ఉక్రెయిన్పై రష్యా సరికొత్త అస్త్రం : కింజాల్ హైపర్ సోనిక్ క్షిపణులతో దాడులు.. ఆయుధ నిల్వల కేంద్రం ధ్వంసం
ఉక్రెయిన్పై దాడులను రష్యా మరింత పెంచింది. ప్రపంచ దేశాలు ఆంక్షలు విధిస్తున్నా లెక్కచేయని రష్యా అధ్యక్షుడు పుతిన్.. కొత్త వ్యూహానికి పదునుపెడుతున్నారు. తన యుద్ధ వ్యూహాన్ని మార్చేశారు. ఉక్రెయిన్పై సరికొత్త అస్త్రాన్ని రంగంలోకి దించారు. అత్యంత శక్తివంతమైన క్షిపణులతో విరుచుకుపడుతున్నారు. తన అమ్ములపొదిలోంచి సరికొత్త కింజాల్ హైపర్ సోనిక్ క్షిపణులను ప్రయోగించారు.

ఉక్రెయిన్ ఆయుధ నిల్వల కేంద్రం ధ్వంసం..
పశ్చిమ ఉక్రెయిన్ లోని ఉన్న ఆయుధ నిల్వల కేంద్రాన్ని రష్యా సేనలు టార్గెట్ చేశాయి. ఇవానో ఫ్రాంకివిక్ ప్రాంతంలో ఆయుధాలు, మిస్సైల్స్ ఉన్న స్థావరంపై కింజాల్ హైపర్ సోనిక్ క్షిపణులతో ధ్వంసం చేసింది. ఈ మేరకు రష్యా రక్షణ శాఖ తెలిపింది. ఉక్రెయిన్పై దాడులకు దిగిన కింజాల్ హైపర్ సోనిక్ ఆయుధాలో విరుచుకుపడడం ఇదే తొలిసారి. కింజాల్ ఏవియేషన్ క్షిపణి వ్యవస్థ హైపర్ సోనిక్ ఏరోబాలిస్టిక్ క్షిపణులతో కూడి ఉంటుంది. ఈ శక్తివంతమైన క్షిపణులతో ఉక్రెయిన్ యొక్క క్షిపణులు, విమానయాన మందుగుండు సామాగ్రితో నిండి ఉన్న అతిపెద్ద భూగర్బ గిడ్డంగిని పేల్చిపడేసింది. అంతే కాకుండా ఒడెస్సా ప్రాంతంలో ఉక్రెయిన్ సైనిక రేడియో వ్యవస్థ, నిఘా కేంద్రాలను కూడా నాశనం చేసినట్లు రష్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఉక్రెయిన్ను బలహీనపరిచే వ్యూహాం..
మరో వైపు ఉక్రెయిన్లో రష్యా జరుపుతున్న దాడులపై బ్రిటన్ ఆందోళన వ్యక్తం చేసింది. రష్యా తన యుద్ధం తంత్రాన్ని మార్చుకుందని బ్రిటన్ రక్షణ శాఖ తన తాజా ఇంటెలిజెన్స్ రిపోర్టులో హెచ్చరించింది. దీంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టాలు వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. నిరంతర దాడులతో ఉక్రెయిన్ మౌలిక సదుపాయాలు నాశనం అవుతున్నాయని పేర్కొంది. నిరంతర దాడులతో ఉక్రెయిన్ను బలహీనపరిచే వ్యూహాన్ని రష్యా అనుసరిస్తోందని అభిప్రాయపడింది. మాస్కో బలగాలు ఇప్పటివరకు వారి అసలు లక్ష్యాన్ని సాధించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించింది. రష్యా దురాక్రమణతో మనవతా సంక్షోభాన్ని తీవ్రతరం అవుతోందని అభిప్రాయపడింది.

రష్యాతో చర్చలకు సిద్దమే అన్న జెలెన్ స్కీ.
.
అటు రష్యాతో తాము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని మరోసారి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పష్టం చేశారు. తక్షణమే ఆదిశగా అడుగులు వేయాలని రష్యాను కోరారు. దాడులకు ముగింపు పలకాలన్నారు. ఇరుదేశాల మధ్య చర్చలు నిర్వహించేందుకు సమయం ఆసన్నమైంది.. చర్చలు జరగకపోతే రష్యాకు భారీ నష్టం తప్పదని .. దానిని నుంచి కోలుకోవడానికి ఆదేశానికి తరాలు పడుందని హెచ్చరించారు. ప్రాంతీయ సమగ్రతను పరిరక్షించేందుకు చర్యలు చేపట్టాలని రష్యాను జెలెన్ స్కీ కోరారు. ఇప్పటికే పలుదపాలుగా ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు జరిగినా ఎలాంటి పరోగతి లభించలేదు.












Click it and Unblock the Notifications