ఉత్తరకొరియాపై అమెరికా కొత్త ఆంక్షలు!
ఉత్తరకొరియాపై అగ్రరాజ్యం మరోసారి కన్నెర్రజేసింది. ఆ దేశంపై మరిన్ని కొత్త ఆంక్షలు విధించింది. అణుపరీక్షలకు నిధులు అందకుండా చేయడమే ఈ ఆంక్షల వెనుక ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు.
వాషింగ్టన్: ఉత్తరకొరియాపై అగ్రరాజ్యం మరోసారి కన్నెర్రజేసింది. ఆ దేశంపై మరిన్ని కొత్త ఆంక్షలు విధించింది. అణుపరీక్షలకు నిధులు అందకుండా చేయడమే ఈ ఆంక్షల వెనుక ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు.
క్షిపణి కార్యక్రమాలకు చెక్పెట్టి ఉత్తర కొరియాను ఒంటరి చేయడంలో భాగంగానే అమెరికా తాజా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీంతో మొత్తం 13 కంపెనీలు, 20 నౌకలు సహా ఉత్తర కొరియా నెరపుతున్న వందలాది మిలియన్ డాలర్ల వాణిజ్యంపై ప్రభావం పడుతుందని సీఎన్ఎన్ మీడియా సంస్థ పేర్కొంది.
''ఈ నిర్ణయంతో ఉత్తర కొరియా దాని మిత్రదేశాలపై మరిన్ని ఆంక్షలు, పెనాల్టీలు విధించడం జరుగుతుంది. రాక్షస పాలనపై మరింత ఒత్తిడి పెంచి ఒంటరిని చేసే అవకాశం ఉంటుంది...'' అని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్ నుచిన్ పేర్కొన్నారు.
ఒక నౌక నుంచి మరో నౌకలోకి బదిలీ చేయడం (షిప్ టు షిప్ ట్రాన్స్ఫర్స్) సహా ఉత్తరకొరియా పలు మోసపూరిత షిప్పింగ్ పద్దతులు అనుసరిస్తున్నట్టు అమెరికా ట్రెజరీ విభాగం ఆరోపిస్తోంది.
ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న దేశాల జాబితాలో మళ్లీ ఉత్తర కొరియాను కూడా చేర్చుతూ అమెరికా అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్న మరుసటి రోజే... ఆ దేశంపై సరికొత్త ఆంక్షలు విధించడం గమనార్హం.
వాస్తవానికి ఉగ్రదేశాల సరసన చేర్చినప్పుడే కొత్త ఆంక్షలకు మార్గం సుగమమైనట్టు వార్తలు వెలువడ్డాయి. 2008లో ఉగ్రదేశాల జాబితా నుంచి ఉత్తర కొరియాను తొలగిస్తూ అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ నిర్ణయించారు.
ఈ జాబితాలో ఉత్తర కొరియాతో పాటు ఇరాన్, సూడాన్, సిరియా తదితర దేశాలు ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్లోనే ఉత్తర కొరియాపై ఓ రేంజ్లో ఐరాస ఆంక్షలు విధించాలని అమెరికా ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.