ప్రతి పాకిస్తానీ అభిప్రాయం అదే: కాశ్మీర్ మీద వ్యాఖ్యలపై అఫ్రిదీకి శివసేన కౌంటర్
లాహోర్/ముంబై: పాకిస్తాన్కు కాశ్మీర్ అవసరం లేదని, భారత్కు కూడా ఆ రాష్ట్రాన్ని ఇవ్వొద్దని, కాశ్మీర్ను ప్రత్యేక దేశంగా ఉంచాలన్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అప్రీది వ్యాఖ్యలకు శివసేన కౌంటర్ ఇచ్చింది. ఈ మేరకు తమ పార్టీ పత్రిక సామ్నాలో సంపాదకీయం రాసింది.
అఫ్రిది భారత్ వ్యతిరేకి అని, అతను గతంలో కూడా భారత్ మీద మాట్లాడారని, భారత భద్రతా బలగాలు హతమార్చిన పదమూడు మంది ఉగ్రవాదుల మీద ఆయన సానుభూతి ప్రకటించారని, కాశ్మీర్ను స్వతంత్ర దేశంగా ఉంచాలంటూ డిమాండ్ చేశారని మండిపడింది.
పాకిస్తాన్ ప్రభుత్వం, ఆ దేశ మిలిటరీ చీఫ్ దేశాన్ని పరిపాలించడం మీద దృష్టి పెట్టడం కంటే భారత్కు హాని చేయడం మీదే దృష్టి పెడతారని, అందుకే స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఏళ్లయనా ఇంకా బయట అప్పుల మీదే పాకిస్తాన్ ఆధారపడుతోందని శివసేన విమర్శించింది.
అవినీతి, ఉగ్రవాదానికి మద్దతిచ్చి పాకిస్తాన్ పేద దేశంగా మారిందని, ప్రధాని నివాసంలోని వాహనాలను, పశువులను అమ్ముకోవడం ఒక్కటే ముందున్న పరిష్కారమని ఎద్దేవా చేసింది. ఆర్థిక వ్యవస్థ కోసం ప్రతి దేశానికి నిధులు కావాలని, ఐఎంఎఫ్ కాదంటే పాకిస్తాన్ సాయం కోసం చైనాను ఆశ్రయించిందని, ఇక కాశ్మీర్ గురించి ఏం పట్టించుకుంటుందని, కేవలం అఫ్రిదినే కాదు ప్రతి ఒక్క పాకిస్థానీ ఆలోచన అదేనని, అయినా అక్కడ సాధారణ పౌరుడిని ఎవరు అడుగుతారులే అని విమర్శించింది.