జర జాగ్రత్త.. ముఖ్యంగా పాకిస్తాన్ తో : తన పౌరులకు అమెరికా హెచ్చరిక
ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ కు పర్యటనల నిమిత్తం వెళ్లరాదంటూ అమెరికా తన దేశ పౌరులకు హెచ్చరికలు చేసింది.
వాషింగ్టన్: అమెరికా తన దేశ పౌరులకు హెచ్చరికలు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ కు వెళ్లరాదని, అక్కడ తిరుగుబాటు జరిపే అసాంఘిక శక్తులు క్రియాశీలకంగా ఉన్నాయని తమ పౌరులకు తెలిపింది.
అంతేకాదు, ఆ దేశాలకు చెందిన ఉగ్రవాదులు భారత్ లో కూడా క్రియాశీలకంగా ఉన్నారని పేర్కొంది. గతంలో ఏడు ముస్లిం దేశాలు, ఇప్పుడు ఆరు ముస్లిం దేశాలనై అమెరికా నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అమెరికా పౌరులపై, అమెరికాకు చెందిన స్థావరాలపై, అమెరికా శ్రద్ధ కనబరిచే అంశాలపై దక్షిణాసియాలోని ఉగ్రవాదులు, తిరుగుబాటు సంస్థలు దాడులు చేసే ప్రమాదం ఉన్నట్లు సమాచారం అందిన నేపథ్యంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లలో పర్యటించే ఆలోచన విరమించుకోవాలంటూ తన పౌరులకు స్పష్టం చేసింది.
అయితే, ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉన్న తమ పౌరులను హెచ్చరిస్తున్నామని, ఈ మూడు దేశాల్లోని వారికి ప్రత్యేకంగా సూచిస్తున్నామని పేర్కొంది. పాకిస్తాన్ లో అమెరికా పౌరులకు తీవ్ర వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా మెలగాలని హెచ్చరించింది.