింది.
ఈ విన్యాసాల్లో పాక్ తో పాటుగా చైనా, అరబ్ దేశాలకు చెందిన సైనికులు కూడా పాల్గనడం విశేషం. కల్చరల్ పరేడ్ లో ఆజాద్ కశ్మీర్ థీమ్ ను ప్రదర్శించారు.