తూనీగలు ఇక కనుమరుగేనా? పశ్చిమ కనుమల్లో వినాశనం మొదలైందా?
తూనీగా.. తూనీగా.. ఎందాక పరిగెడతావే" అంటూ పాడే పాట వినడానికి ఎంతో హాయిగా ఉంటుంది. అలాగే తూనీగలు మనకు ఎంతో ఆనందాన్ని కూడా ఇస్తాయి. ఇలా మన మందు ప్రకృతి ఒడిలో విహరించే ఆ బుజ్జి తూనీగలకు ఇప్పుడు నిజంగానే కష్టమొచ్చింది. మన దేశంలో జీవవైవిధ్యానికి నిలయమైన పశ్చిమ కనుమల్లో ఈ అందమైన కీటకాలు నెమ్మదిగా అంతరించిపోతున్నాయి. భారత శాస్త్రవేత్తలు 2021-23 మధ్య కాలంలో ఆరు రాష్ట్రాల్లో జరిపిన తాజా అధ్యయనంలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.
పశ్చిమ కనుమలు దాదాపు 143 జాతుల తూనీగలకు ఆవాసం. అయితే, తాజా అధ్యయనం ప్రకారం వీటిలో కనీసం 79 జాతులు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదని తేలింది. తూనీగల మొత్తం జనాభాలో సుమారు 35% తగ్గుదల నమోదైంది. ముఖ్యంగా ఈ ప్రాంతానికే పరిమితమైన (Endemic) 40 ప్రత్యేక జాతుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన పరిణామ జీవావరణ శాస్త్రవేత్త పంకజ్ కపర్దే విశ్లేషణ ప్రకారం.. కొన్ని అరుదైన జాతులు పూర్తిగా అంతరించిపోయి ఉండవచ్చు లేదా అవి కనిపించే నిర్దిష్ట కాలాల్లో శాస్త్రవేత్తల కంటికి చిక్కకుండా ఉండి ఉండవచ్చు.

ప్రకృతి ఆరోగ్యానికి ఇవే సూచికలు
తూనీగలు, నీటి తూనీగలు కేవలం అందానికి మాత్రమే కాదు, ఒక ప్రాంతం యొక్క జీవావరణ (Ecological) ఆరోగ్యానికి కీలక సూచికలు. ఇవి నీరు, గాలి నాణ్యతను ప్రతిబింబిస్తాయి. వీటి సంఖ్య గణనీయంగా తగ్గిందంటే, అక్కడ పర్యావరణ వ్యవస్థ వేగంగా క్షీణిస్తోందని అర్థం. ఇవి అంతరిస్తే ఆ ప్రభావం మొత్తం ఆహార గొలుసుపై పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ప్రమాదంలో 'బయోడైవర్సిటీ' హాట్స్పాట్
సుమారు 1600 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న పశ్చిమ కనుమలు దేశంలోని 30% కంటే ఎక్కువ వృక్ష, జంతు జాతులకు తల్లి ఒడి వంటివి. అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న 325 కీటక జాతులు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నాయి. కానీ నేడు.. అడవులు కనుమరుగై కాంక్రీట్ జంగిల్స్ విస్తరిస్తున్నాయి. అక్రమ మైనింగ్ వల్ల కొండలు, నీటి వనరులు ధ్వంసమవుతున్నాయి. రోడ్లు, భవనాల నిర్మాణం వల్ల సహజ ఆవాసాలు విచ్ఛిన్నమవుతున్నాయి.
ఫలితంగా కేవలం తూనీగలే కాదు, అరుదైన పక్షులు, కప్ప జాతులు కూడా కనుమరుగవుతున్నాయి. ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుతమైన సంపదను కాపాడుకోకపోతే, భవిష్యత్ తరాలకు ఆ "తూనీగ" పాట కేవలం పుస్తకాల్లోనే మిగిలిపోతుంది.














Click it and Unblock the Notifications