Ukraine Drone Strike: మాస్కో పై ఉక్రెయిన్ డ్రోన్ల మోత-ట్రంప్ జోక్యం ఉంటుందా..?
Moscow drone strike:ఉక్రెయిన్ సైన్యం మంగళవారం తెల్లవారుజామున మాస్కో నగరంపై ఊహించని రీతిలో డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఒకరు దుర్మరణం చెందగా, కనీసం ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. రష్యా రక్షణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం,ఉక్రెయిన్ సోమవారం రాత్రి ఏకంగా 337 డ్రోన్లను ప్రయోగించిందని, వాటిలో 91 డ్రోన్లు మాస్కో నగరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయని వెల్లడించింది. యుద్ధం మొదలైనప్పటి నుండి ఉక్రెయిన్ ఇంతటి స్థాయిలో దాడులకు పాల్పడటం ఇదే తొలిసారి అని భావిస్తున్నారు. ఈ దాడి ధాటికి మాస్కో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ అగ్నిప్రమాదాలు సంభవించాయి. భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు రైలు, విమాన రాకపోకలను నిలిపివేశారు.
ఉక్రెయిన్ సరిహద్దులకు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యా రాజధాని మాస్కో నగరంపై ఈ దాడులు జరగడం తీవ్ర కలకలం రేపుతోంది.ఇదిలా ఉండగా,సౌదీ అరేబియా వేదికగా అమెరికా టాప్ దౌత్యవేత్త మార్కో రూబియోతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ సమావేశం కానున్నారు.మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ యుద్ధానికి శాంతియుతంగా పరిష్కారం కనుగొనడం కీలక మద్దతుదారుల నుంచి సహాయం పునరుద్ధరించడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలంటే ఉక్రెయిన్ రాయితీలు ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

మాస్కోపై కీవ్ దాడులు:
రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, రష్యా సైన్యం మొత్తం 337 ఉక్రెయిన్ డ్రోన్లను నేలకూల్చింది.వాటిలో మాస్కో ప్రాంతంలో 91 డ్రోన్లు,కుర్స్క్ ప్రాంతంలో 126 డ్రోన్లు ఉన్నాయి. ఉక్రేనియన్ దళాలు వెనక్కి తగ్గిన కుర్స్క్ ప్రాంతంపై కూడా డ్రోన్లు దాడులు చేయడం గమనార్హం.ఈ భారీ డ్రోన్ దాడి నేపథ్యంలో రష్యా దర్యాప్తు కమిటీ ఉగ్రవాద చర్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. మాస్కో నగర మేయర్ సెర్గీ సోబ్యానిన్ టెలిగ్రామ్ ద్వారా వెల్లడిస్తూ, మాస్కో నగరంపై ఇంత పెద్ద ఎత్తున ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేయడం ఇదే మొదటిసారి అని తెలిపారు. రద్దీ సమయం పెరిగే కొద్దీ నగరంలో వైమానిక దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతున్నామని ఆయన పేర్కొన్నారు. మాస్కో నగరం దాని పరిసర ప్రాంతాల్లో కనీసం 21 మిలియన్ల జనాభా నివసిస్తున్నారు.ఇది ఐరోపా ఖండంలోనే అతిపెద్ద మహానగరాలలో ఒకటి.మాస్కోపై శత్రు UAVల (మానవరహిత వైమానిక వాహనాలు) యొక్క భారీ దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టామని సోబ్యానిన్ టెలిగ్రామ్ ద్వారా తెలిపారు.
మాస్కో ప్రాంత గవర్నర్ ఆండ్రీ వోరోబ్యోవ్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ దాడిలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. ధ్వంసమైన అపార్ట్మెంట్కు సంబంధించిన ఫోటోను ఆయన విడుదల చేశారు. డ్రోన్ శకలాలు పడిపోవడంతో ఆగ్నేయ శివారు ప్రాంతంలోని నివాస భవనంలోని కనీసం ఏడు అపార్ట్మెంట్లు ధ్వంసమయ్యాయని ఆయన తెలిపారు. మాస్కో ప్రాంతంలోని రామెన్స్కోయే జిల్లాలో ఉన్న ఒక బహుళ అంతస్తుల భవనం నుండి కొందరు నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.ఈ ప్రాంతం రష్యా రాజధాని క్రెమ్లిన్కు సుమారు 50 కిలోమీటర్ల (31 మైళ్ళు) దూరంలో ఉంది.
🚨 Overnight, Ukraine launched what appears to be its largest drone attack on Moscow to date, targeting the Russian capital early Wednesday. The assault forced the closure of two major airports, ignited fires, and damaged residential areas, according to officials and media… pic.twitter.com/CHf6o3zYIO
— Patriot Post (@PatriotPostX) March 11, 2025
మాస్కోలో స్థంభించిన రవాణా వ్యవస్థ
మాస్కోలోని నాలుగు ప్రధాన విమానాశ్రయాలలో విమాన రాకపోకలను నిలిపివేసినట్లు రష్యా ఏవియేషన్ వాచ్డాగ్ ప్రకటించింది. గాలి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. మాస్కోకు తూర్పు దిశలో ఉన్న యారోస్లావ్ మరియు నిజ్నీ నొవ్గోరోడ్ ప్రాంతాల్లోని విమానాశ్రయాలను కూడా మూసివేశారు.RIA వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, మాస్కోకు దక్షిణంగా 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న డోమోడెడోవో జిల్లాలోని రైల్వే స్టేషన్ కూడా ఈ దాడిలో ధ్వంసమైంది. మాస్కో ప్రాంతంలో డ్రోన్ దాడుల కారణంగా రైల్వే ట్రాక్లు దెబ్బతినడంతో కొన్ని ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు.భారీ దాడులు జరుగుతున్నప్పటికీ, మాస్కో నగరంలో ప్రజలు భయాందోళనలకు గురికాలేదని రాయిటర్స్ వార్తా సంస్థ నివేదిక వెల్లడించింది.నగరంలోని మధ్య ప్రాంతంలో ప్రజలు తమ రోజువారీ పనులకు యథావిధిగా హాజరయ్యారు.రష్యా ప్రభుత్వ ఆధీనంలోని అంతర్జాతీయ వార్తా సంస్థ RT, డ్రోన్ల దాడి కారణంగా నివాస గృహాల్లో చెలరేగిన మంటలకు సంబంధించిన వీడియోలను విడుదల చేసింది.
అమెరికా-ఉక్రెయిన్ చర్చలు:
మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్ధానికి శాంతి చర్చల ద్వారా పరిష్కారం కనుగొనేందుకు ఉక్రెయిన్ అధికారులు సౌదీ అరేబియాలో అమెరికా బృందంతో సమావేశం అవుతున్న సమయంలోనే ఈ భారీ డ్రోన్ దాడి జరగడం గమనార్హం. మరోవైపు, రష్యా బలగాలు పశ్చిమ రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలో వేలాది మంది ఉక్రెయిన్ సైనికులను చుట్టుముట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి.గత నెలలో వైట్ హౌస్లో జరిగిన సమావేశం విఫలం కావడంతో సౌదీ అరేబియాలో జరగబోయే చర్చలు అత్యంత కీలకమైనవిగా భావిస్తున్నారు. ఆ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కృతజ్ఞత లేనందుకు తీవ్రంగా విమర్శించారు. ట్రంప్ జెలెన్స్కీని నిందించిన తర్వాత అమెరికా, ఉక్రెయిన్కు అందిస్తున్న సైనిక సహాయాన్ని నిలిపివేసింది. గూఢచార సమాచారాన్ని శాటిలైట్ చిత్రాలను అందించేందుకు నిరాకరించింది. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని ఉక్రెయిన్పై ఒత్తిడి పెంచేందుకే అమెరికా ఈ చర్యలకు పాల్పడింది.ట్రంప్ ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పాలని భావిస్తున్నప్పటికీ, కుర్స్క్లో రష్యా సైనిక చర్యలు ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో యుద్ధ వాతావరణం మరింత వేడెక్కింది.
డ్రోన్ వార్:
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఐరోపా ఖండంలో ఇదే అతిపెద్ద యుద్ధంగా కొనసాగుతోంది.డ్రోన్ల వినియోగంతో ఈ యుద్ధం సరికొత్త మలుపు తిరిగింది.మాస్కో కైవ్ ప్రభుత్వాలు కొత్త డ్రోన్లన కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నాయి.డ్రోన్లను వినూత్నంగా ఉపయోగించడంతో పాటు వాటిని సమర్థవంతంగా ఎలా నాశనం చేయాలనే దానిపై దృష్టి సారించాయి. రైతులు షాట్గన్ల నుండి ఆధునిక ఎలక్ట్రానిక్ జామింగ్ వ్యవస్థల వరకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.మాస్కో ఇతర కీలక ప్రాంతాల రక్షణ కోసం రష్యా ఎలక్ట్రానిక్ "గొడుగు" వంటి వ్యవస్థలను అభివృద్ధి చేసింది. వ్యూహాత్మక భవనాల చుట్టూ అధునాతన రక్షణ వలయాలను ఏర్పాటు చేసింది. రాజధాని నడిబొడ్డున ఉన్న క్రెమ్లిన్కు డ్రోన్లు చేరుకోకుండా సంక్లిష్టమైన వైమానిక రక్షణ వ్యవస్థను సైతం సిద్ధం చేసింది.రష్యా దళాలు జరుపుతున్న డ్రోన్ దాడులను ఎదుర్కొంటున్న కైవ్, తనకంటే శక్తివంతమైన రష్యాపై డ్రోన్లతో ప్రతిదాడులు చేస్తూ ధీటుగా జవాబిస్తోంది. ముఖ్యంగా చమురు శుద్ధి కర్మాగారాలు, వైమానిక స్థావరాలు మరియు రష్యా వ్యూహాత్మక రాడార్ స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది.












Click it and Unblock the Notifications