ఇండియన్ అమెరికన్ బిగ్షాట్స్ మద్దతు ఎవరికో తెలుసా? నిర్ణయాత్మక శక్తిగా భారతీయ ఓటుబ్యాంకు
వాషింగ్టన్: ఇంకొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. అగ్రరాజ్యం పీఠాన్ని ఎవరు కైవసం చేసుకుంటారనే విషయంపై అమెరికన్లు తుది నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. ఎప్పట్లాగే ఈ ఎన్నికల్లో విదేశీయుల ఓటుబ్యాంకు అధ్యక్ష అభ్యర్థి గెలుపోటములను ప్రభావితం చేస్తుంది. తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డొనాల్డ్ ట్రంప్.. అందలాన్ని అందుకోవడానికి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ విదేశీయుల ఓటుబ్యాంకును ఏ మేరకు ఆకట్టుకుంటారనేది ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తాయి.
Recommended Video
బిడెన్ వైపే ట్రెండ్..
ఇప్పుడున్న ట్రెండ్ ఆధారంగా అమెరికాలో నివసిస్తోన్న భారతీయులు, ఆసియన్-పసిఫిక్ దేశాలకు చెందిన ప్రముకులు జో బిడెన్కు మద్దతుగా నిలిచారు. భారత్ సహా ఆసియన్-అమెరికన్ కమ్యూనిటీకి చెందిన 1100 మందికి పైగా వేర్వేరు రంగాలకు చెందిన ప్రముఖులు జో బిడెన్-కమలా హ్యారీస్ జోడీకి మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఆసియన్-అమెరికన్స్ అండ్ పసిఫిక్ ఐలండర్స్ (ఏఏపీఐ) ఓ జాబితాను ప్రకటించింది. ఇందులో ఆసియా-పసిఫిక్ దేశాలకు చెందిన కళాకారులు, పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు, వేర్వేరు రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు.
250 నుంచి 11 వరకు పెరిగిన జాబితా..
ఇదివరకు ఈ జాబితాపై సంతకాలు చేసిన ఆసియన్-అమెరికన్స్ అండ్ పసిఫిక్ ఐలండర్స్ ప్రముఖుల సంఖ్య 250 మాత్రమే. ఎన్నికల ప్రచారం ప్రారంభంలో ఈ సంఖ్య పోలింగ్ గడువు సమీపించే సరికి నాలుగు రెట్లు పెరిగింది. 1100 మందికి పైగా ఆయా దేశాలకు చెందిన వేర్వేరు రంగాల ప్రముఖులు ఈ జాబితాపై సంతకాలు చేశారు. తాము డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్-ఉపాధ్యక్ష అభ్యర్థిని కమలా హ్యారిస్కు మద్దతు ఇస్తామని ప్రకటించారు. డెమొక్రటిక్ నేషనల్ కమిటీ-ఏఏపీఐ ఛైర్మన్ బెల్ లియాంగ్-హాంగ్ ఈ జాబితాను రూపొందించారు.
ఎవరెవరు ఉన్నారీ జాబితాలో?
భారత సంతతికి చెందిన రాజకీయవేత్త రాజా కృష్ణమూర్తి, అమీ బెరా, ప్రమీలా జయపాల్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ దక్షిన, మధ్య ఆసియా విభాగం మాజీ సహాయ కార్యదర్శి నిషా దేశాయ్ బిస్వాల్, మేరీల్యాండ్ డెమొక్రటిక్ పార్టీ ఏఏపీఐ మాజీ ఛైర్మన్ దేవాంగ్ షా, డెమొక్రటిక్ ఆసియన్ అమెరికన్స్ ఆఫ్ వర్జీనియా ఛైర్మన్ ప్రవీణ్ మయ్యన్, కాలిఫోర్నియా స్టేట్ అసెంబ్లీ మెంబర్ యాష్ కల్రా ఉన్నారు. వారితో పాటు యూఎస్ హౌస్ రెప్రజెంటేటివ్ అభ్యర్థి శ్రీ కులకర్ణి, డెమొక్రటిక్ నేషనల్ కమిటీ మాజీ ముఖ్య కార్యనిర్వహణాధికారి సీమా నందా, మేరీల్యాండ్ డెమొక్రటిక్ పార్టీ నేత ధవల్ షా, ఫెయిర్ ఫాక్స్ కంట్రీ ఏఏపీఐ వైస్ ఛైర్మన్ మనీషా సింగ్, న్యూజెర్సీ డెమొక్రటిక్స్ దక్షిణాసియా విభాగం నాయకుడు రితేష్ షా ఉన్నారు.
ఓటమి తప్పదా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. దీనికి కారణం- 2016 ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్కు పట్టం కట్టిన అనేక రాష్ట్రాల్లో ఈ సారి డెమొక్రాట్ల హవా వీస్తుండటమేనని చెబుతున్నారు. డొనాల్డ్ ట్రంప్తో పోల్చుకుంటే.. జో బిడెన్ ఆరు శాతం ఆధిక్యతలో కొనసాగుతున్నారంటూ అక్కడి మీడియా నిర్వహించిన సర్వేల్లోనూ తేలింది. 46 శాతం ఓట్లు ట్రంప్కు పోల్ అవగా.. 52 శాతం మంది జో బిడెన్ నాయకత్వానికి మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమైంది. ఈ పరిస్థితుల్లో ఫలితాలు ఎలా ఉంటాయనే ఆసక్తి నెలకొంది.