ఎంహెచ్ 370 ప్లేన్: మరో 300 శకలాల గుర్తింపు కానీ...
కౌలాలంపూర్: జలసమాధి అయినట్లుగా ప్రకటించిన మలేషియన్ ఎంహెచ్ 370 విమానం శకలాల కోసం సెర్చ్ జరుగుతోంది. ఈ సందర్భంగా దక్షిణ హిందూ మహాసముద్రంలో పెర్త్ (ఆస్ట్రేలియా)కు ఆగ్నేయంగా 2700 కిలోమీటర్ల దూరాన 300 శకలాలను థాయ్లాండ్ ఉపగ్రహం గుర్తించింది.
ఈ శకలాలు గల్లంతైన మలేసియా విమానానివేనని అధికారులు భావిస్తున్నారు. వివిధ పరిమాణాల్లో ఉన్న ఈ వస్తువులను 'థాయ్లాండ్స్ స్పేస్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఏజెన్సీకి చెందిన థాయ్చోటే ఉపగ్రహం సోమవారం కనుగొంది. ఆ చిత్రాలను విశ్లేషించడానికి రెండు రోజులు పట్టిందని ఆ సంస్థ డైరెక్టర్ అనోంద్ స్నిడ్వోంగ్స్ తెలిపారు.

ఆ శకలాలు రెండు మీటర్ల నుండి పదిహేను మీటర్ల వరకు ఉన్నట్లుగా గుర్తించారు. అయితే, ఇవి కచ్చితంగా మలేషియన్ విమానానికి చెందిన శకలాలే అని అప్పుడే చెప్పలేమని అంటున్నారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని తాము మలేషియాకు ఇచ్చామన్నారు.
కాగా, వాతావరణం అనుకూలించకపోవడంతో గురువారం కూడా విమానం అన్వేషణకు అంతరాయం కలిగింది. విమానం కూలిపోయిందని మలేసియా అధికారికంగా ప్రకటించినప్పటికీ మృతదేహాలు దొరక్కపోవడం, అలాగే ప్రయాణికులందరూ చనిపోయారని ద్రువీకరించే ఆధారాలు లేకపోవడంతో వారికి అంత్యక్రియలు నిర్వహించడంపై కుటుంబసభ్యులు, బంధువులు సందేహిస్తున్నారు.












Click it and Unblock the Notifications