ఓర్లాండో కాల్పులపై ప్రణబ్, 'పల్స్' క్లబ్ ఆసక్తికర చరిత్ర
న్యూఢిల్లీ: అమెరికాలోని ఓర్లాండోలో జరిగిన దాడిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఖండించారు. ఈ ఘటన తమను షాకింగ్కు గురి చేసిందని ఆయన చెప్పారు. ఈ దాడి తీవ్రంగా కలచి వేసిందని, బాధాకరమని ఓ ప్రకటనలో రాష్ట్రపతి పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
ఇస్లామిక్ సంఘాల ఖండన
నైట్ క్లబ్పై జరిగిన దాడిని అమెరికాలోని ముస్లిం సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది అత్యంత అటవిక చర్య అని కౌన్సిల్ ఆఫ్ ఇస్లామిక్ సంఘాలు పేర్కొన్నాయి. ఎల్జీబీటి సమాజం పట్ల తమకు సానుభూతి ఉందని, వాళ్లు కూడా ఇస్లామిక్ను సమర్థిస్తున్నారని సంఘాలు పేర్కొన్నాయి.

కాగా, పల్స్ నైట్ క్లబ్ దాడి నుంచి ప్రాణాలతో బయటపడినవారు జరిగిన సంఘటనను గుర్తు చేసుకుని భయాందోళనకు లోనవుతున్నారు. ఒమర్ మతీన్ కాల్పుల నుంచి కొంతమంది సురక్షితంగా బయటపడ్డారు. కాల్పుల శబ్దం వినడం మినహా ఏం జరిగిందో అర్థం కాలేదంటున్నారు.
సురక్షితంగా బయటపడిన వ్యక్తి మాట్లాడుతూ... జరిగిన సంఘటన తలచుకుంటే మాట్లాడడానికే భయమేస్తోందన్నాడు. రాత్రి ఎలా గడిపానో తనకే అర్థం కావడంలేదన్నాడు. మూడు గంటల పాటు స్నానాల గదిలో దాక్కున్నానని చెప్పాడు.
తుపాకీ శబ్ధం వినిపించిన ప్రతీసారీ తన స్నేహితుడు చనిపోయాడనుకున్నానని, అక్కడ ఉన్నవాళ్లందరూ తన స్నేహితులేనని, వాళ్లను సజీవంగా చూడాలని అనుకున్నానని చెప్పాడు. అది ఆనందంగా గడపాల్సిన ప్రదేశమని, తమ ఆనందానికి అడ్డుతగులుతూ ఒక్కడు బీభత్సం సృష్టించాడన్నాడు.
పల్స్ క్లబ్కు ఆసక్తికర చరిత్ర
కాల్పుల కేంద్రంగా నిలిచిన 'పల్స్ నైట్ క్లబ్'కు ఆసక్తికర చరిత్ర ఉంది. క్లబ్ సహ యజమానురాలైన బార్బారా పోమా.. ఎయిడ్స్ వ్యాధితో పోరాడుతూ మరణించిన తన సోదరుడి జ్ఞాపకార్థం 2004లో రాన్ లెగ్లెర్ అనే భాగస్వామితో కలిసి 'పల్స్'ను స్థాపించింది.
స్వలింగ సంపర్కులు, లింగ మార్పిడి చేసుకున్న వ్యక్తుల హక్కుల పరిరక్షణకు ఈ క్లబ్ కృషి చేస్తోంది. స్వలింగ సంపర్కులకు మద్దతుగా అనేక కార్యక్రమాలను చేపడుతోంది. లాటిన్ సంగీతం, నృత్య ప్రదర్శనలు, మద్యం ఈ పబ్లో ప్రధాన ఆకర్షణ.












Click it and Unblock the Notifications