కరోనా: అమెరికాలో గగుర్పాటు.. 2.4లక్షల మరణాలన్న వైట్హౌజ్..ఉగ్రదాడి,చైనా కంటే భయానకం.. ..
అగ్రరాజ్యం అమెరికా చరిత్రలోనే అత్యం భయానక ఘట్టంగా 9/11 ఉగ్రదాడులను భావిస్తారు. కానీ ప్రస్తుత కరోనా వైరస్ ఉగ్రదాడులకంటే దారుణంగా విలయం సృష్టిస్తున్నదక్కడ. మూడ్రోజుల కిందట.. 'మా దేశంలో కరోనా కాటుకు కనీసం రెండు లక్షల మంది చనిపోవచ్చు'అని సైంటిస్టులు అంచనా కట్టగా.. ఇప్పుడు సాక్ష్యాత్తూ అధ్యక్షుడి అధికార భవనం వైట్ హౌజ్ సవరించిన అంచనాల్ని విడుదల చేసింది. ఇప్పటికే కరోనా మరణాల్లో చైనాను అధిగమించిన అమెరికాలో కొత్త లెక్కలు ప్రజల్లో మరింత భయాలు రేపుతున్నాయి.
పారదర్శకత కోసమే..
సాధారణంగా విపత్తులు, కరోనా వైరస్ లాంటి మహమ్మారులు విరుచుకుపడిన సందర్భాల్లో ప్రజలు పానిక్ అయిపోవద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వాలు జాగ్రత్తగా వ్యవహరిస్తుంటాయి. పాజిటివిటీని పెంచేలా కొన్నిసార్లు లెక్కల్ని తక్కువచేసి చూపించే ప్రయత్నం చేస్తాయి. కానీ అమెరికా, యూరప్ దేశాల్లో మాత్రం పారదర్శకత తప్పనిసరి. కాబట్టే చేదు నిజాన్ని ప్రజలకు చెప్పక తప్పడంలేదని వైట్ హౌజ్ టాప్ డాక్టర్ దెబోరా బిర్క్స్ అన్నారు. వైస్ ప్రెసిడెంట్ మైక్ పేన్స్ ఆధ్వర్యంలోని కరోనా రెస్పాన్స్ వ్యవస్థకు డాక్టర్ దెబోరా కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నారు.
ఇవీ కొత్త లెక్కలు..
అమెరికాలో జనవరి 20న మొట్టమొదటి కరోనా కేసు నమోదైంది. తర్వాత 70 రోజుల వ్యవధిలోనే ఆ దేశం.. ప్రపంచంలోకెల్లా మోస్ట్ ఎఫెక్టెడ్ గా మారిపోయింది. బుధవారం ఉదయం నాటికి అక్కడ కరోనా కేసుల సంఖ్య1.89లక్షలకు చేరింది. ఇప్పటిదాకా మొత్తం 4,055 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగతా దేశాలతో పోల్చుకుంటే వ్యాధి రికవరీ రేటు చాలా తక్కువగా ఉందక్కడ. పైగా, క్రిటకల్, యాక్టివ్ కేసులు కూడా భారీగా ఉన్నాయి. పరిస్థితి ఇదేరకంగా కొనసాగితే దేశవ్యాప్తంగా కనీసం 1లక్ష మంది నుంచి గరిష్టంగా 2.2 లక్షల మంది చనిపోతారని, ఆ సంఖ్య 2.4 లక్షలు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని వైట్ హౌజ్ డాక్టర్ చెప్పారు. గతంలో యూఎస్ ఇన్ఫెక్షియస్ డీసీజ్ సంస్థ వేసిన అంచనాల కంటే ఇది కొంచెం ఎక్కువ.
ట్రంప్ 30 రోజుల ప్లాన్..
డాక్టర్ దెబోరాతోపాటు మీడియా సమావేశానికి ప్రెసిడెంట్ ట్రంప్ కూడా వచ్చారు. రెండ్రోజుల కిందటి మీటింగ్ లో ‘‘వచ్చే రెండు వారాలూ భయానక పరిస్థితిని ఎదుర్కోబోతున్నాం''అని చెప్పిన ఆయన.. ఇప్పుడా గడువును 30 రోజులకు పెంచారు. వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి 30 రోజుల(ఏప్రిల్ 1 నుంచి మే1 దాకా) ప్లాన్ ను ఆయన ప్రకటించారు. సోషల్ డిస్టెన్స్ పాటించడం ద్వారా కేసుల సంఖ్యను తగ్గించుకోవచ్చన్నారు. మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి పాంపియో బుధవారం ఉదయం భారత విదేశాంగ మంత్రి జై శంకర్ కు ఫోన్ చేసి.. కరోనాపై పోరులో కలిసినడుద్దామని పిలుపునిచ్చారు.
ఉగ్రదాడి.. చైనాను తోసేసి..
న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్, వాషింగ్టన్ లోని పెంటగాన్, వైట్ హౌజ్ లు టార్గెట్ గా.. బిన్ లాడెన్ నేతృత్వంలోని అల్ ఖాయిదా ఉగ్రవాదులు.. 2001, సెప్టెంబర్ 11న దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. నాటి ఘటనలో టెర్రరిస్టులతో కలిపి మొత్తం 2,996 మంది చనిపోయారు. అమెరికా గడ్డపై అంత పెద్ద సంఖ్యలో జనం ఒకేసారి చనిపోడం అదే మొదటిసారి. మళ్లీ 19 ఏళ్ల తర్వాత కరోనా వైరస్ రూపంలో రెండు నెలల వ్యవధిలోనే 4వేల మందికిపైగా అమెరికన్లు సొంతదేశంలోనే చనిపోవడం విషాదకరం. కరోనా వైరస్ పుట్టిల్లు చైనాలో ఇప్పటిదాకా 3,312 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆ సంఖ్యను కూడా అమెరికా అధిగమించింది.
మిలియన్ దిశగా.. వేగంగా..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసు నమోదుకాని దేశమంటూ లేదిప్పుడు. అయితే గత అనుభవాలకు భిన్నంగా ఈసారి వైరస్.. పేద దేశాల కంటే ధనిక దేశాలనే వణికిస్తుండటం గమనార్హం. కేసులు, మరణాల్లో అమెరికా, యూరప్ దేశాలే ముందున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా బుధవారం ఉదయం నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8.6 లక్షలుగా ఉంది. కొత్త కేసులు వెలుగులోకి వస్తుండటంతో.. ఇన్ఫెక్షన్ కు గురైనవారి సంఖ్య నేడో రేపో మిలియన్(10 లక్షల) మార్కును చేరుతుంది.
పిట్టల్లా రాలిపోతున్నారు..
ఇక ప్రపంచ వ్యాప్తంగా మరణాలు ఇప్పటిదాకా 42,344. యూఎస్, యూరప్ లో క్రిటికల్ కేసుల సంఖ్య భారీగా ఉండటంతో మరణాలు కూడా త్వరలోనే 50 వేల మార్కును దాటనుంది. అత్యధికంగా ఇటలీలో 12,428 మంది చనిపోగా, 8,464 మరణాలతో స్పెయిన్ రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం 4,055 మరణాలు నమోదైన అమెరికాలో .. ఆ దేశ అధికారుల లెక్కల ప్రకారం పరిస్థితి మరింత దిగజారే అవకాశముంది.