కాబూల్ ఎయిర్ పోర్ట్ రెడీ-అంతర్జాతీయ విమానాలు నడపాలని ఎయిర్ లైన్స్ ను కోరిన తాలిబన్లు
ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులు కావస్తోంది. గతంలో రాజధాని కాబూల్ ఎయిర్ పోర్టులో తరలింపుల ప్రక్రియ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలతో ఈ విమానాశ్రయం దెబ్బతింది. దీంతో టర్కీ , ఖతార్ సాయం తీసుకుని ఎయిర్ పోర్టును తాలిబన్లు సిద్ధం చేశారు. ఇప్పుడు అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అనువుగా ఈ విమానాశ్రయం సిద్ధమైంది.
ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ ఎయిర్ పోర్టు సిద్ధం కావడంతో తాలిబాన్ ప్రభుత్వం అంతర్జాతీయ విమానాల రాకపోకలను తిరిగి ప్రారంభించాలని ఎయిర్ లైన్స్ కు విజ్ఞప్తి చేసింది, ఇందుకు ముందుకొచ్చే విమానయాన సంస్థలకు పూర్తి సహకారం అందిస్తామని, కాబూల్ విమానాశ్రయం సిద్ధంగా ఉంచుతున్నట్లు తాలిబన్లు తెలిపారు. గత నెలలో పాశ్చాత్య దేశాల మద్దతున్న అష్రప్ ఘనీ సర్కార్ పతనం తరువాత కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు.. అంతర్జాతీయ గుర్తింపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో ఎయిర్ లైన్స్ కు ఈ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం కాబూల్ విమానాశ్రయం నుంచి పరిమిత సంఖ్యలో విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. వైద్య సాయం అందించే సర్వీసులతో పాటు ప్రయాణికుల విమానాలు నడుస్తున్నాయి. అయితే తాలిబాన్లు రాజధానిని స్వాధీనం చేసుకున్న తరువాత వేలాది మంది విదేశీయులు, ఆఫ్ఘన్ల తరలింపు నేపథ్యంలో ఎయిర్ పోర్టు మూసేశారు. దీంతో సాధారణ కమర్షియల్ విమాన సర్వీసులు కూడా ఇంకా పునరుద్ధరించలేదు. కాబూల్ ఎయిర్ పోర్టు నుంచి విదేశీయుల్ని తరలించే సమయంలో దెబ్బతిన్న విమానాశ్రయం ఖతార్, టర్కీ సాంకేతిక బృందాల సహాయంతో తిరిగి ప్రారంభించారు. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్తో సహా కొన్ని విమానయాన సంస్థలు కాబూల్ ఎయిర్ పోర్టుకు పరిమిత సర్వీసులు నడుపుతుండగా.. ఇవి అక్కడి ప్రయాణికులకు సరిపోయేలా లేవు. దీంతో విమాన టికెట్ల రేట్లు కూడా ఆశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో తాలిబన్ల సర్కార్ విజ్ఞప్తి ప్రాధాన్యం సంతరించుకుంది.
Recommended Video
ప్రస్తుతం ఆప్ఘనిస్తాన్ లో ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి, తాలిబాన్లు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వంతో సంబంధం ఉన్న మాజీ అధికారులు మరియు ఇతరులపై ప్రతీకార చర్యలకు దిగడం నుంచీ బాలికల విద్యపై ఆంక్షల వరకూ ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నారు. దీంతో అంతర్జాతీయంగా గుర్తింపు సాధించుకునే విషయంలో ఇబ్బందులు తప్పడం లేదు.