వైట్హౌస్ వీడేముందు ట్రంప్ బెదిరింపులు - అమెరికన్ల కరోనా సాయానికి కొర్రీలు
వచ్చే నెల 20న అమెరికా కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం జరగబోతోంది. ఆ లోపు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ వీడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అమెరికన్లకు సాయం చేసేందుకు తాజాగా కాంగ్రెస్తో పాటు ప్రతినిధుల సభ ఈ భారీ ఉద్దీపన ప్యాకేజీని ఆమోదించాయి. ఇందుకు ఉద్దేశించిన బిల్లును రెండు సభలు ఆమోదించినా సంతకం చేసేందుకు మాత్రం డొనాల్డ్ ట్రంప్ నిరాకరిస్తున్నారు.
కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అమెరికన్లకు 892 బిలియన్ డాలర్ల సాయం అందించాలని అమెరికా కాబోయే అధ్యక్షుడు బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అమెరికా చట్ట సభలు కాంగ్రెస్, ప్రతినిధుల సభ కూడా ఆమోదం తెలిపాయి. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే ఒక్కో అమెరికన్కు 600 డాలర్ల కరోనా సాయం అందనుంది. అయితే ఇది సరిపోదని, దాన్ని భారీగా పెంచాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. సింగిల్గా ఉండే వారికి 2 వేల డాలర్ల చొప్పన, భార్యాభర్తలు ఉంటే 4 వేల డాలర్లు ఇవ్వాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్, ప్రతినిధుల సభ ఆమోదించిన ఉద్దీపన ప్యాకేజీలో దేశంలోని అమెరికన్లకు సాయంతో పాటు ఇతర అంశాలు ఖూడా ఉన్నాయి. వాటిని తొలగించి దేశీయంగా అమెరికన్లకు సాయాన్ని మాత్రమే ఉంచాలని ట్రంప్ కోరుతున్నారు. అలా అయితేనే ఈ బిల్లుపై సంతకం చేస్తానని కాంగ్రెస్కు తేల్చిచెప్పారు. అలా కుదరకపోతే నా తర్వాత వచ్చే ప్రభుత్వమే దీనిపై నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెస్కు కూడా ఎటూ తేల్చుకోలేని పరిస్ధితి ఎదురవుతోంది. అలా అని సాయాన్ని ఆపితే జనం నుంచి విమర్శలు తప్పవు. దీంతో మధ్యేమార్గం కోసం చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది.