పరారీలో దేశాధ్యక్షుడు.. ప్రధాని రాజీనామా: శ్రీలంకకు దిక్కెవరు?: అధ్యక్షుడిగా స్పీకర్
కొలంబో: సుదీర్ఘకాలంగా తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటూ వస్తోన్న శ్రీలంకలో ప్రజాగ్రహం పెల్లుబుకింది. దేశాధ్యక్షుడి అధికార నివాసం మీదికి దండెత్తారు లంకేయులు. ఆయన నివాసంలోకి దూసుకెళ్లారు. తన పదవికి రాజీనామా చేసిన ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘె నివాసానికి నిప్పు పెట్టారు. రోజులు గడుస్తున్నా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఆందోళనకు దిగారు. నిరసన ప్రదర్శలను చేపట్టారు. ఆందోళనలు, నిరసన ప్రదర్శనలతో కొలంబో సహా అన్ని ప్రధాన నగరాలు అట్టుడుకుతున్నాయి.
పారిపోయిన అధ్యక్షుడు..
దీన్ని ముందుగానే పసిగట్టిన గొటబయ తన నివాసాన్ని వదిలి పెట్టి పారిపోయారు. మొదట అంబులెన్స్లో తన అధికార నివాసం నుంచి బయటపడ్డారు. అనంతరం నౌకాదళానికి చెందిన ఎస్ఎల్ఎన్ఎస్ గజబాహులో ఆయన తప్పించుకుని పారిపోయినట్లు వార్తలొచ్చాయి. ఓ భారీ లగేజీ బ్యాగ్తో గొటబయ రాజపక్స.. గజబాహు షిప్ను ఎక్కుతున్న వీడియో సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది. ఆయన పారిపోయిన కొన్ని గంటలకే ప్రధాని రణిల్ విక్రమసింఘె తన పదవికి రాజీనామా చేశారు. అర్ధాంతరంగా తప్పుకొన్నారు.
మళ్లీ ప్రజాగ్రహం..
ఈ రెండు పరిణామాలు శ్రీలంక సంక్షోభాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లాయి. ప్రధానిగా రణిల్ విక్రమసింఘెను గొటబయ రాజపక్స అపాయింట్ చేసిన అనంతరం పరిస్థితులు కుదుటపడుతున్నాయనుకున్న దశలో మళ్లీ ప్రజాగ్రహం చెలరేగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రోజురోజుకూ పెట్రోల్, డీజిల్ సహా ఇతర నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతోండటాన్ని ప్రజలు సహించలేకపోయారు. కాలం గడుస్తున్నా ఆర్థిక వ్యవస్థ చక్కదిద్దకపోవడం పట్ల ఆగ్రహావేశాలతో రోడ్డెక్కారు.
తాత్కాలిక అధ్యక్షుడిగా..
రణిల్ విక్రమసింఘె రాజీనామా తరువాత ఆయన నియమించిన మంత్రులు కూడా వైదొలగారు. ఒకరి తరువాత ఒకరు తమ పదవులకు గుడ్బై చెప్పారు. దేశాధ్యక్షుడు పరారీలో ఉండటం, ప్రధానమంత్రి అర్ధాంతరంగా తన పదవి నుంచి తప్పుకోవడంతో శ్రీలంకలో ప్రభుత్వం అనేది లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో పార్లమెంట్ స్పీకర్ మహీంద యాప అబేయవర్దనె ముందుకొచ్చారు. తాత్కాలికంగా అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించడానికి అంగీకరించారు.
ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన అత్యవసర అఖిల పక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఈ నెల 13వ తేదీన తన పదవికి రాజీనామా చేస్తారని శ్రీలంక కాంగ్రెస్ పార్టీ నాయకుడు రవూఫ్ హకీం తెలిపారు. కనీసం 30 రోజుల పాటు పార్లమెంట్ స్పీకర్ తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించాల్సి ఉంటుందని, ఈ దిశగా అత్యవసర అఖిల పక్ష సమావేశంలో నిర్ణయించినట్లు చెప్పారు. తాత్కాలికంగా అన్ని పార్టీలతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, త్వరలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తీర్మానించినట్లు వివరించారు.