ఘోరం: ఉగ్రవాదులనుకొని సొంత సైన్యంపైనే దాడి... 10 మంది సైనికులు మృతి
ఘోరం జరిగిపోయింది. ఉగ్రవాదులు ఎవరో.. సైన్యం ఎవరో గుర్తించలేని పరిస్థితిలో సొంత సైన్యంపైనే వైమానిక దాడి జరిగిపోయింది. ఈ దారుణం ఫిలిప్పీన్స్లో చోటు చేసుకుంది.
మనీలా: ఘోరం జరిగిపోయింది. ఉగ్రవాదులు ఎవరో.. సైన్యం ఎవరో గుర్తించలేని పరిస్థితిలో సొంత సైన్యంపైనే వైమానిక దాడి జరిగిపోయింది. ఈ దారుణం ఫిలిప్పీన్స్లో చోటు చేసుకుంది.
ఫిలిప్పీన్స్ వైమానిక దళం ఏకంగా సొంత సైన్యాన్నే ఉగ్రవాదులుగా భ్రమించి దాడులు నిర్వహించింది. ఈ దాడిలో 10 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత వారం ఇస్లామిక్స్టేట్కు అనుబంధంగా ఉన్న ఉగ్రవాదులతో ఫిలిప్పీన్స్ సైన్యం తలపడుతోంది. ఈ దాడుల్లో మొత్తం 100 మందికి పైగా మృతి చెందారు. సైన్యం ఉగ్రవాద సంస్థకు చెందిన అత్యున్నత నాయకత్వాన్ని అరెస్టు చేయడానికి ప్రయత్నించినప్పుడు ఈ పోరాటం చోటు చేసుకుంది.
ఈ క్రమంలో బుధవారం ఆ దేశ వైమానిక దళం సొంత సైన్యంపైనే దాడులు నిర్వహించింది. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ శాఖ కార్యదర్శి లోరెన్జనా తెలిపారు. ఆ దేశ అధ్యక్షుడు రోడ్రిగో ఇటీవల మిన్డానో ఐలాండ్లోని మార్వీ పట్టణంలో మార్షల్ లాను విధించారు.
ఈ నేపథ్యంలో అక్కడి భద్రతా దళాలు లిస్నిలోన్ హపిలోన్ అనే ఉగ్రవాద నాయకుడిని అరెస్టు చేసేందుకు దాడులు చేపట్టాయి. ఆయన్ను రక్షించేందుకు భారీ సంఖ్యలో ఉగ్రవాదులు అక్కడకు చేరుకుని పట్టణంలోని కొన్ని ప్రాంతాలను వారి ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో ఆ దేశ సైన్యం , వైమానిక దళం సంయుక్తంగా దాడులు చేపట్టాయి.