చేతులారా ప్రధానమంత్రి పదవిని పోగొట్టుకుంటోన్నరా?
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి పదవి కోసం కొనసాగుతోన్న ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటివరకు అధికార కన్జర్వేటివ్ పార్టీలో అయిదు రౌండ్ల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. 11 మంది బ్రిటన్ ప్రధాని రేసులో నిల్చోగా.. ఇద్దరు మాత్రమే చివరి రౌండ్ వరకూ నిలిచారు. భారత సంతతికి చెందిన రిషి సునక్, లిజ్ ట్రస్ పోటీలో ఉన్నారు. బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో రిషి సునాక్ ఆర్థికశాఖ మంత్రిగా పని చేశారు. లిజ్ ట్రస్ విదేశాంగ శాఖకు ప్రాతినిథ్యాన్ని వహించారు.

బోరిస్ జాన్సన్ తరువాత..
ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ప్రధానమంత్రిగా నియమితులు కావడం ఖాయమైంది. బోరిస్ జాన్సన్ తరువాత బ్రిటన్ ప్రధానిగా ఎన్నిక అవుతారు. ఆ ఒకరు ఎవరనే విషయంపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. ఆధిక్యత చేతులు మారుతూ వస్తోంది. చివరికి రిషి సునాక్కు ఎదురు దెబ్బ తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. రిషి కంటే కూడా లిజ్ ట్రస్ పోటీలో మరింత దూసుకెళ్లారు.

తాజా సర్వే..
ప్రధాని అభ్యర్థిత్వంపై ప్రముఖ మార్కెటింగ్ ఫర్మ్ స్మార్కెట్స్ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 89.29 శాతం మంది లిజ్ ట్రస్ నాయకత్వంవైపే మొగ్గు చూపుతున్నారు. తాజాగా లీడ్స్లో నిర్వహించిన కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల కీలక సమావేశం అనంతరం స్మార్కెట్స్ ఈ సర్వే చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీ తరువాత రిషి సునక్ ఆధిక్యత మరింత తగ్గిందని, అది కాస్తా లిజ్ ట్రస్ వైపు మొగ్గు చూపిందని స్పష్టమైంది.

విండ్ఫాల్ ట్యాక్స్..
ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలపై విండ్ఫాల్ ట్యాక్స్ను విధించబోనంటూ లిజ్ ట్రస్ ఇచ్చిన హామీ ఇక్కడ తీవ్ర ప్రభావం చూపిందని, ఆధిక్యత ఆమె వైపు మొగ్గు చూపేలా చేసిందని స్మార్కెట్స్ తన సర్వే నివేదికలో స్పష్టం చేసింది. పారిశ్రామికరంగానికి చెందిన ప్రముఖులు లిజ్ ట్రస్కు ప్రాధాన్యతను ఇవ్వడానికి అదే కారణమైందని పేర్కొంది. ఇదివరకు యుగోవ్ సర్వే సైతం రిషి సునాక్ వెనుకంజలో ఉన్నారనే విషయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. సునాక్ కంటే లిజ్ ట్రస్ 24 పాయింట్ల ఆధిక్యతలో ముందంజలో ఉన్నారని ఆ సర్వే తేల్చి చెప్పింది.

రిషి ఏం చెబుతున్నారు?
ప్రధాని రేసులో వెనుకపడటం పట్ల రిషి సునాక్ స్పందించారు. తన అవకాశాలకు ఇంకా పూర్తిస్థాయిలో తెర పడలేదని చెప్పారు. ఈ రౌండ్లో మొత్తం 12 సమావేశాలు జరగాల్సి ఉంది. ఇందులో లీడ్స్లో నిర్వహించిన భేటీ మొట్టమొదటింది. ఇంకా రౌండ్స్ మిగిలివున్నందున తాను దూసుకొస్తాననీ రిషి సునాక్ అన్నారు. తన ప్రాధాన్యతల విషయంలో రాజీపడబోనని, అవే తనను గెలిపిస్తాయనీ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications