పిల్లల్ని కనండి.. రూ.47 లక్షలు తీసుకోండి: ప్రభుత్వ బంపర్ ఆఫర్
ఈ రోజుల్లో పిల్లల్ని కని, పెంచి పెద్ద చేయడం సాధారణ విషయమేమీ కాదు. అయితే, "మీరు పిల్లల్ని కనండి.. వారిని పెంచే బాధ్యతలో మేము అండగా ఉంటాం" అంటూ ఒక దేశం ముందుకొచ్చింది. పిల్లల కొరతతో తీవ్ర ఆందోళన చెందుతున్న ఆసియా ధనిక దేశం సింగపూర్, ప్రతి పసికందుకు రూ.47 లక్షల వరకు భారీ సహాయం అందించేందుకు సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. జనాభా వేగంగా తగ్గిపోతుండటంతో, దేశ భవిష్యత్తును కాపాడుకునేందుకు అక్కడి ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని పెంచుతూ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటైన సింగపూర్లో పిల్లల్ని కనేందుకు యువ జంటలు తీవ్ర అనాసక్తి చూపిస్తున్నాయి. ఉన్నత విద్య, ఉద్యోగాల్లో బిజీ కావడం, పెరిగిన జీవన వ్యయం వల్ల చాలామంది పెళ్లిళ్లకు, పిల్లలకు దూరంగా ఉంటున్నారు. 2024లో అక్కడి సంతానోత్పత్తి రేటు 0.97 ఉండగా, 2025 నాటికి అది 0.87కి పడిపోయింది. సాధారణంగా ఒక దేశ జనాభా స్థిరంగా ఉండాలంటే ఈ రేటు 2.1గా ఉండాలి. కానీ, దానికి సగానికంటే తక్కువగా నమోదవుతుండటంతో రాబోయే రోజుల్లో పనిచేసే యువత తగ్గిపోయి, వృద్ధుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.

ఒకేసారి కాదు.. 17 ఏళ్ల పాటు సుదీర్ఘ సాయం
ఆగస్టు 23న జరిగిన జాతీయ దినోత్సవ కార్యక్రమంలో సింగపూర్ ప్రధాని లారెన్స్ వోంగ్ ఈ నూతన ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం కింద ప్రతి సింగపూర్ పౌరుడికి పుట్టినప్పటి నుంచి 17 ఏళ్లు వచ్చే వరకు వివిధ రూపాల్లో మొత్తం 70,000 సింగపూర్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 47 లక్షలు) అందజేస్తారు. అయితే, ఈ డబ్బును ఒకేసారి చేతిలో పెట్టరు. పిల్లలు పెరిగే క్రమంలో అయ్యే ఖర్చులకు తగినట్లుగా నగదు బహుమతులు, చైల్డ్ డెవలప్మెంట్ ఖాతా డిపాజిట్లు, విద్యుత్-వైద్య రాయితీలు , 17వ ఏట ఉన్నత చదువుల కోసం ఇచ్చే ప్రత్యేక నిధుల రూపంలో విభజించి ఇస్తారు.
పెళ్లిళ్లతో సంబంధం లేకుండా అందరికీ సమాన హక్కులు
పాత పథకాల్లో ఉన్న కొన్ని కీలక నిబంధనలను సవరిస్తూ సింగపూర్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో మొదటి, రెండో సంతానానికి వేర్వేరుగా సహాయం ఉండేది. కానీ 2027 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రాబోయే కొత్త విధానంలో పిల్లల వరుస సంఖ్యతో సంబంధం లేకుండా అందరికీ సమాన స్థాయిలో లబ్ధి చేకూరుస్తారు. మరో విశేషమేమిటంటే.. తల్లిదండ్రుల వివాహ హోదాతో సంబంధం లేకుండా సింగపూర్ పౌరసత్వం ఉన్న ప్రతి పసికందుకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. దీంతో పాటు ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులకు చైల్డ్ కేర్ లీవ్లను పెంచుతూ, ఆ భారాన్ని కంపెనీలపై పడకుండా ప్రభుత్వమే భరిస్తోంది.
డబ్బు ఒక్కటే సమస్యను పరిష్కరిస్తుందా?
కేవలం డబ్బులు ప్రకటించినంత మాత్రాన ప్రజలు వెంటనే పిల్లల్ని కనడానికి సిద్ధపడరనే విషయాన్ని ప్రధాని లారెన్స్ వోంగ్ స్వయంగా అంగీకరించారు. పిల్లలను కనడం అనేది దంపతుల వ్యక్తిగత నిర్ణయమని, ప్రభుత్వం చేయగలిగిందల్లా ఆ నిర్ణయాన్ని తేలిక చేయడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్థిక భారాన్ని తగ్గించి, ఉపాధి-కుటుంబ జీవితాల మధ్య సమతుల్యత సాధించే వాతావరణాన్ని కల్పించడం ద్వారా కొంతమంది జంటలైనా సానుకూలంగా ఆలోచిస్తారని సింగపూర్ ప్రభుత్వం ఆశిస్తోంది. మరి ఈ భారీ ప్యాకేజీతోనైనా సింగపూర్లో పిల్లల సంఖ్య పెరుగుతుందో లేదో వేచి చూడాలి!














Click it and Unblock the Notifications