పుల్వానా ఉగ్రదాడి: అందుకే ఐఎస్ఐపై అమెరికా అధికారుల అనుమానాలు
న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ హస్తం ఉన్నట్లు అమెరికాకు చెందిన పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియో చూసే టైంకు నేను స్వర్గంలో ఉంటా: పుల్వామా సూసైడ్ బాంబర్ వీడియో
ఐఎస్ఐ హస్తం ఉందని అనుమానిస్తోన్న నేపథ్యంలో ఉగ్ర కార్యకలాపాల మద్దతుకు స్వస్తి పలకడానికి పాకిస్తాన్ పైన అమెరికా ఒత్తిడి తీసుకురావడంలో విఫలమైందని మాజీ సీఐఏ అధికారి తెలిపారు. పాకిస్తాన్ మూలాలు ఉన్న జైష్ ఏ మొహమ్మద్ తనకు తానుగా బాధ్యత వహించడం చూస్తే ఐఎస్ఐ పాత్ర ఉన్నట్లు అర్థమవుతోందని అంటున్నారు. ఈ ఘటన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాలనపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని చెబుతున్నారు.
పలు దేశాల ఖండన
పుల్వామా దాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి. దాడిలో నలభై మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. సైనికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు భారత్తో కలిసి పోరాడుతామని అమెరికా ప్రకటించింది. ఉగ్రదాడిని అమానవీయ చర్య అని రష్యా పేర్కొంది. ముష్కరుల అంతానికి ప్రపంచ దేశాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చింది.
పుల్వానా ఉగ్రదాడిని ఫ్రాన్స్, జర్మనీ దేశాలు ఖండించాయి. జవాన్ల మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపాయి. ఈ ఉగ్రదాడి హేయమైన చర్య అని ఆస్ట్రేలియా ప్రకటించింది. ఉగ్రవాదంపై పోరులో భారత్తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని చెప్పింది. బంగ్లాదేశ్, శ్రీలంకలు అమరుల కుటుంబాలకు తమ సానుభూతిని ప్రకటించాయి. ఉగ్రదాడిని ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఖండించారు. అంతేకాకుండా, జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద సంస్థ మసూర్ అజార్పై భారత్ ప్రతిపాదించిన నిషేధానికి ప్రపంచ దేశాలు మద్దతివ్వాలన్నారు.