రాహుల్ని బుక్ చేసిన విజయ మాల్యా!: 'బేరం'పై మాల్యా ట్విస్ట్, కోర్టు డెడ్లైన్
లండన్: బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టి లండన్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీని ఇరకాటంలో పడేశారు. రాహుల్ చేసిన ఓ పోస్టును విజయ్ మాల్యా ట్వీట్ చేశాడు. దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి అనిల్ బాలునీ శనివారం విమర్శలు గుప్పించారు.
పక్కా ప్లాన్తో మోడీ కొట్టిన దెబ్బ!: విజయ్ మాల్యా కాళ్ల బేరానికి రావడం వెనుక..?
ఈ ట్వీట్తోనే విజయ్ మాల్యాకు కాంగ్రెస్ పార్టీతో ఉన్న మంచి సంబంధాలు తేలిపోయాయని ఆరోపించారు. ఇప్పుడు అతని రీట్వీట్ మరోసారి వారి మధ్య బంధాన్ని వెలుగులోకి తెచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మాల్యా ఇన్ని వేల కోట్లు బ్యాంకుల నుంచి దక్కించుకున్నారని, ఇప్పుడు తమ ప్రభుత్వం వాటిని వసూలు చేసే ప్రయత్నంలో ఉందన్నారు.
రాహుల్ గాంధీకి మాల్యా ఎండార్స్
పెద్ద చీటర్ విజయ్ మాల్యాకు గ్రాండ్ అలయెన్స్ మద్దతు పలుకుతోందని కాంగ్రెస్ తదితర పార్టీలను ఉద్దేశించి అనిల్ బాలుని విమర్శించారు. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా కూడా రాహుల్ గాంధీ పోస్టును మాల్యా ట్వీట్ చేయడంపై ప్రశ్నించారు. రాహుల్ గాంధీ మోడీకి వ్యతిరేకంగా ట్వీట్ చేశారని, దీనిని మాల్యా రీట్వీట్ చేశారని, కాబట్టి అసలు మాల్యా.. రాహుల్ గాంధీకి ఎందుకు ఎండార్సింగ్ చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు.
మాల్యా దిగొచ్చాడని వార్తలు రావడంపై
ఇదిలా ఉండగా, విజయ్ మాల్యా రెండేళ్ల నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ తాజాగా నోరువిప్పిన విషయం తెలిసిందే. తనపై వచ్చిన ఆరోపణలు ఏమిటో అసలు నిజాలేమిటో వెల్లడించాల్సిన బాధ్యత తనపై ఉందని చెబుతూ ఇటీవల ఓ సుదీర్ఘ లేఖను విడుదల చేశారు. అంతేకాదు రెండేళ్ల క్రితం ప్రధాని మోడీకి, కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీకి లేఖలు రాసినట్లు తెలిపారు. దీంతో మాల్యా బేరానికి దిగొచ్చారంటూ ఈడీ అధికారులు ఆరోపించినట్లు వార్తలు వచ్చాయి.
అదే సిద్ధాంతాన్ని అనుసరించాలి
దీనిపై మాల్యా స్పందించాడు. తనది బేరమైతే ఈడీ అధికారులు కూడా అదే సిద్ధాంతాన్ని అనుసరించాలన్నారు. బ్యాంకులకు రుణాల చెల్లించే ఉద్దేశం తనకుందని, అందుకు ఆస్తులను అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలని మాల్యా బేరసారాలకు ప్రయత్నిస్తున్నారని, ఇలాంటివి మన దేశంలో కుదరదని, ఓ పారిపోయిన నిందితుడికి దేశంలోని నిబంధనలను చెప్పాల్సిన అవసరం లేదని చెప్పినట్లు కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి. దీనిపై మాల్యా స్పందించారు.
ఇలాంటి బేరసారాల ఒప్పందానికి రావాలి
నేను బేరసారాలకు ప్రయత్నిస్తున్నానని ఈడీ అధికారులు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయని, అలా చెప్పిన అధికారులకు వినయపూర్వక సలహా ఒకటేనని, ముందు ఈడీ ఛార్జీషీట్ చదవాలని, అదే నిజమైతే ఈడీ అధికారులు కూడా ఇదే సిద్ధాంతాన్ని అనుసరించి ఎక్కడైతే నా ఆస్తులు ఉన్నాయో ఆ కోర్టుల్లో ఇలాంటి బేరసారాల ఒప్పందానికి రావాలని ఆహ్వానిస్తున్నానని మాల్యా ట్వీట్ చేశారు.
మాల్యాకు కోర్టు డెడ్ లైన్
మరోవైపు, మాల్యాకు పరారీ ఆర్ధిక నేరగాళ్ల ఆర్డినెన్స్ కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 27వ తేదీ లోపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ లోపు రాకుంటే అతడిని పరారీలోని నేరస్థుడిగా ప్రకటిస్తామని కోర్టు హెచ్చరించింది. మాల్యాకు చెందిన రూ.12,500 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసుకుంటుందని కోర్టు పేర్కొంది. ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు అమల్లోకి వచ్చిన ఫ్యూజిటివ్ ఎకనమిక్ అఫెండర్స్ ఆర్డినెన్స్ను ప్రయోగించింది. దీని ప్రకారం పారిపోయిన వ్యక్తుల ఆస్తుల్ని జప్తు చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.