సోషల్ మీడియా ఎఫెక్ట్: ప్రతి ముగ్గురిలో ఒకరు గత ఏడాదిగా ఒక పుస్తకం చదలేదట!
టెక్నాలజీ పెరుగుతోంది. సాంకేతికత ప్రపంచ దిశ దశను మారుస్తోంది. యువత టెక్నాలజీ వైపు అడుగులు వేస్తోంది. స్మార్ట్ ఫోన్ల విప్లవంతో అరచేతిలోనే ప్రపంచాన్ని చూస్తోంది యువత. ఇక సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచంలో ఏమిజరుగుతోందో తెలుసుకుంటోంది. దేశం నలుమూలల నుంచి ప్రపంచంలోని ఏమూలనున్న వారినైనా సోషల్ మీడియా ద్వారా పలకరిస్తోంది.
అంతలా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కింది. మితిమీరిపోతున్న సోషల్ మీడియా సైట్లకు అలవాటు పడిన యూత్ చిన్నవయస్సులోనే అనేక ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. వీరితో పాటు మరికొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
తాజాగా అమెరికా సంస్థ చేసిన ఓ పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. సోషల్ మీడియాకు అలవాటు పడిన యువత పుస్తకాలనే మరిచిపోయిందని ఈ పరిశోధన తేల్చింది. ప్రతి ముగ్గురు టీనేజర్లలో ఒకరు పుస్తకం అనే పదాన్నే మర్చిపోయారట. ఒకప్పుడు పుస్తకాల పురుగులుగా ఉండే యువత సోషల్ మీడియా విప్లవంతో ఆ పుస్తకాలనే పక్కనపెట్టేసి సోషల్ మీడియా వెబ్సైట్స్కు అతుక్కుపోయినట్లు పరిశోధన వెల్లడించింది.
ఇది కచ్చితంగా ప్రమాదంగా పరిణమించే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు. ప్రతి ముగ్గురిలో ఒకరు ఏడాదికి ఒక పుస్తకం చదివుతున్నారట. 70వ దశకాల్లో 60శాతం మంది యువత పుస్తకాల పురుగులుగా ఉండేవారట. నేడు మాత్రం కేవలం 16శాతం యువతే పుస్తకాలు చదువుతోందని పరిశోధన వెల్లడించింది.
సోషల్ మీడియా వినియోగం 2006 నుంచి 2016 వరకు రోజుకు గంట లేదా రెండు గంటలు ఉండేదట..కానీ ఇప్పుడు సోషల్ మీడియా యువత జీవితంలో ఒక భాగమైందని చెబుతున్నారు పరిశోధకులు. ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యువత చదువులపై ఇది తీవ్ర ప్రభావం చూపడమే కాదు... పాఠ్యపుస్తకాల్లోని పాఠాలు కూడా అర్థం చేసుకోలేనంతగా ప్రభావితం చేస్తాయని పరిశోధకు చెబుతున్నారు. పుస్తకాలపై దృష్టి సారించడం కూడా కష్టతరమే అవుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా యువత మేల్కోలేదంటే పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉందని పరిశోధకులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నారు.