కరోనా షాకింగ్: తీరుమార్చుకున్న వైరస్.. వూహాన్లో మళ్లీ బీభత్సం.. బిడెన్-చైనా బంధంపై ట్రంప్ ఫైర్
అడ్డూఅదుపు లేకుండా విస్తరిస్తోన్న కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 51లక్షల మందిని కాటేసింది. 3.3లక్షల మందిని బలితీసుకుంది. క్లినికల్ ట్రయల్ ఒక్కొక్కటిగా ఫెయిలవుతుండటంతో విరుగుడు వ్యాక్సిన్ ఇప్పుడప్పుడే అందుబాటులోకి వచ్చేలా లేదు. ఓవైపు వైరస్ విజృంభణ కొనసాగుతున్నా.. ఆర్థిక వ్యవస్థలను కాపాడుకోడానికి ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ ఎత్తేసి రీఓపెన్ అయ్యాయి. కార్యకలాపాలు మళ్లీ మొదలైన క్రమంలో కరోనా మరింతగా విస్తరిస్తుందనే భయాలకుతోడు వైరస్ తన లక్షణాలను మార్చుకుంటున్న తీరు కలకలం రేపుతున్నది.

సెకండ్ వేవ్..
ఆరు నెలల కిందట వూహాన్ లో పుట్టిన తొలి వైరస్లు.. ఇప్పుడు వెలుగుచూస్తోన్న వైరస్ల లక్షణాల్లో చాలా తేడాలున్నాయని, ఈ మార్పులతో పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయని సైంటిస్టులు అంటున్నారు. మొదట్లో వైరస్ బాధితుల్ని ఈజీగా కనిపెట్టగలిగిన స్థితి నుంచి ఇవాళ 80 శాతానికిపైగా అసింప్టమాటిక్ కేసులే నమోదయ్య దశ వచ్చిందని, ట్రీట్మెంట్ కు వైరస్ స్పందిస్తున్న తీరులోనూ తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పరిశోధకులు. దీన్ని వైద్యపరిభాషలో కరోనా సెకండ్ వేవ్ గా పిలుస్తున్నారు.

ఆ మార్పులు ఏవంటే..
కరోనా విస్తరించిన తొలి మూడు నెలల్లో.. బాధితుల్లో స్పష్టమైన లక్షణాలు కనిపించేవి. కరోనా సోకిన తర్వాత ఇక్యూబేషన్ పిరియడ్ లోపలే రోగికి దగ్గు, జలుబు, జ్వరం, తలనొప్పి, వికారం.. సీరియస్ కేసుల్లోనైతే శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది తదితర లక్షణాలు బయటపడేవి. కానీ గడిచిన నెలన్నర రోజులుగా వెలుగులోకి వస్తున్న కొత్త కేసుల్లో 85 శాతం అసింప్టమాటిక్ కేసులే ఉండటం గమనార్హం. అంటే, ఒక వ్యక్తికి కరోనా సోకితే రమారమి 5.1రోజుల్లో లక్షణాలు కనిపించాలి, కానీ తాజాగా బయటపడుతోన్న కేసుల్లో గరిష్టంగా రెండు వారాల దాకా రోగిలో లక్షణాలు కనిపించడంలేదు. అంతేకాదు, ఆలస్యంగా లక్షణాలు బయటపడుతోన్న కేసుల్లో వైరస్ తగ్గుదల కూడా అంతే ఆలస్యంగా జరుగుతోంది. అంటే, గతంలో కరోనా సోకిన వ్యక్తికి సరైన ట్రీట్మెంట్ ఇస్తే 14 రోజుల్లో దాన్నుంచి బయపడేవాడు. ఇప్పుడు మాత్రం మహమ్మారి నుంచి కోలుకోడానికి 28 రోజులదాకా పడుతోంది.

వూహాన్లో మళ్లీ విజృంభణ..
కరోనా గండం నుంచి గట్టెక్కామంటూ గర్వంగా ప్రకటించుకుని, లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేసిన చైనా మళ్లీ బొక్కబోర్లా పడింది. ఆ దేశ ఉత్తర సరిహద్దులోని జులిన్, హెయిలాంగ్ జియాన్ రాష్ట్రాల్లో ఈ నెల మొదటి వారం నుంచి వైరస్ మళ్లీ వ్యాపించడంతో రెండోసారి లాక్ డౌన్ విధించారు. రష్యా నుంచి ప్రయాణించినవాళ్లతోనే ఆ రెండు రాష్ట్రాల్లో కేసులు పెరిగాయని చైనా సర్కారు ప్రకటించింది. కానీ అనూహ్యరీతిలో సెంట్రల్ చైనాలో హుబే ఫ్రావిన్స్ లోనూ కొత్త కేసులు భారీగా వస్తుండటం కలకలం రేపింది. తొలుత వైరస్ పుట్టిన వూహాన్ కూడా ఇదే ఫ్రావిన్స్ లో ఉంది. గడిచిన 24 గంటల్లో ఒక్క వూహాన్ సిటీలోనే కొత్తగా 33 పాజిటివ్ కేసులు నమోదుకాగా, అందులో 31 అసింప్టమాటిక్ కేసులే కావడం, వాళ్లెవరికీ ట్రావెల్ హిస్టరీ లేదని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ పేర్కొంది. చైనాలో ఇప్పటిదాకా 82,967 కేసులు నమోదుకాగా, అందులో 78,249మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. 4634 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 84గా ఉంది.

భారత్లో మాత్రం భిన్నంగా..
కరోనా మహమ్మారి ఒక్కో దేశంలో ఒక్కోలా ప్రవర్తిస్తున్న తీరు సైంటిస్టులను గాభరాపరుస్తున్నది. చైనాలో తొలు పుట్టిన వైరస్ కు, ఇప్పుడు విస్తరిస్తోన్న వైరస్ కు చాలా తేడాలున్నాయన్న సైంటిస్టులు.. భారత్ లోని వైరస్ లు మాత్రం ఇంకా భిన్నంగా ప్రవర్తిస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీ జామియా హందర్ద్ వైస్ చాన్సలర్ డాక్టర్ సయీద్ హుస్నేన్ నేతృత్వంలోని పరిశోధక బృందం ఇటీవల 4వేల మంది కొవిడ్-19 రోగులపై పరిశోధనలు జరిపింది. మిగతా దేశాల్లో.. వైరస్ సోకిన ప్రతి 10 లక్షల మందిలో 40 మంది ప్రాణాలు కోల్పోతుంటే, ఇండియాలో మాత్రం ఆ సంఖ్య 2గా ఉండటం విశేషమని, మన దేశంలోకి వ్యాపించిన వైరస్ చైనా నుంచి నేరుగా కాకుండా యూరప్ నుంచి వచ్చింది కావడం వల్లే లక్షణాల్లో మార్పులు చోటుచేసుకుని ఉండొచ్చని, మరిన్ని పరిశోధనల తర్వాత దీనిపై స్పష్టమైన అవగాహన వస్తుందని డాక్టర్ హస్నేన్ అన్నారు. కాగా, అసింప్టమాటిక్ కేసుల నమోదు విషయంలో మిగతా దేశాలకు, మనకు పెద్దగా తేడాలేనప్పటికీ, డెత్ రేటు, రికవరీ రేటులో భారత్ చాలా మెరుగ్గా ఉండటం గమనార్హం.
Recommended Video

చైనాపై ట్రంప్ ఫైర్..
కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తికి చైనాయే కారణమని నిందితస్తోన్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరింత దూకుడు పెంచారు. వైరస్ విషయంలో చైనా పెద్ద ఎత్తున అబద్ధాలను ప్రచారం చేస్తున్నదని, తప్పుడు సమాచారంతో అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నదని మండిపడ్డారు. అమెరికా, యూరప్ దేశాలపై చైనా సాగిస్తోన్న దుష్ప్రచారం చాలా అవమానకరంగా ఉందన్నారు. వైరస్ ను ఈజీగా నిలువరించగలిగినా, ఆ పని చేయకుండా, ప్రపంచ వినాశనం కోసమే చైనా కుట్రలు పన్నినట్లు స్పష్టంగా అర్థమవుతోందని ఆరోపించారు. నవంబర్ లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తనకు పోటీగా ఉన్న జో బిడెన్ గెలవాన్న ఉద్దేశంతోనే చైనా తప్పుడు ప్రచారాలను ఉధృతం చేసిందని, చైనా తన దోపిడీ కొనసాగించేందుకే బిడెన్ గెలుపు కోరుతున్నదని ట్రంప్ విమర్శించారు. అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16 లక్షలకు, మరణాలు 95వేలకు చేరుకున్నాయి.












Click it and Unblock the Notifications