షాబాజ్ షరీఫ్: పాకిస్తాన్ ప్రధాని పదవిని చేపట్టనున్న ఈయనకూ, కశ్మీర్కూ ఏంటి సంబంధం?
"మీరు పూలన్నిటినీ తెంపేయవచ్చు. కానీ, వసంతం రాకుండా మాత్రం అడ్డుకోలేరు"
ఇమ్రాన్ ఖాన్ శనివారం అర్ధరాత్రి పాకిస్తాన్ ప్రధాని పదవికి రాజీనామా చేస్తుండగా, పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు షాబాజ్ షరీఫ్ అన్న మాటలివి.
ఇమ్రాన్ ఖాన్ రాజకీయ భవితవ్యం ప్రమాదంలో పడింది. ఆయన అధికారంలో ఉండేందుకు నేషనల్ అసెంబ్లీలో తగినంత ఆధిక్యతను సంపాదించలేకపోయారు.
ఈ పరిస్థితుల్లో షాబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధాని అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆయన ప్రధాని అవుతాననే ఆశతోనే వసంతం, పూల గురించి మాట్లాడి ఉంటారు.
షాబాజ్ షరీఫ్ ఎవరు?
షాబాజ్ షరీఫ్ పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు. నవాజ్ షరీఫ్ అవినీతి ఆరోపణల పై అరెస్టు అయ్యారు. ఆయన జైలు నుంచి విడుదలయి దేశం విడిచి పెట్టి వెళ్లినప్పటి నుంచి తిరిగి దేశంలో అడుగుపెట్టలేదు. ఆయనకు విదేశాల్లో చికిత్స జరుగుతోంది. నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని ఓడించి ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చారు.
పాకిస్తాన్లో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి షాబాజ్ షరీఫ్ కు చాలా సార్లు అవకాశం దక్కింది కానీ, ఆయన తన వైఖరిని మార్చుకోలేదు.
పంజాబ్ ముఖ్య మంత్రిగా ఎన్నికైనప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీ నాయకునిగా ఎదిగిన షాబాజ్ షరీఫ్ రాజకీయ ప్రయాణం ఆసక్తికరంగా ఉంటుంది.
ఆయన ప్రసంగాలు, ర్యాలీలు జరిగే సమయంలో విప్లవాత్మక గేయాలు చదువుతూ ఉంటారు.
బహిరంగ సమావేశాల్లో జుల్ ఫికర్ అలీ భుట్టోను అనుకరించే ప్రయత్నం చేస్తూ మైకును కింద పడేయటం లాంటివి చేసేవారు. ఈ రకమైన ప్రవర్తనను పాకిస్తాన్ టీవీ చానెళ్లు కూడా ఎగతాళి చేశాయి.
- ఆయనకు 49, ఆమెకు 18.. పాకిస్తాన్ ఎంపీ మూడో పెళ్లి
- ఒకరు భారత్లో, మరొకరు పాకిస్తాన్లో.. 75 ఏళ్ల తరువాత ఈ అన్నదమ్ములు ఎలా కలిశారు
వ్యాపార కుటుంబంలో పుట్టుక
షాబాజ్ షరీఫ్ పాకిస్తాన్ లోని ప్రముఖ వ్యాపారవేత్తల కుటుంబంలో పుట్టారు. ఆయన కశ్మీర్ మూలాలున్న పంజాబీ అని డైలీ టైమ్స్ వెబ్ సైట్ పేర్కొంది. ఆయన జమ్మూ కశ్మీర్ లోని మియన్ తెగకు చెందినవారు.
షరీఫ్ కుటుంబం కశ్మీర్లోని అనంత్ నాగ్ ప్రాంతానికి చెందిన వారని ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం పేర్కొంది. వారు తర్వాత వ్యాపార రీత్యా అమృత్ సర్ లోని జతి ఉమ్రా గ్రామానికి వెళ్లారు.
అక్కడ నుంచి లాహోర్ వెళ్లారు.
షాబాజ్ షరీఫ్ తల్లి కశ్మీర్లోని పుల్వామా ప్రాంతానికి చెందినవారు.
ఆయన చదువు పూర్తి కాగానే, పాకిస్తాన్ లోని ఇత్తెఫాక్ వ్యాపార సంస్థ విజయానికి కీలక పాత్ర పోషించారు. ఈ గ్రూపును ఆయన తండ్రి మొహమ్మద్ షరీఫ్ ప్రారంభించారు.
"ఇత్తెఫాక్ గ్రూపు పాకిస్తాన్లోనే అత్యంత భారీ వ్యాపార సంస్థ అని డాన్ వెబ్ సైటు తెలిపింది.
ఈ సంస్థ చక్కర, వస్త్రాలు, స్టీల్ లాంటి రకరకాల పరిశ్రమలకు అధిపతిగా ఉంది. షాబాజ్ షరీఫ్ ఈ గ్రూపుకు సహయజమానిగా వ్యవహరిస్తున్నారు.
షాబాజ్ షరీఫ్ పేరున్న కుటుంబంలో జన్మించారు. మొదట్లో ఆయన సోదరుడు నవాజ్ షరీఫ్ పనుల్లో సహాయంగా ఉండేవారు. సోదరుని సహాయంతో ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు.
- ఇమ్రాన్ ఖాన్ భార్య ఫ్రెండ్ ఫరాఖాన్ ఎవరు, పాకిస్తాన్లో ఈమె పేరు ఎందుకు మారుమోగుతోంది?
- ఇమ్రాన్ ఖాన్ చేసిన తప్పులేంటి... అందుకే ఆయనకు మిత్రులు దూరమయ్యారా?
రాజకీయ ప్రవేశం
షాబాజ్ షరీఫ్ 1985లో లాహోర్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.
1988లో పంజాబ్ శాసన సభకు ఎన్నిక కావడంతో ఆయన రాజకీయ ప్రయాణం మొదలయింది.
కానీ, అసెంబ్లీని మధ్యలోనే రద్దు చేయడంతో ఆయన పదవీ కాలం పూర్తి చేసుకోలేకపోయారు.
ఆ తర్వాత ఆయన జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.
1990లో ఆయన నేషనల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అదే సమయంలో నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధానిగా ఎన్నికయ్యారు.
నవాజ్ షరీఫ్ ప్రధానిగా ఉన్నంత కాలం షాబాజ్ షరీఫ్ నేషనల్ అసెంబ్లీలో ఉన్నారు.
1993లో నవాజ్ షరీఫ్ సైన్యం నుంచి వచ్చిన ఒత్తిడితో ప్రధాని పదవి నుంచి తప్పుకోవల్సి వచ్చింది. అప్పటి నుంచి 1996 వరకు షాబాజ్ షరీఫ్ పంజాబ్ శాసన సభలో ప్రతిపక్ష నాయకునిగా వ్యవహరించారు.
1997లో ఆయన పంజాబ్ శాసన సభకు మూడవ సారి ఎన్నికయ్యారు. ఆ ఏడాది ఆయన ముఖమంత్రి పదవిని చేపట్టారు.
సైనిక తిరుగుబాటులో అరెస్టు
షాబాజ్ షరీఫ్ పంజాబ్ ముఖ్యమంత్రిగా అయిన రెండేళ్ల తర్వాత పాకిస్తాన్ లో సైనిక తిరుగుబాటు చోటు చేసుకుంది. అక్టోబరు 12, 1999 సాయంత్రం జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ ప్రభుత్వాన్ని కూలదోశారు. ఆ సమయంలో షాబాజ్ షరీఫ్ ను కూడా అరెస్టు చేశారు.
ఏప్రిల్ 2000లో నవాజ్ షరీఫ్ కు కూడా జైలు శిక్ష విధించారు.
ఆయన ముషర్రఫ్ విమానాన్ని హైజాక్ చేసినందుకు, తీవ్రవాద ఆరోపణల పైన శిక్ష విధించారు. 8 నెలల తర్వాత పాకిస్తాన్ మిలిటరీ ప్రభుత్వం నవాజ్ షరీఫ్కు క్షమా భిక్ష పెట్టింది. ఆయనను 40 మంది కుటుంబ సభ్యులతో సహా సౌదీ అరేబియాకు పంపారు.
ఈ 40 మంది కుటుంబ సభ్యుల్లో షాబాజ్ షరీఫ్ కూడా ఉన్నారు.
2004లో పాకిస్తాన్లో అరెస్ట్ అయ్యే ముప్పు ఉన్నప్పటికీ ఆయన అబుదాబీ నుంచి లాహోర్ వచ్చారు. కొన్ని గంటల్లోనే ఆయనను వెనక్కి తిరిగి సౌదీ అరేబియాకు పంపినట్లు రాయిటర్స్ కథనం తెలిపింది.
- రాజ్ కపూర్ను కలిసేందుకు పాకిస్తానీ సైనికులు వచ్చినప్పుడు ఏమైందంటే
- 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధం: కరాచీపై భారత్ యుద్ధ నౌకలు దాడిచేసినప్పుడు ఏమైందంటే
తిరిగి పాకిస్తాన్కు...
షాబాజ్ షరీఫ్, నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ తిరిగి రావచ్చని చెబుతూ పాకిస్తాన్ సుప్రీం కోర్టు ఆగస్టు 23, 2007లో చరిత్రాత్మక తీర్పును ఇచ్చినట్లు పాకిస్తాన్ టీవీ చానెల్ జియో న్యూస్ ప్రసారం చేసింది. వారు జాతీయ రాజకీయాల్లో పాల్గొనేందుకు అనుమతి కూడా ఇచ్చింది.
నవంబరు 2007లో షాబాజ్,సోదరుడు నవాజ్తో కలిసి పాకిస్తాన్ తిరిగి వచ్చారు. 2008లో నవాజ్ షరీఫ్ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పిఎంఎల్-ఎన్) ఓట్లను సాధించగలిగింది కానీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది.
మరో వైపు 2008లో షాబాజ్ షరీఫ్ పంజాబ్ శాసన సభకు నాలుగవ సారి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఐదేళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు.
2013లో పాకిస్తాన్ సాధారణ ఎన్నికలు జరిగాయి. నవాజ్ షరీఫ్ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ పంజాబ్లో అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.
షాబాజ్ షరీఫ్ పంజాబ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. మరో వైపు నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధాని అయ్యారు.
షాబాజ్ షరీఫ్కు ముఖ్యమంత్రి అని పిలిపించుకోవడం కంటే ఖదం-ఈ- అలా (పంజాబ్ ముఖ్య సేవకుడు) అని పిలిస్తే ఇష్టం.
- భారత్ శాకాహార దేశమేమీ కాదు... మరి మాంసాహరం తినవద్దని ఎందుకు గొడవ చేస్తున్నారు?
- మత రాజకీయాలు బెంగళూరు ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయా
మారిన లాహోర్ ముఖచిత్రం
"షాబాజ్ షరీఫ్ ఉత్తమ మేనేజర్" అని పాకిస్తాన్ రాజకీయ విశ్లేషకుడు సుహైల్ వరైచ్ అన్నారు. ఆయన ఒక్క లాహోర్ ముఖచిత్రాన్నే కాకుండా పంజాబ్ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేందుకు కృషి చేశారు".
"పంజాబ్లో జరిగిన అభివృద్ధికి ఆయనకు పేరుంది. మెట్రో బస్, ఆరెంజ్ ట్రైన్లను అందుబాటులోకి తెచ్చిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది" అని సుహైల్ అన్నారు.
షాబాజ్ షరీఫ్ 2అస్తి రోటీ ' ల్యాప్ టాప్ పథకాలను ప్రవేశపెట్టారు. అయితే, ఈ పధకాలు చాలా విమర్శలకు కూడా గురయ్యాయి. అయన ప్రవేశపెట్టిన ఆషియానా హోసింగ్ పథకానికి చాలా ప్రశంసలొచ్చాయి.
పార్టీ అధ్యక్షునిగా నవాజ్ షరీఫ్కు అర్హత లేదని సుప్రీం కోర్టు ప్రకటించినప్పుడు షాబాజ్ షరీఫ్ పార్టీ తాత్కాలిక అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.
జైలులో చాలా రోజులు
పాకిస్తాన్ లో 2018లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పి ఎం ఎల్ ఎన్ షాబాజ్ షరీఫ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది. ఆ ఎన్నికల్లో తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ మెజారిటీ సాధించి ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవిని చేపట్టారు. షాబాజ్ షరీఫ్ ఈ ఎన్నికల్లో ఓటమి సాధించినప్పటికీ ప్రతిపక్ష పార్టీ నాయకునిగా ఎంపికయ్యారు.
షాబాజ్ షరీఫ్ బెయిల్ విజ్ఞప్తిని తిరస్కరించిన తర్వాత ఆయనను మనీ లాండరింగ్ కేసులో అరెస్టు చేసినట్లు డాన్ పత్రిక ప్రచురించింది. ఆయన లాహోర్లోని 7 నెలల పాటు జైలులో ఉన్నారు.
అదే సమయంలో ఇమ్రాన్ ఖాన్ సలహాదారు షాజాద్ అక్బర్ కూడా షాబాజ్ కొడుకులు హంజా, సల్మాన్ పై మనీ లాండరింగ్ ఆరోపణలు చేశారు. అరెస్టుకు ముందు షాబాజ్ షరీఫ్ కూడా ఇమ్రాన్ ఖాన్ పై ఆరోపణలు చేశారు.
- యుక్రెయిన్ మీద యుద్ధానికి రష్యాకు ఎంత ఖర్చవుతోంది?
- ఆంధ్రప్రదేశ్ : విద్యుత్ కోతలపై ఆన్లైన్లో మీమ్లు - 'పవర్ రాలేదా పుష్పా’
ఇమ్రాన్కు వ్యతిరేకంగా..
షాబాజ్ షరీఫ్ మే 24 2021న ప్రతిపక్ష పార్టీల నాయకులను విందుకు ఆహ్వానించారు. ఈ విందు ఇస్లామాబాద్లో జరిగింది. అదే సమయంలో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
అప్పటి నుంచి ప్రతిపక్షాలు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని అన్ని వైపుల నుంచి చుట్టముట్టడం మొదలుపెట్టాయి. పాకిస్తాన్ రాజకీయాల్లో అనేక మలుపులు చోటు చేసుకున్నాయి.
ఒకరి తర్వాత ఒకరు తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీకి మిత్రపక్షాలన్నీ మద్దతును ఉపసంహరించడం మొదలుపెట్టాయి. దీంతో, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి మెజారిటీ పడిపోయింది.
342 మంది సభ్యులున్న నేషనల్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానాన్ని గెలవాలంటే 172 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. కావల్సినంత ఆధిక్యత లభించకపోవడంతో ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
"నవాజ్ షరీఫ్ కంటే కూడా షాబాజ్ షరీఫ్కు సైన్యంతో మెరుగైన సంబంధాలున్నాయి" అని సుహైల్ వరైచ్ అన్నారు. "ఆయనకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. ఆయన ఉత్తమ కార్యనిర్వాహకుడు. ఆయనకు పరిస్థితులను అదుపులో పెట్టే సామర్ధ్యం ఉంది" అని అన్నారు.
- పాకిస్తాన్: ప్రధాని పదవి కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్
- పాకిస్తాన్: ఒకే అంశంపై ఇమ్రాన్ ఖాన్ది ఒక మాట.. సైన్యానిది మరో మాట
తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న కొడుకు
"2003లో షాబాజ్ షరీఫ్ తెహ్మీనా దుర్రానీని పెళ్లి చేసుకున్నారు. ఆమె మూడవ భార్య. ఈ పెళ్ళిలో ఆయనకు పిల్లలు లేరు. ఆయనకు
మొదటి భార్య ద్వారా ఇద్దరు కొడుకులు, రెండవ భార్యతో ఒక కూతురు ఉన్నారు.
షాబాజ్ షరీఫ్ కొడుకు హంజా షరీఫ్ సెప్టెంబరు 1974లో లాహోర్లో పుట్టారు. ఆయన లాహోర్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఎల్ఎల్బీ డిగ్రీ పూర్తి చేసుకున్నారు.
ఆయన వరుసగా రెండు సార్లు 2008లో, 2013లో పాకిస్తాన్ పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం పంజాబ్ శాసన సభలో ప్రతిపక్ష పార్టీ నాయకునిగా ఉన్నారు. ఆయన పంజాబ్ స్పోర్ట్స్ బోర్డుకు అధ్యక్షునిగా కూడా పని చేశారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్: ప్రధాని పదవి కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్
- గని రివ్యూ: బాక్సింగ్ రింగ్లో తడబడ్డ... హీరోయిజం
- నవరాత్రి వేడుకల సమయంలో మాంసం షాపులను ఎందుకు మూయించేస్తున్నారు? అసలు మాంసం తినని వారు ఎంత మంది?
- షాంఘై లాక్డౌన్: ఆహారం దొరకడం లేదంటున్న కొందరు స్థానికులు
- ఇమ్రాన్ ఖాన్ భార్య ఫ్రెండ్ ఫరాఖాన్ ఎవరు, పాకిస్తాన్లో ఈమె పేరు ఎందుకు మారుమోగుతోంది?
- పుతిన్కు ఎంతమంది పిల్లలు.. వాళ్లు ఎక్కడున్నారు.. ఏంచేస్తుంటారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)