12వ సారి: సింగపూర్లో అధికార పార్టీదే గెలుపు
సింగపూర్ సిటీ: సింగపూర్ పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ (పీఏపీ) వరుసగా 12వ సారి ఘనవిజయం సాధించి రికార్డు సృష్టించింది. సింగపూర్కు 1965లో స్వాతంత్య్రం లభించిన నాటి నుంచి ఆ దేశంలో ఇంతవరకు మరో పార్టీ అధికారానికి రాకపోవడం గమనార్హం.
పార్లమెంట్లో 89 సీట్లుండగా, పీఏపీ 83 గెలుచుకుంది. ప్రతిపక్ష వర్కర్స్ పార్టీకి ఆరుసీట్లు మాత్రమే దక్కాయి. ప్రతిపక్షానికి క్రితంసారి కన్నా ఒక సీటు తగ్గగా అధికారపార్టీకి పది శాతం ఓట్లు పెరగడం విశేషం.
పోలైన ఓట్లలో పీఏపీకి 69.86 శాతం ఓట్లు లభించాయి. తమ పార్టీకి ఇంత భారీ విజయాన్ని ఇచ్చిన సింగపూరియన్లకు ప్రధానమంత్రి లీ సీన్ లూంగ్ శనివారం ధన్యవాదాలు తెలిపారు.

ఈజిప్టు ప్రధాని రాజీనామా
కైరో: తన మంత్రివర్గ సహచరులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడం, ఏకంగా ఓ మంత్రి అరెస్టు కూడా కావడంతో ఈజిప్టు ప్రధాని ఇబ్రహీం మహలబ్ రాజీనామా చేశారు. దీంతో మహలబ్ మంత్రివర్గంలో పోట్రోలియం శాఖ మంత్రిగా ఉన్న షరీఫ్ ఇస్మాయిల్ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని దేశాధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్ సిసీ శనివారం ఆహ్వానించారు.
మహలబ్ సమర్పించిన రాజీనామాను సిసీ ఆమోదించారని అధ్యక్ష భవనం ఒక ప్రకటనలో వెల్లడించింది. సిసీ అధికారానికి వచ్చిన తరువాత నిరుడు జూన్ 17న మహలబ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
నిజానికి గత సంవత్సరం ప్రారంభంలోనే ఈజిప్టు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ ప్రతిపక్ష ఇస్లామిస్టులను ప్రభుత్వం అణచివేస్తున్నదన్న మానవ హక్కుల సంస్థల ఆరోపణలతో ఎన్నికలు వాయిదా పడుతున్నాయి.












Click it and Unblock the Notifications