రష్యా వెనుకంజ: దూకుడుకు సడన్ బ్రేకులు: ఉక్రెయిన్ సైన్యం కీలక ప్రకటన
కీవ్: రష్యా- ఉక్రెయిన్ మధ్య ఆరంభమైన యుద్ధం అయిదో రోజుకు చేరుకుంది. రాజధాని కీవ్ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తోన్న రష్యా సైన్యానికి అనూహ్యంగా ప్రతిఘటన ఎదురవుతోంది. కీవ్ను చుట్టుముట్టి మూడు రోజులు అవుతున్నప్పటికీ.. దాన్ని స్వాధీనం చేసుకోలేకపోతోన్నాయి రష్యన్ బలగాలు. ఊహించని విధంగా ఉక్రెయిన్ ఎదురుదాడికి దిగడంతో చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రాణనష్టాన్ని చవి చూడాల్సిన పరిస్థితిని చవి చూస్తోన్నాయి.

ముప్పేటదాడిలో రష్యా..
అటు- ఐక్యరాజ్యసమితి భద్రత మండలి సహా అంతర్జాతీయ వేదికల నుంచి రష్యా తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటోంది. ఆంక్షలతో సతమతమౌతోంది. యూరోపియన్ యూనియన్తో పాటు అమెరికా, కెనడా వంటి పలు దేశాలు రష్యాపై ఆర్థికంగా ముప్పేటదాడిని కొనసాగిస్తోన్నాయి. ఆంక్షలపై ఆంక్షలను విధిస్తోన్నాయి. ఈ పరిణామాల మధ్య డాలర్తో పోల్చుకుంటే రష్యన్ రూబుల్ విలువ దారుణంగా పడిపోయింది. అటు మాస్కో స్టాక్ మార్కెట్లోనూ ట్రేడింగ్ స్తంభించిపోయింది.

గగనతలాలు క్లోజ్..
గ్రీస్, కెనడా వంటి పలు దేశాలు రష్యా ఎయిర్క్రాఫ్ట్ రాకపోకలకు అనుమతి ఇవ్వట్లేదు. రష్యన్ విమానాల కోసం తమ దేశ గగన తలాన్ని మూసివేశాయి. యూరోపియన్ యూనియన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయా దేశాలన్నీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి. యూరోపియన్ యూనియన్లో లేని దేశాలు సైతం రష్యా విమానాల రాకపోకలకు అనుమతి ఇవ్వట్లేదు. ఈ పరిణామాలన్నీ రష్యాను ఏకాకి చేసినట్టే అయింది. యుద్ధాన్ని కొనసాగించడంపై పునరాలోచించుకునేలా చేసినట్టయింది.

మెట్టు దిగిందా?
యుద్ధం అయిదో రోజుకు చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా తన దాడుల్లో తన వేగాన్ని తగ్గించినట్లు కనిపిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో శరవేగంగా మారుతున్న పరిణామలన్నీ తనకు వ్యతిరేకంగా చోటు చేసుకుంటోన్నందు వల్ల రష్యా కాస్త మెట్టుదిగినట్టేననే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఏకపక్షంగా దూసుకెళ్తోన్న రష్యా.. అయిదో రోజు తన దూకుడులో వేగాన్ని తగ్గించిందనే అభిప్రాయాలు ఉన్నాయి.

వేగం తగ్గిందని ప్రకటించిన ఉక్రెయిన్..
ఈ విషయాన్ని ఉక్రెయిన్ సైన్యాధికారులు సైతం అధికారికంగా ప్రకటించారు. రష్యన్ సైనిక బలగాలు తమ దాడుల్లో వేగాన్ని తగ్గించినట్లు స్పష్టం చేశారు. కీవ్లోకి చొచ్చుకుని వచ్చే విషయంలో రష్యా సైన్యం ఇదివరకట్లా దూకుడుగా వ్యవహరించట్లేదని పేర్కొన్నారు. కొన్ని చోట్ల నగరాల్లో మాత్రం యధాతథంగా దాడులను కొనసాగిస్తోన్నప్పటికీ- ప్రధాన కదనరంగాలుగా ఉన్న కీవ్ సహా కొన్ని వ్యూహాత్మక ప్రాంతాల్లో వెనుకంజ వేసినట్టుగా భావిస్తున్నామని వివరించారు. అంతకుముందు- జైటోమిర్, చెర్నిగివ్ నగరాల్లో పౌర నివాస ప్రాంతాలపై రష్యా సైనికులు మిస్సైళ్లతో దాడులు చేసినట్లు ఆరోపించారు. ఈ దాడుల్లో పలు భవనాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.

న్యూక్లియర్ వెపన్స్పై..
మరోవంక- రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణ్వాయుధాలను ప్రయోగించడానికి సమాయాత్తమౌతున్నారనే సమాచారం ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. అణ్వాయుధాలను ప్రయోగిస్తే- సంభవించే పెను నష్టం, ప్రభావం అంచనాలకు అందని విధంగా ఉంటుందనే ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. అణ్వాయుధాలతో యుద్ధానికి దిగే పరిస్థితి ఏర్పడిందంటూ పుతిన్ చేసిన ప్రకటన.. ప్రపంచ దేశాలను ఆగ్రహానికి గురి చేశాయి. ఆంక్షలపై ఆంక్షలు విధించడంతో కొంత వెనక్కి తగ్గిన పరిస్థితులు నెలకొన్నట్టేననే అంచనాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications