ఆర్థికమంత్రి రాజీనామా: అదే దారిలో వైద్యశాఖ కూడా: ప్రభుత్వంలో అనూహ్య సంక్షోభం
లండన్: బ్రిటన్ ప్రభుత్వం సంక్షోభంలో పడినట్టే కనిపిస్తోంది. ఒకదాని తరువాత ఒకటి అనూహ్య పరిణామాలు సంభవిస్తోన్నాయి. ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ తక్షణ నివారణ చర్యలు తీసుకున్నప్పటికీ.. అది ఎంతో కాలం పని చేయకపోవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన ప్రభుత్వంలో కీలక శాఖలకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ఇద్దరు మంత్రులు ఒకరి తరువాత ఒకరు తమ పదవులకు గుడ్బై చెప్పారు. ప్రధానికి ఘాటు లేఖ రాశారు.
నారాయణమూర్తి అల్లుడిగా..
బ్రిటన్ ఆర్థిక, వైద్య శాఖ మంత్రులు రిషి సునక్, సాజిద్ జావిద్.. తమ పదవులకు రాజీనామా చేశారు. రిషి సునక్ మరెవరో కాదు. దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు. బ్రిటన్లో అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ. 2020లో బ్రిటన్ ఆర్థిక శాఖ మంత్రిగా అపాయింట్ అయ్యారు. తాజాగా ఆయన తన పదవి నుంచి తప్పుకొన్నారు. రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాని బోరిస్ జాన్సన్కు లేఖ రాశారు.
వరుస రాజీనామాలు..
తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తొలుత ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్ జావిద్ ప్రకటించారు. రాజీనామా లేఖను బకింగ్హామ్ ప్యాలెస్కు పంపించినట్లు తెలిపారు. ఆ కొద్దిసేపటికే ఆర్థిక శాఖ మంత్రి రిషి సునక్ కూడా గుడ్బై చెప్పారు. ఈ రాజీనామాలకు ప్రధాన కారణం పార్టీ గేట్ వ్యవహారమేనని బ్రిటన్ మీడియా చెబుతోంది. లైంగిక దాడుల ఆరోపణలను ఎదుర్కొంటోన్న మాజీ మంత్రి క్రిస్ పించర్ను పార్టీ ఎంపీగా నామినేట్ చేయడం పట్ల బోరిస్ జాన్సన్ క్షమాపణలు కోరారు. ఆ వెంటనే రిషి సునక్, సాజిద్ జావిద్ రాజీనామాలు చేశారు.
కఠిన నిర్ణయాలను తీసుకోలేనంటూ..
కరోనా వైరస్, రష్యా-ఉక్రెయిన్ మధ్య తలెత్తిన యుద్ధం తరువాత ప్రపంచం ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటోందని, ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని కఠిన సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందని రిషి సునక్.. ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆర్థిక మంత్రిగా కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉందని చెప్పారు. అలాంటి నిర్ణయాలను తాను తీసుకోలేనని స్పష్టం చేశారు. అందుకే తన పదవికి రాజీనామా చేసినట్లు వివరించారు. మంత్రిగా ఇదే తన చివరి ఉద్యోగం అంటూ వ్యాఖ్యానించారు.
కొత్త వారు అపాయింట్..
కాగా- వారిద్దరి రాజీనామాల వల్ల ఏర్పడిన సంక్షోభ పరిస్థితులను నివారించడానికి బోరిస్ జాన్సన్ తక్షణ చర్యలు తీసుకున్నారు. రిషి సునక్, సాజిద్ జావిద్ రాజీనామాలను క్వీన్ ఎలిజబెత్ 2 ఆమోదించిన కొద్దిసేపటికే ఆ రెండు శాఖలకు కొత్త వారిని అపాయింట్ చేశారు. విద్యాశాఖ మంత్రి నదీమ్ జహావికి ఆర్థిక శాఖను కేటాయించారు. ఖుర్దీష్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఆయన స్వదేశం ఇరాక్. కేబినెట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీవ్ బార్క్లేకు వైద్య శాఖను అప్పగించారు. ఈ నియామకాలను క్వీన్ ఎలిజబెత్ ఆమోదించారు.