భారత్ చర్యలపై తాలిబన్ల హ్యాపీ-ఆప్ఘన్ లో శాంతి, స్ధిరత్వం కోరుకుంంటున్నట్లు వెల్లడి
భారత్ తాజాగా నిర్వహించిన ప్రాంతీయ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంపై తాలిబన్లు స్పందించారు. ఆప్ఘనిస్తాన్ భవిష్యత్తుపై భారత్ ఆతిధ్యమిచ్చిన ఈ సమావేశం ప్రాధాన్యతను గుర్తిస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. ఆప్ఘన్ లో శాంతి, స్ధిరత్వం కోసం ఈ సమావేశం ఉపయోగపడుతుందని తాలిబన్ల ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడింది.
ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితిపై న్యూ ఢిల్లీలో జరిగిన ప్రాంతీయ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంపై ఐరాసలో తాలిబాన్ అధికార ప్రతినిధి సుహైల్ షహీన్ సానుకూలంగా స్పందించారు. ఈ చర్చలు ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి దోహదం చేస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశాన్ని సానుకూల పరిణామంగా భావిస్తున్నట్లు, ఆఫ్ఘనిస్తాన్ యొక్క "శాంతి మరియు స్థిరత్వానికి" ఇది దోహదం చేస్తుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.
నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఈ భేటీలో ఇరాన్, రష్యా, కజకిస్థాన్, కిర్గిజిస్తాన్, తజికిస్థాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్థాన్ పాల్గొన్నాయి. చర్చల్లో చేరాల్సిందిగా చైనా, పాకిస్థాన్లను కూడా భారత్ ఆహ్వానించింది. అయితే ఈ రెండు దేశాలు భారత్ ఆహ్వానాన్ని అంగీకరించలేదు. దేశ శాంతి, స్థిరత్వానికి దోహదపడే, ప్రజలకు ఉద్యోగావకాశాలు కల్పించే, దేశంలో పేదరిక నిర్మూలనకు దోహదపడే ఏ చర్యకైనా తాలిబాన్ మద్దతు ఉంటుందని సుహైల్ షాహీన్ చెప్పారు.
ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు శాంతి, స్థిరత్వాన్ని కోరుకుంటున్నారని, వారు గత కొన్ని సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడ్డారని సుహైల్ తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఆర్థిక ప్రాజెక్టులు పూర్తి కావాలని, కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలని కోరుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. తమ ప్రజలకు ఉద్యోగావకాశాలు కూడా కావాలన్నారు. మరోవైపు ఈ సమావేశానికి పాకిస్థాన్ గైర్హాజరు కావడంపై సుహైల్ షాహీన్ మాట్లాడుతూ, పాకిస్తాన్ తన వైఖరిని నిర్ణయించుకోవాలన్నారు.