US Election 2020: ఫ్లోరిడాలో ముందస్తు ఓటు హక్కు వినియోగించుకున్న ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే ఇటు అధ్యక్షుడు ట్రంప్ అటు డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ల మధ్య పోరు హోరా హోరీగా ఉంటుందని ప్రస్తుత పరిస్థితులను చూస్తే అర్థమవుతోంది. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ముందస్తుగానే ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ఉదయం ఫ్లోరిడాలోని వెస్ట్పామ్బీచ్ లైబ్రరీలోని పోలింగ్ బూత్లో ఓటేశారు. ట్రంప్ అనే వ్యక్తికి ఓటేశామని అధ్యక్షుడు ఓటు వేసిన అనంతరం చెప్పారు. బ్యాలెట్ ఓటు కంటే స్వయంగా వచ్చి ఓటు వేయడమే ఎక్కువ సురక్షితమని ఓటేశాక ట్రంప్ అన్నారు. గతంలో ఆయన న్యూయార్క్లో ఓటు వేసేవారు. డెమొక్రాట్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఇంకా ఓటుహక్కు వినియోగించుకోలేదు. నవంబర్ 3వ తేదీన డెలావెర్లో ఆయన ఓటేస్తారు.
ట్రంప్కు ఫ్లోరిడాలో ఇల్లు ఉంది. గతేడాదే తన సొంత నగరం న్యూయార్క్ నుంచి ఫ్లోరిడాకు వెళ్లారు. ఇక ట్రంప్ ఓటు వేసే సమయంలో మాస్కు ధరించి కనిపించారు. సాధారణంగా ట్రంప్ మాస్కు ధరించి కనిపించడం చాలా అరుదుగా చూస్తుంటారు. ఇప్పటి వరకు ముందస్తుగా దాదాపు 55 మిలియన్ అమెరికన్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరోనా వైరస్ అమెరికాలో విజృంభిస్తుండటంతో చివరి దాకా ఆగకుండా ముందస్తుగానే చాలామంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Recommended Video
బ్యాలట్ ఓటు చాలా భద్రంగా ఉందని ట్రంప్ అన్నారు. అంతా నిబంధనల మేరకే ప్రక్రియ జరుగుతోందని చెప్పారు. ఇదిలా ఉంటే ట్రంప్- జోబిడెన్ల మధ్య ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ప్రచారం కూడా చివరి దశకు చేరుకుంటుండటంతో విమర్శనాస్త్రాలు ఎక్కవయ్యాయి.