భీకర క్షిపణులతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్: వందల మంది రష్యన్ సైనికులు మృతి
కీవ్: గత సంవత్సరానికిపైగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా దళాలపై ఉక్రెయిన్ ప్రతీకార దాడులను మరింత తీవ్రం చేసింది. తాజాగా, రష్యా ఆక్రమిత డొనెట్క్స్ ప్రాంతంపై ఉక్రెయిన్ క్షిపణి దాడులతో విరుచుకుపడింది. మికవ్కా నగరంపై జరిపిన భీకర క్షిపణి దాడిలో.. 400కుపైగా రష్యన్ సైనికులు మృతి చెందినట్లు ఉక్రెయిన్ మిలిటరీ వెల్లడించింది. మరో 300 మంది వరకు గాయపడినట్లు పేర్కొంది.
మాస్కో మిలిటరీ ఆశ్రయం పొందుతున్నట్లు భావించిన ఓ భవనంపై ఈ దాడి చేశామని, ఈ క్రమంలోనే వారికి భారీగా ప్రాణనష్టం వాటిల్లినట్లు తెలిపింది. అయితే, రష్యా అనుకూల స్థానిక పాలనా యంత్రాంగం మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేసింది. దాడి, ప్రాణ నష్టం వాస్తవమేనని, కానీ, ఆ స్థాయిలో మరణాలు లేవని తెలిపింది.
నూతన సంవత్సరం మొదటి రోజు అర్ధరాత్రి ఈ దాడి జరిగినట్లు డొనెట్క్స్ లోని రష్యా అనుకూల సీనియర్ అధికారి డానిల్ బెజ్సోనోవ్ తెలిపారు. అమెరికా సరఫరా చేసిన ఎంఎల్ఆర్ఎస్ హిమార్స్ క్షిపణులతో ఈ దుశ్చర్యకు ఉక్రెయిన్ పాల్పడినట్లు ఆరోపించారు. మృతుల సంఖ్య ఖచ్చితంగా తెలియరాలేదని చెప్పారు.
ఈ ప్రాంతంపై దాదాపు 25 రాకెట్ దాడులు జరిగినట్లు సదరు అధికారి తెలిపారు. కాగా, ఈ దాడి అనంతరం ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని కీలకమైన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని రష్యా.. డ్రోన్, క్షిపణి దాడులకు పాల్పడినట్లు స్థానిక గవర్నర్ ఒలెక్సీ కులేబా వెల్లడించారు. సోమవారం సైతం దాడులు జరిగే అవకాశం ఉందని ప్రజలకు హెచ్చరించారు. ప్రజలంతా షెల్టర్లలో తలదాచుకోవాలని సూచించారు. అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ పరస్పర దాడులు చేసుకుంటుండటంతో ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.