ఉక్రెయిన్కు సపోర్ట్: యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ సహా భారత సంతతి మంత్రులపై రష్యా నిషేధం
మాస్కో: ఉక్రెయిన్పై దాడుల నేపథ్యంలో రష్యాపై అమెరికాతోపాటు బ్రిటన్ కూడా ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రష్యా కూడా బ్రిటన్కు షాకిచ్చింది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తోపాటు సీనియర్ మంత్రులను తమ దేశంలోకి నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
యూకే ప్రధాని బోరిస్ జాన్సన్, భారత సంతతి మంత్రులపై రష్యా నిషేధం
మాస్కో నుంచి విడుదల చేయబడిన "స్టాప్ లిస్ట్" అని పిలవబడే 13 మంది బ్రిటీష్ రాజకీయ నాయకుల పూర్తి జాబితాలో భారత సంతతికి చెందిన మంత్రులు యూకే ఛాన్సలర్ రిషి సునక్, హోం సెక్రటరీ ప్రీతి పటేల్, అటార్నీ జనరల్ సుయెల్లా బ్రవర్మన్తో పాటు ఉప ప్రధాన మంత్రి డొమినిక్ రాబ్, విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్, రక్షణ కార్యదర్శి బెన్ వాలెస్ ఉన్నారు. మరింత మంది బ్రిటీష్ రాజకీయ నాయకులు, పార్లమెంటేరియన్లను చేర్చడానికి "సమీప భవిష్యత్తులో" జాబితాను విస్తరించనున్నట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తర్వాత బోరిస్ జాన్సన్పై బ్యాన్
ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్ను ఆక్రమించినప్పటి నుంచి దానిపై యూకే విధించిన ఆంక్షలకు ప్రతీకారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాస్కో పేర్కొంది. ఈ ఏడాది మార్చిలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్పై రష్యా ఇదే విధమైన నిషేధాన్ని విధించింది. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో.. "రష్యాను అంతర్జాతీయంగా ఒంటరిగా చేయడం, మన దేశ ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు ఆంక్షలు విధించడం లాంటి లండన్ చర్యలకు ప్రతిగానే తాజా నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది. అంతేగాక, "సారాంశంలో, బ్రిటిష్ నాయకత్వం ఉద్దేశపూర్వకంగా ఉక్రెయిన్ చుట్టూ పరిస్థితిని తీవ్రతరం చేస్తోంది, కైవ్ పాలకులను ప్రాణాంతక ఆయుధాలతో పంపుతుంది, నాటో వైపు ఇలాంటి ప్రయత్నాలను సమన్వయం చేస్తోంది అని ఆరోపించింది. రష్యాపై ఆంక్షలను విధించాలని ఇతర దేశాలపైనా బ్రిటన్ ఒత్తిడి చేస్తోంది. ఇలాంటి చర్యలను రష్యా ఎప్పటికీ అంగీకరించదు అని స్పష్టం చేసింది.
యూఎస్, యూకే ఆంక్షల నేపథ్యంలోనే రష్యా ప్రతికారం
కాగా, ఈ వారం ప్రారంభంలో, యూకే, యూఎస్ రెండూ మాస్కోపై మరిన్ని ఆంక్షలు విధించాయి, ఇందులో రష్యా ఇప్పటికే కష్టాల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉన్నత స్థాయి అధికారులు, అతని పాలన నుంచి లబ్ది పొందిన వ్యక్తులకు జరిమానా విధించేందుకు రూపొందించిన ఆర్థిక చర్యలు ఉన్నాయి. బోరిస్ జాన్సన్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతూ.. సంఘర్షణతో దెబ్బతిన్న ప్రాంతాన్ని సందర్శించడంతో పాటు ఉక్రెయిన్కు మద్దతును కూడగట్టడంలో యూకే ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా రష్యాను ఒంటరి చేయాలనే ప్రయత్నాలను యూఎస్ తోపాటు యూకే ఎంతో తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అంతేగాక, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కుమార్తెలు, బంధువులు, పుతిన్కు సహకరిస్తున్నవారిపై కూడా బ్రిటన్ ఆంక్షలను అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రష్యా కూడా ప్రతీకారంగా ఈ చర్యకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. మరోవైపు, రష్యా దాడులు, ఉక్రెయిన్ ప్రతిదాడులతో భారీ ప్రాణ నష్టంతోపాటు ఆస్తి నష్టం జరుగుతోంది. ఇప్పటికే వేలాది మంది ఇరుదేశాల సైనికులు, ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.