అక్కడ తొలిసారిగా ఎగిరిన తాలిబన్ల జెండా: అమెరికాకు ఘాటు రిప్లయ్
కాబుల్: అగ్రరాజ్యం అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్పై ఉగ్రవాద సంస్థ అల్ఖైదా.. భయానక దాడికి పాల్పడి రెండు దశాబ్దాలు ముగిసింది. అమెరికా, భారత్ సహా పలు ప్రపంచ దేశాలు ఈ ఉగ్రదాడిని గుర్తు చేసుకున్నాయి. వరల్డ్ ట్రేడ్ సెంటర్పై అల్ఖైదా ఉగ్రవాదులు విమానాలతో దాడి చేసిన ఘటనలో మరణించిన వారికి సంతాపాన్ని వ్యక్తం చేశాయి. సరిగ్గా 20 సంవత్సరాలు ముగిసే సరికి ఆప్ఘనిస్తాన్లో మళ్లీ తాలిబన్లు పాగా వేశారు.
అల్ఖైదా ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చిన కారణంగా- అప్పటి తాలిబన్ ప్రభుత్వాన్ని నామరూపాల్లేకుండా చేసింది అమెరికా. ఇప్పుడు మళ్లీ అవే తరహా పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. వరల్డ్ ట్రేడ్ సెంటర్పై అల్ఖైదా ఉగ్రవాదులు దాడి చేసి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని తాలిబన్లు సెలబ్రేట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. అదే రోజు- ఆప్ఘనిస్తాన్ అధ్యక్షుడి అధికారిక భవనం మీద తమ జెండాను ఎగురవేశారు. భవనం ప్రధాన ముఖ ద్వారం వద్ద భారీ జెండాను కట్టారు. బ్యానర్లను ప్రదర్శించారు.
ముల్లా మహమ్మద్ హసన్ అఖుండ్జాదా నివసిస్తోన్న భవనం అది. తాలిబన్లు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి ముల్లా మహమ్మద్ ప్రధానమంత్రిగా వ్యవహరిస్తోన్నారు. ఇదివరకు అష్రఫ్ ఘనీ అదే భవనంలో నివసించారు. ఇప్పుడు ఆ భవనం మహమ్మద్ హసన్ నివాసంగా మార్చారు. తెల్లటి బ్యానర్పై నల్లరంగు అక్షరాలను ముద్రించిన పతాకాన్ని తాము అధ్యక్ష భవనం మీద ఎగురవేసినట్లు తాలిబన్ల సాంస్కృతిక కమిషన్ అధినేత అహ్మదుల్లా ముత్తాకీ తెలిపారు.

ఆప్ఘనిస్తాన్లో తమ ప్రభుత్వ పరిపాలన ప్రారంభమైందనడానికి నిదర్శనంగా ఈ పతాకాన్ని ఎగురవేసినట్లు ముత్తాకీ స్పష్టం చేశారు. అధ్యక్ష భవనం మీద తాలిబన్ల పతాకాన్ని ఎగురవేసే కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించామని, అనంతరం ఆఫ్ఘనిస్తాన్ సంప్రదాయ గిరిజన నేతలతో మహమ్మద్ హసన్ సమావేశమయ్యారని వివరించారు. తాము ఏ దేశంతో కూడా ఘర్షణ వైఖరికి వెళ్లదలచుకోలేదని ముత్తాకీ తెలిపారు.
న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్పై అల్ఖైదా ఉగ్రవాదుల దాడి చోటు చేసుకున్న రోజే తాలిబన్ల పతకాన్ని ఎగరవేయడం ఎలాంటి దురుద్దేశం లేదని, అది యాదృచ్ఛికమేనని ముత్తాకీ వ్యాఖ్యానించారు. అన్ని దేశాలతోనూ సత్సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలని కొత్త ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన విధి విధానాలు ఎలా ఉండాలనే విషయంపై తాలిబన్ల అగ్ర నాయకత్వం వేర్వేరు సామాజిక వర్గానికి చెందిన ప్రజలతో సంప్రదింపులను నిర్వహిస్తోంది.
ఇందులో భాగంగానే- ఆఫ్ఘనిస్తాన్ సంప్రదాయ గిరిజన నేతలతో మహమ్మద్ హసన్ సమావేశమైనట్లు ముత్తాకి స్పష్టం చేశారు. రెండు దశాబ్దాల కిందట పరిపాలించినట్టే మత ఛాందసవాదాన్ని, ఇస్లామిక్ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వట్లేదని, ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా పరిపాలన సాగించాలని భావిస్తున్నామని అన్నారు. అదే సమయంలో వివాదాస్పదమైన షరియా చట్టాన్ని ఖచ్చితంగా అనుసరిస్తామని, దాన్ని నిక్కచ్చిగా అమలు చేస్తామని ముత్తాకీ చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications