వేడెక్కిన అమెరికా: మిచెల్ ఒబామా ఎంట్రీ: ట్రంప్ రాంగ్ ప్రెసిడెంట్: ఓట్ అనే నెక్లెస్తో
వాషింగ్టన్: అమెరికాలో ఎన్నికల వేడి పీక్స్కు చేరుకుంటోంది. అధ్యక్ష పదవి కోసం వచ్చే నవంబర్లో నిర్వహించబోతోన్న ఎన్నికల్లో రిపబ్లికన్లు, డెమొక్రాట్లు సర్వశక్తులనూ ఒడ్డుతున్నారు. ఈ క్రమంలో డెమొక్రాట్లు ఓ అడుగు ముందుకేశారు. వరుసగా రెండుసార్లు అమెరికా అధ్యక్షుడిగా ఘన విజయాన్ని అందుకున్న బరాక్ ఒబామా భార్య మిఛెల్ ఒబామాను రంగంలోకి దించారు. ఈ ఎన్నికల సందర్భంగా తొలిసారిగా స్పీచ్ ఇచ్చారు. డెమొక్రాట్ల కన్వెన్షన్ను ఉద్దేశించి ప్రసంగించారు.

ట్రంప్ టార్గెట్గా
డొనాల్డ్ ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని ఆమె ప్రసంగం సాగింది. ఉపాధ్యక్ష పదవి కోసం వ్యూహాత్మకంగా భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారిస్ను ఎంపిక చేసిన డెమొక్రాట్లు..ప్రచార కార్యక్రమాల్లో అంతే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మిఛెల్ ఒబామాను ప్రచారానికి పిలిపించారు. ఇద్దరు పవర్ ఫుల్ మహిళా నేతలను ఎన్నికల బరిలో దింపడంతో అమెరికా ఎన్నికల ప్రచారం ఒక్కసారిగా వేడెక్కింది..ఊపందుకుంటోంది. నిజానికి- డెమొక్రాట్ల కన్వెన్షన్ విస్కాన్సిస్లో గ్రాండ్గా నిర్వహించాలని భావించినప్పటికీ.. కరోనా వైరస్ అవుట్ బ్రేక్ వారి ప్రయత్నాలకు గండి కొట్టింది. ఫలితంగా రికార్డెడ్ ప్రోగ్రామ్గా మిఛెల్ ఒబామా ప్రసంగాన్ని ప్రసారం చేశారు.

ట్రంప్.. రాంగ్ ప్రెసిడెంట్.
సర్వశక్తిమంతమైన అమెరికాకు వచ్చే ఎన్నికల్లో సమర్థుడైన నేతను ఎన్నుకోవాలంటూ మిచెల్ ఒబామా పిలుపునిచ్చారు. డొనాల్డ్ ట్రంప్ రాంగ్ ప్రెసిడెంట్ అంటూ ఎద్దేవా చేశారు. అమెరికా వంటి దేశానికి సారధ్యాన్ని వహించదగ్గ లక్షణాలేవీ డొనాల్డ్ ట్రంప్లో లేవని ఆరోపించారు. ట్రంప్ అనుసరించిన విధానాల వల్ల వేలాదిమంది అమెరికన్లు ఉపాధిని కోల్పోయారని మండిపడ్డారు. ఒకవైపు కరోనా వైరస్.. మరోవైపు ట్రంప్ విధానాలు దేశాన్ని ఆర్థికంగా అతలాకుతలం చేశాయని విమర్శించారు.

నల్లజాతీయులపై దాడులతో
నల్లజాతీయులపై చోటు చేసుకుంటోన్న దాడులను మిచెల్ ఒబామా తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఇప్పటికీ అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ (బీఎల్ఎం) ఆందోళనలు కొనసాగుతున్నాయని అన్నారు. డొనాల్డ్ ట్రంప్ పరిపాలన ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవడానికి ఈ ఆందోళనలు అద్దం పడుతున్నాయని చెప్పారు. అమెరికా సమాజాన్ని విభజించేలా ట్రంప్ పరిపాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. తోటి వారిని శతృవులుగా చూడాల్సిన పరిస్థితిని కల్పించిందని అన్నారు. నల్లజాతీయులపై చోటు చేసుకుంటున్న దాడులతో ప్రపంచ దేశాల్లో అమెరికా చెడ్డపేరును తెచ్చుకుందని చెప్పారు.

జో బిడెన్పై ప్రశంసలు
అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో డెమొక్రాట్ల తరఫున పోటీ చేస్తోన్న జో బిడెన్పై మిచెల్ ఒబామా ప్రశంసల వర్షాన్ని కురిపించారు. బిడెన్.. ముందు చూపు గల నాయకుడిగా అభివర్ణించారు. అలాంటి నాయకుడి నేతృత్వం అమెరికాకు అవసరం ఉందని అన్నారు. ఓ శక్తిమంతమైన దేశానికి.. అంతే శక్తిమంతుడైన నాయకుడి సారథ్యం అవసరం ఉందని సూచించారు. జొ బిడెన్-కమలా హ్యారిస్ జోడీ.. సరికొత్త అమెరికాను సృష్టిస్తుందనడంలో సందేహాలు అక్కర్లేదని అన్నారు. తన భర్త ఒబామాతో కలిసి ఉపాధ్యక్షుడిగా జొ బిడెన్ లక్షలాదిగా ఉపాధి అవకాశాలను కల్పించారని, ఆయన ముందుచూపుతోనే సాధ్యమైందని మిచెల్ చెప్పారు.

ఓట్ అనే నెక్లెస్తో
తన ప్రసంగం సందర్భంగా మిచెల్ ఒబామా.. ఓట్ అనే అక్షరాలతో కూడిన నెక్లెస్ను ధరించి కనిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఓటు విలువను తెలియజేయడంలో భాగంగా.. ఆమె దీన్ని ధరించారని అంటున్నారు. సాధారణంగా ఒబామా బోసి మెడతో కనిపిస్తుంటారని.. ఈ సారి మాత్రం దీనికి భిన్నంగా తేలికపాటి నెక్లెస్ను ధరించడానికి కారణం.. ఎన్నికల ప్రచార కార్యక్రమాలేనని చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలనే సందేశాన్ని ఆమె ఈ రకంగా ఇచ్చినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications