ట్రంప్ టారిఫ్ బాంబ్:భారత్ కంటే ఈ 16 దేశాల్లో బాగా పేలింది!
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా-యూఎస్ వాణిజ్య ఒప్పందంపై 20 శాతం కంటే తక్కువ టారిఫ్ ఉండవచ్చని సూచనలు ఇస్తున్నప్పటికీ ఆయన తాజా ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది. భారత్పై ఏకంగా 25 శాతం అధిక సుంకాలు విధించడమే కాకుండా.. రష్యా వ్యాపారాలపై కూడా జరిమానా విధించనున్నట్లు ప్రకటించారు. అయితే ఆశ్చర్యకరంగా.. దాదాపు 16 దేశాలపై ట్రంప్ భారత్ కంటే ఎక్కువ సుంకాలు విధించారు. ఈ కొత్త సుంకాలు ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి రానున్నాయి.
ట్రంప్ 'టారిఫ్ బాంబ్' పేలిన దేశాలు ఇవే..
ట్రంప్ ఇప్పటివరకు టారిఫ్ బాంబును ప్రయోగించిన దేశాల జాబితాలో 50 శాతంతో బ్రెజిల్ అగ్రస్థానంలో ఉంది. మయన్మార్పై 40%, లావోస్పై 40%, కంబోడియాపై 36%, థాయ్లాండ్పై 36%, బంగ్లాదేశ్పై 35%, సెర్బియాపై 35%, కెనడాపై 35%, మెక్సికోపై 30%, దక్షిణాఫ్రికాపై 30%, బోస్నియా అండ్ హెర్జెగోవినాపై 30%, శ్రీలంకపై 30%, అల్జీరియాపై 30%, ఇరాక్పై 30%, లిబియాపై 30%, చైనాపై 30% సుంకాలు విధించారు. భారత్పై 25 శాతం సుంకాలు విధించారు. బ్రూనై, మలేషియా, సౌత్ కొరియా దేశాలపై కూడా 25 శాతం టారిఫ్ ఉంది.

అదే సమయంలో కొన్ని దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాత వారికి సుంకాలలో ఉపశమనం కూడా లభించింది. వియత్నాంపై 20 శాతం, ఇండోనేషియాపై 19 శాతం, ఫిలిప్పీన్స్ 19 శాతం, జపాన్ పై 15 శాతం టారిఫ్ విధించారు. కజకిస్తాన్ (25%), మోల్డోవా (25%), ట్యునీషియా (25%), యూరోపియన్ యూనియన్ (15%) కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ దేశాలపై కూడా ఆగస్టు 1, 2025 నుండి కొత్త టారిఫ్ అమల్లోకి వస్తుంది. బ్రెజిల్, మయన్మార్, బంగ్లాదేశ్, కెనడా, మెక్సికో వంటి 16 దేశాలు భారత్ కంటే ఎక్కువ టారిఫ్ల బారిన పడినట్లు ఈ జాబితా స్పష్టం చేస్తుంది.
సుంకాల జాబితా ఇలా..
బ్రెజిల్ - 50%
మయన్మార్ - 40%
లావోస్- 40%
కంబోడియా-36%
థాయ్లాండ్-36%
బంగ్లాదేశ్- 35%
సెర్బియా - 35%
కెనడా - 35%
మెక్సికో - 30%
దక్షిణాఫ్రికా - 30%
బోస్నియా అండ్ హెర్జెగోవినా-30%
శ్రీలంక- 30%
అల్జీరియా- 30%
ఇరాక్- 30%
లిబియా- 30%
చైనా -30%
భారత్ -25%
బ్రూనై -25%
మలేషియా- 25%
సౌత్ కొరియా- 25%
వియత్నాం -20%
ఇండోనేషియా- 19%
ఫిలిప్పీన్స్- 19%
జపాన్ -15%
అంచనా తలకిందులు
అంతకు ముందు ట్రంప్ భారత్ తో అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్న సమయంలో యూఎస్ టారిఫ్ 20 శాతం కంటే తక్కువగా ఉండవచ్చని పదేపదే సూచించారు. "ప్రతి దేశానికి లేఖ పంపాల్సిన అవసరం లేదు, వ్యాపార భాగస్వాములకు 15 నుండి 20 శాతం వరకు మాత్రమే ఉంటుంది" అని ట్రంప్ అప్పట్లో అన్నారు. కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు భారత్పై 25 శాతం టారిఫ్, రష్యాతో వ్యాపారంపై జరిమానా విధించనున్నట్లు ప్రకటించడంతో అంచనాలు తలకిందులయ్యాయి.
భారత్లో ఆందోళన.. వియత్నాంలో సంబరాలు
భారత్పై 25 శాతం టారిఫ్ విధించడంతో భారతీయ ఎగుమతిదారులలో ఆందోళన నెలకొంది. అయితే వియత్నాం ఎగుమతిదారులు సంబరాలు చేసుకుంటున్నారు. దీనికి కారణం అమెరికాకు వెళ్లే తమ వస్తువులపై కేవలం 20 శాతం టారిఫ్ మాత్రమే ఉండటం. ఇది భారత్ కంటే వారికి 5 శాతం అధిక ప్రయోజనం కల్పిస్తోంది. కేవలం సంఖ్యల విషయం మాత్రమే కాదు, సమయం, పరిస్థితి, సంసిద్ధత కూడా ఇక్కడ చాలా ముఖ్యంగా పరిగణించాల్సి ఉంటుంది. వియత్నాం ఇప్పటికే ఎలక్ట్రానిక్స్, వస్త్రాలు, సముద్ర ఉత్పత్తుల వంటి అనేక కీలక రంగాల్లో భారత్ నేరుగా పోటీ పడుతోంది. ఈ రంగాలు అమెరికాకు భారత్ చేసే 91 బిలియన్ డాలర్ల ఎగుమతుల్లో దాదాపు 5 శాతం వాటాను కలిగి ఉన్నాయి. వియత్నాం వాటిని చేజిక్కించుకోవడానికి సిద్ధంగా ఉంది.












Click it and Unblock the Notifications