అమెరికా నిష్క్రమణ-తాలిబన్ల సంబరాలు-కాచుకుని ఉన్న 2వేల మంది ఐసిస్-బైడెన్ పిరికితనమంటున్న రిపబ్లికన్లు
ఆఫ్గనిస్తాన్లో అమెరికా యుద్ధం ముగిసింది. ఆఫ్గన్ గడ్డపైనుంచి తమ సేనలను అమెరికా పూర్తిగా ఉపసంహరించుకుంది. చెప్పినట్లుగానే ఆగస్టు 31 లోపు సైన్యంతో పాటు అమెరికన్ పౌరుల తరలింపు ప్రక్రియను పూర్తి చేసింది. ఇప్పుడిక ఆఫ్గనిస్తాన్లో తాలిబన్లను నిలువరించగల శక్తి అంటూ ఏదీ లేదు. అందుకే ఈ సందర్భాన్ని వారు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. తమకు పూర్తి స్వాతంత్య్రం లభించిందని ప్రకటించారు. బాణసంచా పేలుస్తూ ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.
The last American soldier to leave Afghanistan: Maj. Gen. Chris Donahue, commanding general of the @82ndABNDiv, @18airbornecorps boards an @usairforce C-17 on August 30th, 2021, ending the U.S. mission in Kabul. pic.twitter.com/j5fPx4iv6a
— Department of Defense 🇺🇸 (@DeptofDefense) August 30, 2021

కాబూల్ విమానాశ్రయం ఇక తాలిబన్ల నియంత్రణలోకి
తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ...'అమెరికా సైన్యం కాబూల్ను వీడింది. ఇప్పుడు మా దేశానికి పూర్తి స్వాంత్రత్య్రం లభించింది.' అని పేర్కొన్నారు. అమెరికా సైన్యం అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఇక ఆఫ్గన్ను వీడాలనుకునేవారికి ఆ అవకాశం లేకుండా పోయింది. ఇన్నాళ్లు కాబూల్లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అమెరికా,నాటో దళాల ఆధీనంలో ఉంది కాబట్టి అక్కడి నుంచి ఆఫ్గన్ లేదా ఇతర దేశస్తుల తరలింపు ప్రక్రియ సాధ్యపడింది. కానీ ఇప్పుడు విమానాశ్రయం తాలిబన్ల నియంత్రణలో ఉంటుంది కాబట్టి... ఇక ఏ దేశం అక్కడ అడుగుపెట్టే సాహసం చేయదు. శరణార్థులుగా వేరే దేశాలకు వెళ్లాలనుకున్న ఆఫ్గన్లకు అక్కడే ఉండిపోవడం తప్ప మరో మార్గం లేదు.

జో బైడెన్పై రిపబ్లికన్ల విమర్శలు
అమెరికా సేనల ఉపసంహరణపై ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు.'ఆఫ్గనిస్తాన్లో 20 ఏళ్ల మా సైనిక కార్యకలాపాలకు ఇక తెరపడింది.' అని పేర్కొన్నారు. కాబూల్లో అత్యంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో అమెరికన్ల తరలింపు ప్రక్రియను చేపట్టినందుకు సైన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం(ఆగస్టు 31) మధ్యాహ్నం ఆయన మరోసారి మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు జో బైడెన్పై రిపబ్లికన్ నేతల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆఫ్గన్ గడ్డపైనుంచి అమెరికా సేనలను ఉపసంహరించడం బైడెన్ పిరికితనానికి,అసమర్థతకు నిదర్శనమని రిపబ్లికన్ సెనేటర్ బెన్ సాసే విమర్శించారు. ఒకరకంగా ఇది దేశానికే అవమానమని పేర్కొన్నారు.

ఎంతమంది బైడెన్ను సమర్థిస్తున్నారు...
డెమోక్రాటిక్ పార్టీ నేతలు మాత్రం బైడెన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. చరిత్రలోనే అత్యంత ప్రమాదకర పరిస్థితుల నడుమ అమెరికా సైన్యం 1,20,000 మందిని కాబూల్ నుంచి తరలించడం మామూలు విషయం కాదన్నారు.ఆఫ్గన్ గడ్డపై అమెరికా లక్ష్యం గతంలోనే పూర్తయిందనే విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి అంతర్జాతీయ మీడియా రాయిటర్స్ నిర్వహించిన పోల్లో బైడెన్ నిర్ణయాన్ని 38శాతం అమెరికన్లు ఆమోదించగా 51శాతం మంది వ్యతిరేకించడం గమనార్హం.

ఆఫ్గన్ను వీడిన చివరి అమెరికన్ సైనికుడు...
ఆఫ్గనిస్తాన్ను వీడిన చివరి అమెరికన్ సైనికుడిగా మేజర్ జనరల్ క్రిస్ డొనహ్యుని పేర్కొంటున్నారు. ఈ మేరకు అమెరికా రక్షణ శాఖ ఆయన ఫోటోను ట్వీట్ చేసింది. 82వ ఎయిర్బోర్నె డివిజన్కు చెందిన క్రిస్ డొనహ్యు సీ-17 కార్గో విమానంలో కాబూల్ను వీడినట్లు తెలిపింది. చివరి కార్గో విమానం నింగిలోకి ఎగిరేదాకా తాలిబన్లు అక్కడే ఉండి గమనించారు. అనంతరం సంబరాలు మొదలుపెట్టారు. ఇక తమకు మరింత స్వేచ్చ లభించిందని వారు భావిస్తున్నారు.

ఆఫ్గన్లో 2వేల మంది ఐసిస్ ఉగ్రవాదులు
దాదాపు 20కి పైగా దేశాలు ఆఫ్గనిస్తాన్ నుంచి తమ పౌరుల తరలింపు ప్రక్రియను పూర్తి చేసినట్లు ప్రకటించాయి. అమెరికన్ మిలటరీకి చెందిన జనరల్ మెకెంజీ మాట్లాడుతూ... ఆఫ్గనిస్తాన్లో ఇప్పటికీ 2వేల మంది ఐసిస్ ఉగ్రవాదులు ఉన్నట్లు అంచనా వేస్తున్నామన్నారు. అదే నిజమైతే రానున్న రోజుల్లో ఆఫ్గన్లో ఐసిస్ తీవ్రవాదులు మరిన్ని దాడులకు పాల్పడవచ్చు.ఆఫ్గన్ను వీడాలని కాబూల్ విమానాశ్రయానికి చేరిన వేలాది మంది ఆఫ్గన్లకు ఇక ఆ అవకాశం లేకుండా పోయింది. నిరాశతో వారు వెనుదిరగడం తప్పితే ఇంకో మార్గం లేదు.సరైన డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ అమెరికా తమను తరలించేందుకు విముఖత చూపించిందని కొంతమంది ఆఫ్గన్ పౌరులు వాపోతున్నారు. ఆఫ్గన్ పట్ల ఒకలా విదేశీయుల పట్ల మరోలా అమెరికా వ్యవహరించిందని వారు చెబుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇక చావైనా,బతుకైనా మాతృభూమిలోనే అని అభిప్రాయపడుతున్నారు. నిజానికి అమెరికా ఆగస్టు 31 డెడ్ లైన్ పొడగిస్తుందేమోనని చాలామంది భావించారు. బ్రిటన్ సహా పలు దేశాలు ఇందుకు ఒత్తిడి తెచ్చాయి. కానీ బైడెన్ మాత్రం అందుకు నిరాకరించారు. అటు తాలిబన్లు కూడా డెడ్ లైన్ దాటితే తీవ్ర పరిణామాలు తప్పవని బెదిరింపులకు దిగారు.
Recommended Video

సమర్థించుకున్న బైడెన్...
ఆఫ్గనిస్తాన్ నుంచి అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకోవడాన్ని అధ్యక్షుడు జో బైడెన్ సమర్థించుకున్న సంగతి తెలిసిందే.'20 ఏళ్ల క్రితం స్పష్టమైన లక్ష్యాలతో మేము ఆఫ్గన్ గడ్డపై అడుగుపెట్టాం. సెప్టెంబర్ 11,2001న అమెరికాపై దాడి చేసిన అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ మరోసారి మాపై దాడి చేసేందుకు ఆఫ్గనిస్తాన్ వేదిక కావొద్దని భావించాం. అనుకున్నట్లుగానే మా లక్ష్యాలను చేరుకున్నాం. అల్ ఖైదా ప్రాబల్యాన్ని తగ్గించేశాం.ఒసామా బిన్ లాడెన్ వేటలో మేమెప్పుడూ వెనక్కి తగ్గలేదు.20 ఏళ్ల క్రితం అతన్ని మట్టుబెట్టాం.' అని గతంలోనే జో బైడెన్ పేర్కొన్నారు.
ఒక దేశంగా ఆఫ్గనిస్తాన్ను నిలబెట్టడమో లేక అక్కడ ప్రజాస్వామ్యాన్ని స్థాపించడమో అమెరికా మిషన్ కాదన్నారు. ఆఫ్గన్ గడ్డ పైనుంచి అమెరికాపై దాడి జరగకుండా చూసుకోవడమే ఇప్పటికీ తమ ఏకైక జాతీయ ఎజెండాగా చెప్పారు. ఆఫ్గనిస్తాన్లో తిరుగుబాటును అణచివేయడమో లేక ఆ దేశాన్ని నిలబెట్టడమో మా పని కాదు... ఉగ్రవాదాన్ని అణచివేయడంపైనే మా ఫోకస్ ఉంటుందని చాలా ఏళ్లుగా తన వాదన వినిపిస్తున్నట్లు చెప్పారు. తమది కాని యుద్ధంలో అమెరికా సైనికులను కోల్పోదలుచుకోలేదన్నారు. ఆఫ్గన్ కోసం ఇప్పటికే భారీగా డబ్బు ఖర్చు చేశామని... అన్ని విధాలా సహాయ సహకారాలు అందించామని చెప్పారు. అయితే పోరాడాలనే సంకల్పాన్ని మాత్రం ఇవ్వలేకపోయామన్నారు.












Click it and Unblock the Notifications