పుతిన్ సంచలన నిర్ణయం - కీలక డిక్రీ మీద సంతకం..!!
వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలల తరబడి కొనసాగుతున్న యుద్ధంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఫిబ్రవరి 24వ తేదీన ఆరంభమైన యుద్ధానికి అంతు ఉండట్లేదు. నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు. రష్యా సాగిస్తోన్న దాడులను ఉక్రెయిన్ సమర్థవంతంగా అడ్డుకుంటోంది.
అనెక్సేషన్ తరువాత..
ఇన్ని రోజులుగా సాగుతున్న ఈ యుద్ధం వల్ల ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు నేలమట్టం అయ్యాయి. వాటిని రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. మరియోపోల్, మెలిటొపోల్, క్రిమియా, డాన్బాస్, డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, సుమి, ఒడెస్సా, చెర్న్హీవ్, ఖార్కీవ్.. వంటి నగరాలను రష్యా సైనిక బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. డొనెట్స్క్, లుహాన్స్క్ ఝపరొజ్ఝియా, ఖేర్సన్ రీజియన్లను రష్యా విలీనం చేసుకోవడానికి రెఫరెండం సైతం నిర్వహించింది.
19 కిలోమీటర్ల బ్రిడ్జ్ పేల్చివేత..
అటు ఉక్రెయిన్ దీన్ని గట్టిగా ప్రతిఘటిస్తోంది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, యూరోపియన్ యూనియన్ సహా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలు అందజేస్తోన్న ఆయుధ సామాగ్రితో రష్యా దూకుడును అడ్డుకుంటోంది. ఆయుధాలు, యుద్ధ వాహనాల తరలింపులో కీలకంగా మారిన క్రిమియా బ్రిడ్జిపై చోటు చేసుకున్న భారీ పేలుడు అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ ఇది. 19 కిలోమీటర్ల పొడవు ఉంటుంది.
భారీ బందోబస్తు.. డిక్రీపై సంతకం..
కారు బాంబు ద్వారా క్రిమియాకు ఆయిల్ను తీసుకెళ్తోన్న రష్యా ట్యాంకర్లను పేల్చివేశారు. ఈ ఘటనలో బ్రిడ్జి మొత్తం ధ్వంసమైంది. దీన్ని ఉగ్రవాద చర్యగా భావిస్తోంది రష్యా. కారుబాంబును పేల్చింది ఉగ్రవాదులేనని భావిస్తోంది. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ పేలుడు ఘటన తరువాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బ్రిడ్జికి కట్టుదిట్టమైన బందోబస్తును కల్పించారు. దీనికి అవసరమైన డిక్రీ మీద సంతకం చేశారు.
కొత్త ఆర్మీ జనరల్..
క్రిమియా రీజియన్ నుంచి రష్యాను కనెక్ట్ చేసే వంతెన కావడం వల్ల పేలుడు ఉదంతాన్ని వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారు. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ఘటన అనంతరం పుతిన్ మరో కీలక నిర్ణయాన్నీ తీసుకున్నారు. ఉక్రెయిన్పై యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయడానికి కొత్త ఆర్మీ జనరల్ను నియమించారు. యుద్ధాన్ని మాత్రమే పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా సెర్గీ సురికోవిన్ను జనరల్గా అపాయింట్ చేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.