ఉగ్రదాడి ప్రకటన నుంచి తాలిబన్ పేరు తొలగింపు: ఐరాస అనూహ్య చర్య
వాషింగ్టన్: ఇస్లామిక్ దేశం ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల దురాక్రమణలోకి వెళ్లినప్పటి నుంచీ- అవాంఛనీయ పరిస్థితులు నెలకొంటోన్నాయి. ఉగ్రవాదుల దాడులు పెచ్చరిల్లాయి. వరుసగా సంభవించిన జంట పేలుళ్లు 190 మందికి పైగా ఆఫ్ఘనిస్తానీయులను బలి తీసుకున్నాయి. ఏ ప్రాణాంతక ఉగ్రదాడులు జరక్కూడదని ప్రపంచ దేశాలు ఆశించాయో.. అదే తరహా ఆత్మాహూతి దాడులు అక్కడ చోటు చేసుకున్నాయి. ఈ జంట పేలుళ్లతో ఉగ్రవాదుల దాడులు నిలిచిపోయేవి కావని, ఇలాంటివి ఇంకా సంభవిస్థాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా హెచ్చరించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
ఈ పరిణామాల మధ్య- ఆప్ఘనిస్తాన్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతోన్న తాలిబన్లపై ఐక్యరాజ్య సమితి భద్రత మండలి వైఖరి మారినట్టుగా కనిపిస్తోంది. కాబుల్లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద సంభవించిన ఆత్మాహూతి దళి సభ్యుడి దాడిని ఖండిస్తూ విడుదల చేసిన ఓ ప్రకటన ద్వారా భద్రత మండలి వైఖరి ఏమిటనేది స్పష్టమైంది. ఈ ప్రకటన నుంచి తాలిబన్ల పేరును ఉటంకిస్తూ పొందుపరిచిన ఓ పేరాగ్రాఫ్ను తొలగించింది భద్రత మండలి.
ఇదివరకు జారీ చేసిన ఓ ప్రకటనలో తాలిబన్లు అనే పదాన్ని స్పష్టంగా పొందుపరిచింది భద్రత మండలి. వారిని ఆఫ్ఘనిస్తాన్ గ్రూపులుగా అభివర్ణించింది. ఏ ఇతర దేశ భూభాగంపైన గానీ ఉగ్రవాదుల కార్యకలాపాలకు తాలిబన్లు గానీ, ఆప్ఘనిస్తాన్ గ్రూపులు ఎలాంటి మద్దతును ఇవ్వకూడదని పరోక్షంగా తాలిబన్ల గురించి ప్రస్తావించింది భద్రత మండలి ఇదివరకు. తాజాగా జారీ చేసిన ప్రకటనలో- ఈ ప్రస్తావనను పొందుపరిచిన పేరాగ్రాఫ్ను ఎత్తేసింది.

ఐక్యరాజ్య సమితి భద్రత మండలికి ప్రతినెలా ఒక్కో దేశం అధ్యక్షత వహిస్తుంటుంది. ఆగస్టు నెలకు సంబంధించి విడుదల చేసిన ఈ జాబితాలో ఆ పేరాగ్రాఫ్ను ఎత్తి వేసింది. దీనికి సంబంధించిన ఓ ట్వీట్ను ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత సభ్యుడు సయ్యద్ అక్బరుద్దీన్ విడుదల చేశారు. తాలిబన్లు ఆప్ఘనిస్తాన్ను ఆక్రమించుకున్న తరువాత అంటే ఈ నెల 16వ తేదీన జారీ చేసిన ప్రకటన, ఇప్పుడు తాజాగా విడుదల చేసిన దాంట్లో ఉన్న తేడాను వివరించారాయన. ఈ 10 రోజుల వ్యవధిలోనే ఆప్ఘనిస్తాన్పై భద్రత మండలి తన వైఖరిని మార్చుకుందా? అనే అనుమానాలు తలెత్తుతోన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదివరకు ఐక్యరాజ్య సమితి సమావేశానికి హాజరైన విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ను తాలిబన్ల ప్రభుత్వం గురించి ప్రస్తావించగా.. ఆయన దాట వేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోన్న తాలిబన్ల గురించి ఇప్పుడే మాట్లాడటం, ఒక అభిప్రాయానికి రావడం తొందరపడినట్టవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం తమ దృష్టి మొత్తం ఆప్ఘనిస్తాన్లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించడంపై ఉందని అన్నారు.
అదే సమయంలో- తాలిబన్లు భారత్కు అనుకూలంగా ఓ ప్రకటన చేశారు. భారత ప్రాజెక్టులను తాము అడ్డుకోవాలని భావించట్లేదని స్పష్టం చేసింది. కీలుబొమ్మ వంటి అష్రఫ్ ఘని ప్రభుత్వానికి భారత్ అండగా నిలవడాన్ని తాము ముందు నుంచి కూడా తీప్పుపడుతున్నామని తేల్చి చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణానికి దోహదపడే ఈ ప్రాజెక్టును కూడా అడ్డుకోవాలని అనుకోవట్లేదని స్పష్టం చేశారు. అన్ని దేశాలతోనూ తాను సత్సంబంధాలను నెలకొల్పుకోవాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. తాలిబన్ల నుంచి ఇలాంటి వరుస ప్రకటనలు వచ్చిన తరువాత.. ఐక్యరాజ్య సమితి భద్రత మండలి వైఖరి మారినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications