కెనడాకు ట్రంప్ బిగ్ షాక్.. మరోసారి భారీ సుంకాల ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా దేశానికి తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. కెనడా నుండి వచ్చే వాహనాలు, ట్రక్కులు ఆటోమోటివ్ పరికరాలపై టారిఫ్లను రెండింతలు పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కొత్త సుంకాలు 2027 జనవరి నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. గత వారం జరిగిన అమెరికా- ఒట్టావా మధ్య జరిగిన టారిఫ్ చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని తన అధికారిక సోషల్ మీడియాలో ట్రంప్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అమెరికా, కెనడాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రతరం అవుతూందని తెలుస్తోంది.
" 2027 జనవరి 1 నుంచి కెనడా నుంచి దిగుమతయ్యే అన్ని కార్లు, ట్రక్కులు పెద్దవి, చిన్నవి.. ఆటోమోటివ్ పార్ట్ లు, స్టీల్ తదితర ఉత్పత్తులపై సుంకాలు 50 శాతం పెంచుతున్నాం" అని తన అధికారిక సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ లో పోస్టు చేశారు. ప్రస్తుతం కెనడా ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్ లను వసూలు చేస్తోంది అమెరికా. ఇటీవల కెనడా- అమెరికా మధ్య జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇక కెనడా ప్రభుత్వం అమెరికాలోని రైతులు, వ్యవసాయ ఉత్పత్తులపై విపరీతంగా పన్నులు వేస్తూ తమ దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తోందని, దీని వల్ల తమ దేశానికి తీవ్రమైన వాణిజ్య లోటు ఏర్పడుతోందని ట్రంప్ కీలక ఆరోపణలు చేశారు. ఈ మేరకు కెనడా కారణంగా అమెరికాకు ఏటా 60 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఏర్పడుతోందని పేర్కొన్నారు. మరోవైపు అమెరికా చర్యను కెనడా ప్రధాని మార్క్ కార్నీ తీవ్రంగా ఖండించారు. అమెరికా చివరి నిమిషంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంపై మండిపడ్డారు. అమెరికా ప్రతిపాదించిన షరతులు అన్యాయంగా, ఆర్థికంగా తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నాయన్నారు. ఇవి కెనడాపై ప్రతీకార చర్యగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇక కెనడా వాణిజ్యపరంగా అమెరికాపైనే అధికంగా ఆధారపడుతోందన్న సంగతి తెలిసిందే.

గతవారం అమెరికా- కెనడా మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలం అయ్యాయి. దాంతో సుమారు 20 బిలియన్ డాలర్ల విలువైన కెనడియన్ ఉత్పత్తులపై అమెరికా ఇప్పటికే 50 శాతం సుంకాల్ని అమలు చేసింది. ఈ క్రమంలో అమెరికా- కెనడా మధ్య మరోసారి టారిఫ్ వార్ ముదిరినట్లు స్పష్టం అవుతోంది.












Click it and Unblock the Notifications