కొండచిలువను దొంగిలించి ప్యాంటులో ఇలా(వీడియో)
పోర్ట్లాండ్: ఏ దొంగైన సాధారణంగా దుకాణం లేదా షాపింగ్ మాల్కి వెళితే అక్కడ ఉన్న విలువైన వస్తువులు, డబ్బులు దొంగలిస్తాడు. కానీ, ఈ దొంగ మాత్రం పెట్ షాపునకు వెళ్లి ఏకంగా కొండ చిలువనే దొంగిలించాడు. అంతేగాక, దాన్ని తన ప్యాంటులో వేసుకుని దాచేసి అక్కడ్నుంచి ఉడాయించేశాడు. ఈ ఘటన అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే... ఓరెగాన్ రాష్ట్రం పోర్ట్ల్యాండ్లో ‘ఏ టు జడ్ పెట్స్' అనే పెంపుడు జంతువుల దుకాణం ఉంది. దానిలో ఉండాల్సిన రెండడుగుల కొండచిలువ గత శుక్రవారం కనిపించకుండా పోయింది. దీంతో దుకాణ యజమానులు సీసీటీవీ ఫుటేజీల్ని పరిశీలించారు.
ఓ వ్యక్తి దాన్ని దొంగలించి తన ప్యాంటులో దాచి బయటకు తీసుకెళ్లిన దృశ్యాల్ని చూసి అవాక్కయ్యారు. ఈ విషయమై దుకాణ యజమాని బుజ్గన్ మాట్లాడుతూ.. అది పాము ఆహారం తీసుకునే రోజు కాదు కాబట్టి సరిపోయిందిగాని లేదంటే అతని పరిస్థితి వేరేలా ఉండేదని చెప్పారు.
కాగా, దాని ధర 200 డాలర్ల వరకు ఉంటుందని తెలిపారు. పామును దొంగిలించినందుకు పోలీసులకు చెప్పి అతడిని అరెస్టు చేయించలేదని, ఆ దొంగ ఎక్కడుంటాడు? ఏం చేస్తుంటాడు? అన్నీ తమకు తెలుసని చెప్పారు. అందుకని అతడే పామును వెనక్కి తీసుకొచ్చి ఇస్తాడని తాము భావిస్తున్నట్లు తెలిపారు.