యుద్ధం టైంలో రేప్చేశారు: భారత్ ఐపీకేఎఫ్పై సంచలనం
కొలంబో: శ్రీలంకకు చెందిన ఓ మంత్రి బుధవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత శాంతి పరిరక్షణ దళం (ఐపీకేఎఫ్) సభ్యులు తమిళ మహిళల పైన అత్యాచారాలకు పాల్పడ్డారని ఆరోపించారు. శ్రీలంకలో ఎల్టీటీఈతో జరిగిన యుద్ధం సమయంలో వారు ఈ చర్యకు పాల్పడ్డారని ఆయన చెప్పారు.
గతంలో ఎల్టీటీఈ నాయకుడైన వినయగ గుప్త మురళీధరన్ అలియాస్ కరుణ శ్రీలంక పార్లమెంటులో ఈ ఆరోపణలు చేశారు. ఆయన ప్రస్తుతం మహింద రాజపక్స మంత్రివర్గంలో ఉన్నారు. 1987 నుండి 1990 వరకు శ్రీలంకలో శాంతి పరిరక్షణ ఆపరేషన్లు నిర్వహించిన ఐకేపీఎఫ్ సభ్యులు.. తమిళులను చంపడంతో పాటు అనేకమంది మహిళల పైన అత్యాచారాలు చేశారన్నారు.
అందుకు సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెప్పారు. 1987వ సంవత్సరంలో భారత్ - శ్రీలంక దేశాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం భారత శాంతిపరిరక్షణ దళాలను ఉత్తర తూర్పు శ్రీలంక ప్రాంతాలకు పంపించారు. కరుణ 2004లో ఎల్టీటీఈ నుండి విడిపోయి తన సొంత ఉద్యమాన్ని నడిపారు. అనంతరం అతను ఓ రాజకీయ పార్టీని స్థాపించారు. అనంతరం రాజపక్స నేతృత్వంలోని ప్రభుత్వంలో చేరి ఉప మంత్రి అయ్యారు.
అదే సమయంలో.. తన పైన విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్ష యునైటెడ్ నేషనల్ పార్టీని ఆయన హెచ్చరించారు. అవసరమైతే ప్రతిపక్షం గురించి అన్ని విషయాలను బయటపెడతానన్నారు.
తన ప్రసంగంలో కరుణ శ్రీలంక నేవీని ప్రశంసించారు. భారత్కు చెందిన ఫిషర్ మెన్ను శ్రీలంక పరిధిలోకి రానీయకుండా లంక నేవీ సమర్థవంతంగా అడ్డుకుంటుందని చెప్పారు. మాజీ ప్రెసిడెంట్ రణసింగే ప్రేమదాస ఇష్టారీతిగా ఆయుధాలు ఇచ్చి ఎల్టీటీఈ మరింత బలోపేతం అయ్యేలా చేశారని ఆరోపించారు.
1989వ సంవత్సరంలో కేవలం 350 మంది ఎల్టీటీఈ సభ్యులు మాత్రమే ఉన్నారన్నారు. కానీ, ప్రేమదాస చర్యల వల్ల ఎల్టీటీఈ రోజు రోజుకు పుంజుకుందని ధ్వజమెత్తారు. ఇతను ఎల్టీటీఈకి ఐదువేల ఆయుధాలు ఇచ్చారని ఆరోపించారు. దీంతో కేవలం మూడు వందల మంది ఉన్న ఎల్టీటీఈ మూడు నెలల కాలంలోనే ఆరువేలు అయిందన్నారు. అలాగే, తమిళ్ నేషనల్ అలయెన్స్ తీరు పైన కూడా ఆయన మండిపడ్డారు.