ఆ డ్రైవర్కు ఏడేళ్ల శిక్ష ఏడాదికి కుదింపు... ఆ ప్రమాదంలో 12 మంది భారతీయులు మృతి...
ఒమన్ దేశానికి చెందిన ఓ బస్సు డ్రైవర్(54)కు ఓ రోడ్డు ప్రమాద కేసులో ఏడు సంవత్సరాల జైలు శిక్షను సంవత్సరానికి కుదిస్తూ దుబాయి కోర్టు తీర్పు వెలువరించింది. అంతేకాదు, అతనిపై విధించిన దేశ బహిష్కరణ ఆంక్షలను కూడా ఎత్తివేసింది. అదే సమయంలో 13,216 డాలర్లను జరిమానాగా విధించింది. మరో 9,25,660డాలర్లను బాధిత కుటుంబాలకు పరిహారంగా అందించాలని ఆదేశించింది.
2019,జూన్లో ఒమన్ రాజధాని మస్కట్ నుంచి దుబాయికి ప్రయాణికులతో వస్తున్న బస్సు ఘోర ప్రమాదానికి కారణమైంది. బస్సును రాంగ్ హైవే ఎగ్జిట్ వైపు నడిపించిన ఒమన్ డ్రైవర్... స్టీల్ బారియర్ను వేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో 17 మంది అక్కడికక్కడే మృతి చెందగా ఇందులో 12 మంది భారతీయులు ఉండటం గమనార్హం. మిగిలినవారిలో ఇద్దరు పాకిస్తానీలు,ఒక ఐరిష్ వ్యక్తి,ఒక ఒమన్ దేశస్తుడు,ఫిలిపినాకు చెందిన ఒకరు ఉన్నారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 31 మంది ప్రయాణికులు ఉండగా... ఇందులో బంగ్లాదేశ్,జర్మనీ,ఫిలిప్పీన్ దేశస్తులు కూడా ఉన్నారు.
ప్రమాదానికి కారణమైన ఆ ఒమన్ డ్రైవర్ విచారణలో నేరం అంగీకరించాడు. బస్సు నడుపుతున్న సమయంలో అకస్మాత్తుగా సూర్య కాంతి కళ్లలో పడటంతో డ్రైవింగ్పై నియంత్రణ కోల్పోయినట్లు చెప్పాడు. దీంతో అతనికి కోర్టు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అయితే ఈ తీర్పును అతను పై కోర్టులో సవాల్ చేశాడు. నిజానికి బారియర్ను తప్పుడు స్థానంలో పెట్టడం వల్లే ప్రమాదం జరిగిందని పిటిషన్లో పేర్కొన్నాడు. దీనిపై విచారణ చేపట్టిన దుబాయి కోర్టు అతనికి విధించిన శిక్షను తగ్గిస్తూ తీర్పు వెలువరించింది.