పుతిన్ హద్దు దాటావు.. ఇక గుణపాఠం తప్పుదు : బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హెచ్చరిక
ఉక్రెయిన్పై రష్యా సేనల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతున్నాయి.. కీవ్, మరియుపోల్, ఉర్కీవ్ నగరాలలో విధ్వంసం సృష్టిస్తోంది. తూర్పు ఉక్రెయిన్లో దాడులకు తెగబడుతోంది. మృతుల సంఖ్య భారీగానే ఉండే అవకాశం ఉందని ఉక్రెయిన్ పేర్కొంది. రష్యా బలగాలు ఫాస్పరస్ బాంబులను ఉపయోగించినట్లు లుహాన్స్క్ రీజియన్ గవర్నర్ సెర్గీ గేడే ఆరోపించారు. ప్రపంచ దేశాలు ఆంక్షలు విధిస్తున్న వెనక్కి తగ్గని రష్యా అధ్యక్షుడు పుతిన్పై బ్రిటన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
రెడ్ లైన్ దాటిన పుతిన్
ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యాను కట్టడి చేసేందుకు మరిన్ని ఆంక్షాలు విధంచాల్సిన అవసరం ఉందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. తమ మిత్రదేశాలతో కలిసి ఆర్థిక ఒత్తిడిని పెంచుతామని హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే రెడ్ లైన్ దాటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ముందు ఆయన హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పుతిన్ తన బంగారు నిల్వలను యాక్సెస్ చేయకుండా నిరోధించేందుకు ఏం చేయొచ్చో అన్నదానిపై ఆలోచిస్తున్నట్లు తెలిపారు.
పుతిన్ ప్రైవేటు సైన్యంపై ఆంక్షలు
మరో వైపు రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తూ బ్రిటన్ నిర్ణయం తీసుకుంది. రష్యా పారిశ్రామికవేత్తలు , బ్యాంకులు, రక్షణా సంస్థలే లక్ష్యంగా చర్యలకు పూనుకుంది. దాదాపు 65 మందిపై కొత్తగా ఆంక్షలు విధించింది. వారిలో ప్రధానంగా చెల్సియా ఫుట్ బాల్ క్లబ్ యజమాని రోమన్ అబ్రమొవిచ్తో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్న పుతిన్ ప్రైవేటు సైన్యంగా చెప్పుకుంటున్న పారామిలిటరీ వాగ్నర్ గ్రూప్ , రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ కుమార్తె పోలినా కోవెలెవా , రష్యా రైల్వే , రక్షణ సంస్థ క్రోన్ష్ టాడ్ట్, యూజీన్ ష్విడ్లర్ ఉన్నారు. అంతేకాకుండా మెలిటోపోల్ మేయర్ గలీనా డానిల్చెంకో, ఆల్పా బ్యాంకుతో పాటు మరికొందరిపై ఆంక్షలు విధించింది. ఇప్పటివరకు రష్యాకు చెందిన మొత్తం వెయ్యి మందికిపైగా వ్యక్తులు , సంస్థలపై ఆంక్షలు విధించినట్లు బ్రిటన్ వెల్లడించింది. రష్యా అధ్యక్షుడు ఇప్పటికైనా ఉక్రెయిన్ పై యుద్ధానికి ముగింపు పలకాలని సూచించింది.

రష్యా యుద్ధనౌక ధ్వంసం
అటు రష్యా బలగాల దాడులను ఉక్రెయిన్ సేనలు సమర్ధవంతంగానే ఎదుర్కొంటున్నాయి. ఇప్పటివరకు 15,800 మందికిపైగా రష్యా సైనికులను హతమార్చారు. యుద్ధ విమానాలను, హెలికాప్టర్లను, ఆయుధ సామాగ్రిని నాశనం చేశాయి. తాజాగా బెర్డియాన్స్క్ లో రష్యా కు చెందిన పెద్ద యుద్ధ నౌక ఓర్స్క్ ను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ దళాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 27న బెర్డియాన్స్క్ ప్రాంతాన్ని రష్యా సేనలు స్వాధీనం చేసుకున్నాయి. తాజాగా రష్యాకు చెందిన యుద్ధ నౌకను ఉక్రెయిన్ సేనలు బాంబులతో పేల్చిపడేశాయి. రష్యా దాడుల నుంచి తమ నగరాలను , పౌరులను కాపాడుకునేందుకు సైనిక మద్దతు ఇవ్వాలని నాటో, జీ-7, ఈయూ దేశాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కోరారు.












Click it and Unblock the Notifications