సిడ్నీలో టెక్కీ హత్య: ఏం చెప్తే అది చేస్తానని నిందితుడ్ని వేడుకుంది
సిడ్నీ/బెంగళూరు: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో భారత మహిళా టెక్కీ ప్రభా హత్య కేసులో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాఫ్తు జరుపుతున్నారు. దాడి చేసిన వారు ఆమె వద్దకు వెళ్లాడని, అతనిని ఆమె చూసి ఉంటుందని భావిస్తున్నారు. ఈ దాడి లైంగిక దాడి కోణంలో జరిగిందా అనే అంశం పైన కూడా పోలీసులు విచారిస్తున్నారు.
బెంగళూరుకు చెందిన 41 ఏళ్ల ప్రభా అరుణ్ కుమార్ నాలుగు రోజుల క్రితం సిడ్నీలో దుండగుల చేతిలో కత్తి పోట్లకు గురై, మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిని పోలీసులు విచారిస్తున్నారు. దాడి జరిగిన సమయంలో ఆమె తన భర్త అరుణ్ కుమార్తో ఫోన్లో మాట్లాడారు.
ఈ నేపథ్యంలో సిడ్నీ చేరుకున్న అరుణ్ కుమార్లో పోలీసులు విచారించారు. ఆమె ఫోన్లో ఏం చెప్పిందో అడిగి తెలుసుకున్నారు. ప్రభ రుమ్మేట్ను కూడా భర్త కలిశారు. ఏం జరిగిందనే విషయం వివరించినట్లుగా తెలుస్తోంది.
సమాచారం మేరకు.. తన పైన దాడి చేసిన వాడిని ఆమె చూశారు. అతను తన వద్దకు రాగానే తనను ఏమీ చేయవద్దని అరిచారు. నీవు ఏం చెబితే అది చేస్తానని చెప్పారు.
ఆ తర్వాత తన మాతృభాషలో తన భర్తతో... అతను నన్ను కత్తితో పొడిచాడు, కత్తితో పొడిచాడు అని చెప్పింది. అప్పటికి ఆమె తన భర్తతో ఫోన్లో మాట్లాడుతోంది. అయితే, భర్తకు మాత్రం స్పష్టంగా వినిపించలేదు. పదునైన ఆయుధంతో ఆమె గొంతును కోయడంతో ఆమె మృతి చెందినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.