అమెరికా ఎన్నికల్లో కీ ఫ్యాక్టర్ మనోళ్లే- తొలి దేశీ ప్రెసిడెంట్?
Donald Trump vs Kamala Harris: ఇంకో మూడే రోజులు. అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. దాదాపుగా 35 కోట్ల మంది అమెరికన్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మరో నాలుగు సంవత్సరాల పదవి కోసం కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు.
పోలింగ్ గడువు సమీపించిన నేపథ్యంలో ఎన్నికల ప్రచార వేడిగా పతాక స్థాయికి చేరింది. ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లతో అక్కడి రాష్ట్రాలు హోరెత్తిపోతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డెమోక్రాట్లు, ఈ దఫా ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో రిపబ్లికన్లు పోరాడుతున్నారు.

ఈ ఎన్నికల్లో డెమోక్రాట్ల తరపున ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో దిగిన విషయం తెలిసిందే. ట్రంప్ వరుసగా మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు. 2016 నాటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ఆయన ఆ తరువాతి ఎన్నికల్లో ఓడిపోయారు. మూడోసారి బరిలో నిలిచారు.
నార్త్ కరోలినా, ఆస్టిన్, టెక్సాస్, పెన్సిల్వేనియా, విస్కాన్సిస్ వంటి రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ ఇప్పటికే ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు. ముమ్మర ప్రచారాన్ని సాగిస్తోన్నారు.
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ఉద్యోగ అవకాశాలు తగ్గుముఖం పట్టడం, అక్రమ వలసదారులు.. వంటి అంశాల ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపున్నాయి. అలాగే అబార్షన్ కూడా. 24 వారాల తరువాత అబార్షన్ చేయడాన్ని భ్రూణహత్యతో సమానంగా పరిగణిస్తారు రిపబ్లికన్ పార్టీ. దీన్ని వ్యతిరేకించే మహిళలు డెమోక్రాట్లకు మద్దతు ఇస్తోన్నారు.

ఈ పరిణామాలపై యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు, భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి స్పందించారు. ఈ ఎన్నికల్లో గెలిచేదెవరనేది అంచనా వేశారు. డొనాల్డ్ ట్రంప్- కమలా హ్యారిస్ మధ్య పోటీ తీవ్రంగా ఉందని, హోరాహోరీ పోరు కొనసాగుతోందని అన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచేది మాత్రం కమలా హ్యారిసేనని అన్నారు.
ఏఎన్ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాజా కృష్ణమూర్తి మాట్లాడారు. కమలా హ్యారిస్.. అమెరికాకు మొట్టమొదటి దేశీ ప్రెసిడెంట్ కాబోతోన్నారని జోస్యం చెప్పారు. ఆమె సారథ్యంలో భారత్- అమెరికా మధ్య గల దౌత్య, ఆర్థిక, సాంస్కృతి సంబంధాలు మరింత బలోపేతమౌతాయనడంలో సందేహాలు అక్కర్లేదని అన్నారు.
ఆరు నుంచి ఏడు రాష్ట్రాల ఓటర్లు ఈ ఎన్నికలను మలుపు తిప్పగలుగుతారని రాజా కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. 2020లో ఓట్ల లెక్కింపు సమయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయన్ని గుర్తు చేశారు. హోరాహోరి పోరు నెలకొన్నందున ఓటర్ల తీర్పుపై స్పష్టత రావాలంటే మనం ఓపిక పట్టాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తే- అమెరికా అనుసరిస్తోన్న ప్రస్తుత విదేశీ విధానాల్లో భారీ మార్పులు రావొచ్చని అంచనావేశారు. అలాగే వాణిజ్యం, మార్కెటింగ్ వంటి కీలక రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాలు చోటు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కమలా హారిస్ విజయం సాదించితే భారత్కు లబ్ది కలుగుతుందని, ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమౌతాయని అన్నారు.
ఆసియాలో భారత్ను చైనాకు ధీటుగా అభివృద్ధి చెందే అవకాశం లభించగలదని రాజా కృష్ణమూర్తి చెప్పారు. ఈ ఎన్నికల్లో అమెరికాలో నివసించే భారతీయ ఓటర్లు ప్రభావం చూపుతారని అన్నారు. అభ్యర్థుల విషయంలో వారి మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ- భారత్, అమెరికా మధ్య సంబంధాలు మరింత బలోపేతం చేసే వారికే పట్టంగడతారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications