టెస్లాలో ఢిల్లీ యూనివర్శిటీ పూర్వ విద్యార్థికి కీలక పదవి
వాషింగ్టన్: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ.. టెస్లాలో భారతీయుడికి కీలక పదవి లభించింది. వైభవ్ తనేజా.. ఆ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా అపాయింట్ అయ్యారు. ఈ మేరకు టెస్లా ఓ ప్రకటన విడుదల చేసింది. ట్విట్టర్, ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్కు చెందిన కంపెనీ ఇది.
ప్రస్తుతం టెస్లా సీఎఫ్ఓగా పని చేస్తోన్న జఖారీ కిర్ఖ్హార్న్ను సంస్థ యాజమాన్యం తప్పించింది. ఆయన స్థానంలో వైభవ్ తనేజాను నియమించింది. జఖారీ.. 13 సంవత్సరాల పాటు టెస్లాలో పని చేశారు. ఇప్పుడు సంస్థ నుంచి వైదొలిగారు. ప్రస్తుతం వైభవ్ తనేజా.. టెస్లాలో చీఫ్ అకౌంటింగ్ ఆఫీసర్గా పని చేస్తోన్నారు.

జఖారీ తప్పుకొన్న నేపథ్యంలో చీఫ్ ఫైనాన్షియర్ ఆఫీసర్గా వైభవ్ తనేజాకు అదనపు బాధ్యతలను అప్పగించిందా సంస్థ యాజమాన్యం. తన పదవికి రాజీనామా చేసినప్పటికీ.. సంస్థ ఆర్థిక నిర్వహణ కార్యకలాపాలు సజావుగా కొనసాగడానికి ఈ ఏడాది చివరి వరకూ జఖారీ.. సీఎఫ్ఓగా కొనసాగుతారు. జనవరి 1వ తేదీన సీఎఫ్ఓగా వైభవ్ బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉంది.
వైభవ్ తనేజా.. ఢిల్లీ యూనివర్శిటీ పూర్వ విద్యార్థి. కామర్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు.2016లో సోలార్ సిటీ స్టార్టప్ను నెలకొల్పారు. ఈ సంస్థను టెస్లా యాజమాన్యం టేకోవర్ చేసుకుంది. వైభవ్ తనేజాకు చీఫ్ అకౌంటింగ్ ఆఫీసర్గా పదవిని అప్పగించింది అప్పట్లో. 2021లో టెస్లా భారత విభాగం డైరెక్టర్గానూ అపాయింట్ అయ్యారు.

టెస్లా తన అమ్మకాలను పెంచుకోవడానికి, మరింత మార్కెట్ వాటాను సొంతం చేసుకోవడానికి భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో వైభవ్ తనేజా.. కీలకమైన సీఎఫ్ఓగా బాధ్యతలను చేపట్టబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్ సహా ఇతర ఆసియా దేశాల్లో టెస్లా సంస్థ తన మార్కెట్ వాటాను విస్తరించుకోవడంలో వైభవ్ అనుభవం పనికొస్తుందని భావిస్తోంది.












Click it and Unblock the Notifications