UK-India Week 2022 Day 2: క్లైమేట్ ఫైనాన్స్ పై భారత్ కీలక వాదన- 3S తోనే సాధ్యమంటూ..
భారత్-యూకే మధ్య 75 ఏళ్ల బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా లండన్ లో జరుగుతున్న యూకే-భారత్ వీక్ 2022లో ఇవాళ క్లైమేట్ ఫైనాన్స్ తో పాటు టెక్నాలజీ సమ్మిట్ కూడా జరిగింది. ఇందులో భారత్ తరఫున పాల్గొన్న పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ కీలక సూచన చేశారు. వాతావరణ మార్పులపై జరుగుతున్న పోరుకు నిధులిచ్చి సహకరించేలా ప్రపంచ దేశాల్ని ఒప్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన కీలక ప్రసంగం చేశారు.
యూకే-బ్రిటన్ వీక్ 2022లో భాగంగా లండన్ లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో బాగంగా ఇవాళభారత్, యూకేకు చెందిన పలువురు సీనియర్ మంత్రులు, ఎంపీలు, పారిశ్రామిక వేత్తలు పాల్గొని తమ అభిప్రాయాలు పంచుకంటున్నారు. వీరంతా వాతావరణ మార్పులకు సంబంధించిన కొన్ని అత్యంత ముఖ్యమైన సమస్యలపైనా, సాంకేతికత, ఆర్థిక , సుస్థిరత కార్యక్రమాలను ప్రభావితం చేయడంలో పోషించగల పాత్రపై చర్చించారు. శాశ్వత పరిష్కారాలను సాధించడానికి విస్తృత-శ్రేణి యూకే-భారత భాగస్వామ్యం అవసరాన్ని వీరు గుర్తుచేశారు.
భారత ప్రభుత్వం పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల కోసం చేపడుతున్న చర్యలపైనా కేంద్ర కేబినెట్ మంత్రి భూపేందర్ యాదవ్ తన అభిప్రాయాలు వెల్లడించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు, అడాప్టేషన్ ఫైనాన్స్ ముఖ్యమైనదని ఆయన వెల్లడించారు. అలాగే అభివృద్ధి చెందిన ప్రపంచం ద్వారా 100 బిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యాన్ని నెరవేర్చాలని సూచించారు. ఈ క్లైమేట్ ఫైనాన్స్ సమస్యను తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. మూడు ముఖ్యమైన ఎస్ లు ఇందులో కీలక పాత్ర పోషించాలన్నారు. ఇవి స్కోప్, స్కేల్, స్పీడ్ గా ఆయన వాతావరణ మార్పు అనేది భవిష్యత్తులో మనకు ఎదురుచూసే విపత్తు కాదని, కానీ అది మన ప్రస్తుత వాస్తవికతని కేంద్రమంత్రి పేర్కొన్నారు. మిషన్ మోడ్లో అనుసరణ, ఉపశమన చర్యలను అమలు చేయడానికి భారత్ ప్రధానంగా దేశీయ వనరులపై ఆధారపడుతోందని భూపేందర్ యాదవ్ గుర్తుచేసారు.
తగినంత ఆర్థిక , సాంకేతిక బదిలీని ప్రోత్సహించడం ద్వారా మనం క్లైమేట్ ఫైనాన్స్ అనుకూలతలపై ప్రపంచ లక్ష్యాల కార్యాచరణను వేగవంతం చేయాలని కేంద్రమంత్రి కోరారు. సాంకేతిక చర్చలు, రాజకీయ స్థాయిలో వాతావరణ ఆర్థిక అనుసరణ ఎజెండాపై దృష్టి సారించడానికి షర్మ్ ఎల్-షేక్ లో జరిగే COP27 సదస్సు కోసం తాము ఎదురుచూస్తున్నట్లు ఆయన వెల్లడించారు. COP26 తర్వాత గ్రీన్ ఫ్యూచర్లో పెట్టుబడి పెట్టడంపై జరిగిన సెషన్లో, యూకే ప్రభుత్వ పెట్టుబడి మంత్రి లార్డ్ గెర్రీ గ్రిమ్స్టోన్ కూడా స్పందించారు. భారత కంపెనీలు యూకేలో గ్రీన్ ఫైనాన్స్ని పెంచాలని కోరుకుంటున్నామన్నారు. తాము ఈ పని చేయడానికి విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించాలని, వారి పరిశోధక విద్యార్థులను మార్పిడి చేయాలని సూచించారు.
ఈ సదస్సులో భాగంగా రేపు, ఎల్లుండి జరిగే ఇతర సెషన్లలో శక్తి పరివర్తనను రూపొందించడంలో వ్యాపార సహకారం, COP27కి ముందున్న మార్గం, వాతావరణ చర్యలో అంతరాయం కలిగించే సాంకేతికతలపై చర్చించనున్నారు.COP26 ప్రెసిడెంట్ అలోక్ శర్మ మాట్లాడుతూ.. తాము COP26లో చారిత్రాత్మక వాతావరణ ఒప్పందానికి దాదాపు 200 దేశాలను ఒప్పంచగలిగామన్నారు. ఎందుకంటే ప్రతి దేశం వారి స్వప్రయోజనాల కోసం పాకులాడుతుందన్నారు. షర్మ్ ఎల్-షేక్ వద్ద COP27 కోసం చర్యల్ని వేగవంతం చేయాలని సూచించారు. శిలాజ ఇంధనాలపై ఎక్కువగా ఆధారపడలేమని, పునరుత్పాదక ఇంధనాలపై పరిశోధనల్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. వాతావరణ చర్యల విషయంలో ప్రధాని మోదీ చాలా నిబద్ధతతో ఉన్నారని ఆయన ప్రశంసించారు. వాతావరణ లక్ష్యాలపై యూకేతో కలిసి పనిచేయడానికి భారత ప్రభుత్వం నిబద్ధతతో ఎదురుచూస్తోందన్నారు.