సెల్ఫ్ ఐసొలేషన్లోని పుతిన్: తజకిస్తాన్ పర్యటన క్యాన్సిల్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. సెల్ఫ్ ఐసొలేషన్లోకి వెళ్లనున్నారు. ఆయన ప్రధాన అనుచరుల్లో ఒకరిద్దరికీ ప్రాణాంతక కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొద్దిరోజుల పాటు సెల్ఫ్ ఐసొలేషన్లో ఉండాలంటూ వైద్యాధికారులు ఇచ్చిన సూచనలను పాటించనున్నారు. ఊహించని విధంగా సంభవించిన ఈ పరిణామంతో పుతిన్ అధికారిక కార్యకలాపాలన్నీ రద్దుయ్యాయి. కొన్ని కీలకమైన షెడ్యూళ్లను వాయిదా వేశారు. వచ్చే వారం నిర్వహించ తలపెట్టిన తజకిస్తాన్ పర్యటన రద్దయింది.
రష్యాలో కరోనా వైరస్ తీవ్రత చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటోంది. ఇప్పటిదాకా 71,76,085 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అక్కడ నమోదయ్యాయి. 1,94,249 మంది మరణించారు. 64,18,033 మంది కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 5,63,803గా నమోదయ్యాయి. రష్యాలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉంటోంది. కరోనా మహమ్మారిని నిర్మూలించడానికి స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ను రష్యా సొంతంగా అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వ్యాక్సినేషన్ కార్యక్రమం అక్కడ జోరుగా సాగుతోంది.
ఈ పరిణామాల మధ్య వ్లాదిమిర్ పుతిన్ అంతర్గత భద్రతా సిబ్బంది, ముఖ్య అనుచరుల్లో కొందరికి కరోనా వైరస్ సోకింది. పుతిన్కు సన్నిహితంగా ఉండే వారు ప్రొటోకాల్స్ ప్రకారం ప్రతిరోజూ తప్పనిసరిగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా వారికి యధాతథంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా.. పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీనితో వారందరూ హోమ్ ఐసొలేషన్లోకి వెళ్లిపోయారు.
ఈ సమాచారం అందిన వెంటనే వ్లాదిమిర్ పుతిన్ కూడా సెల్ఫ్ ఐసొలేషన్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. డాక్టర్లు ఇచ్చిన సూచనల మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని క్రెమ్లిన్ ప్రకటించింది. కనీసం 10 రోజుల పాటు ఆయన ఐసొలేషన్లో ఉంటారని తెలుస్తోంది. ఆయన ఐసొలేషన్లోకి వెళ్లినప్పటికీ- వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికార వర్గాలు చెబుతున్నాయి. కొన్ని కీలకమైన సమావేశాలను మాత్రం తాత్కాలికంగా రద్దు చేశారు.
అలాగే- వచ్చేనెల పుతిన్ నిర్వహించ తలపెట్టిన తజకిస్తాన్ పర్యటనను రద్దు చేశారు. ఈ విషయాన్ని పుతిన్ స్వయంగా తజకిస్తాన్ అధ్యక్షుడు ఎమోమలి రఖ్మోన్కు తెలియజేశారని క్రెమ్లిన్ తెలిపింది. తజకిస్తాన్ రాజధాని దుషాంబెలో వచ్చేవారం నిర్వహించ తలపెట్టిన రీజనల్ సమ్మిట్లో వ్లాదిమిర్ పుతిన్ హాజరు కావాల్సి ఉంది. ఇదివరకు కరోనా వైరస్ కేసులు పెద్ద ఎత్తున నమోదవుతోన్న సమయంలో ఆయన వర్చువల్ విధానంలో ఇందులో పాల్గొన్నారు. ఈ దఫా ఇన్ పర్సన్గా హాజరు కావాల్సి ఉండగా.. అది రద్దయింది.