అలా ఎలా నామినేట్ చేస్తారండి? అమెరికాలోనూ సుప్రీంకోర్టు రచ్చ: తప్పుపట్టిన కమలా హ్యారిస్
వాషింగ్టన్: అమెరికాలోనూ ఆ దేశ అత్యున్నత న్యాయస్థానానికి సంబంధించిన రచ్చ నడుస్తోంది. న్యాయమూర్తి అమీ కోన్ బ్యారెట్ను సుప్రీంకోర్టుకు నామినేట్ చేయడం పట్ల కాలిఫోర్నియా సెనెటర్ కమలా హ్యారిస్ భగ్గుమంటున్నారు. భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్ష పదవి కోసం ఎన్నికల బరిలో నిల్చున్నారు. డెమొక్రటిక్ పార్టీ తరఫున ఆమె పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న రిపబ్లికన్ పార్టీ.. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జడ్జి అమీ కోన్ బ్యారెట్ను నామినేట్ చేయడాన్ని కమలా హ్యారిస్ తప్పుపడుతున్నారు.

కరోనా సంక్షోభ సమయంలోనా?
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రూత్ బ్యాడర్ గిన్స్బర్గ్ మరణంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి కిందటి నెల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. బ్యారెట్ను నామినేట్ చేశారు. ఆమె నియామక ప్రక్రియకు సంబంధించిన కన్ఫర్మేషన్ హియరింగ్ను చేపట్టారు. అమెరికాలో కరోనా వైరస్ ఏ రేంజ్లో తన విజృంభణనను కొనసాగిస్తోందో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. 80 లక్షల మందికి పైగా కేసులు నమోదు అయ్యాయి. 2 లక్షల 20 వేల మందికి పైగా కరోనా కాటుకు గురయ్యారు. ఈ పరిస్థితుల్లో రిపబ్లికన్ పార్టీ ప్రభుత్వం.. న్యాయమూర్తి అమీ కోన్ బ్యారెట్ను సుప్రీంకోర్టు జడ్జిగా నామినేట్ చేయడం పట్ల కమలా హ్యారిస్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

తప్పు పట్టడానికి కారణం ఇదే..
అమీ కోన్ బ్యారెట్ నామినేషన్ ప్రక్రియను కమలా హ్యారిస్ తప్పు పట్టడానికి కారణాలు లేకపోలేదు. అమెరికా చట్టాల ప్రకారం.. కింది న్యాయస్థానానికి చెందిన ఓ న్యాయమూర్తిని సుప్రీంకోర్టుకు నామినేట్ చేయడానికి కనీసం 50 మందితో సెనెటర్లతో కూడిన కమిటీ కన్ఫర్మేషన్ హియరింగ్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ కన్ఫర్మేషన్ హియరింగ్ ప్రక్రియను కొద్దిసేపటి కిందటే చేపట్టారు. ఒకేసారి 50 మంది కమిటీ సభ్యులు, తలుపులు మూసి ఉంచిన ఒకే గదిలో కొన్ని గంటల పాటు హియరింగ్లో పాల్గొంటారు. దీనివల్ల కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందనే ఆందోళనను కమలా హ్యారిస్ వ్యక్తం చేశారు.

కరోనా సంక్షోభం ముగిసిన తరువాతే..
కరోనా వైరస్ సంక్షోభ సమయం ముగిసిన తరువాత బ్యారెట్ను సుప్రీంకోర్టుకు నామినేట్ చేసి ఉంటే బాగుండేదని కమలా హ్యారిస్ చెప్పారు. న్యాయవాదిగా పని చేసిన ఆమె ఈ కన్ఫర్మేషన్ హియరింగ్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. తన అభిప్రాయాలను వెల్లడించారు. రిపబ్లికన్ల అత్యంత నిర్లక్ష్య పూరిత చర్యగా ఆమె దీన్ని అభివర్ణించారు. ఈ ప్రక్రియను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో ఈ ప్రక్రియను చేపట్టడం వల్ల జ్యుడీషియల్ స్టాఫ్, పోలీసులు, ఇతర సిబ్బంది ప్రాణాలను రిస్క్లో పడేసినట్టయిందని వ్యాఖ్యానించారు.

కోవిడ్ కంటే ఆమె నియామకమే ఎక్కువా..?
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అమీ కోన్ బ్యారెట్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నామినేట్ చేసే ప్రక్రియకే రిపబ్లికన్ పార్టీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, దీన్ని బట్టి చూస్తో.. ప్రజల ప్రాణాల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది స్పష్టమౌతోందని విమర్శించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయాలను తీసుకోవడం సరికాదని అన్నారు. సానుకూల పరిస్థితులు ఏర్పడేంత వరకూ రిపబ్లికన్లు ఎందుకు ఆగలేకపోతున్నారని కమలా హ్యారిస్ నిలదీశారు.












Click it and Unblock the Notifications