అనూహ్యం..షాకింగ్: ఆ స్థావరాలపై విరుచుకుపడ్డ అమెరికా: ఇరాక్-సిరియాల్లో విధ్వంసం
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. సిరియా, ఇరాక్లోని తీవ్రవాద స్థావరాలపై వైమానిక దాడులకు దిగింది. ఉగ్రవాద స్థావరాలు, వారికి చెందిన ఆయుధాగారాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు కొనసాగాయి. మూడు దఫాలుగా సాగిన ఈ దాడుల్లో యూఎస్ వైమానిక బలగాలు పెద్ద ఎత్తున బాంబులు, క్షిపణులను సంధించినట్లు తేలింది. దీన్ని అమెరికా రక్షణ విభాగం ప్రధాన కార్యాలయం పెంటగాన్ ధృవీకరించింది. ఎంపిక చేసుకున్న తీవ్రవాద స్థావరాలు, వారి ఆయుధాగారాలపై ఈ దాడులు కొనసాగించినట్లు పెంటగాన్ ప్రెస్ కార్యదర్శి జాన్ ఎఫ్ కిర్బీ వెల్లడించారు.
ఇరాన్ సపోర్ట్ తీసుకుంటోన్న మిలీషియా గ్రూప్
ఇరాక్-సిరియాలకు చెందిన ఉగ్రవాద సంస్థలు ఇరాన్ మద్దతుతో అక్కడ విధి నిర్వహణలో ఉన్న అమెరికా బలగాలపై దాడులకు పాల్పడటాన్ని తిప్పి కొట్టడంలో భాగంగా- తాము ఈ చర్యలను పూనుకున్నట్లు జాన్ కిర్బీ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇరాక్-సిరియా సరిహద్దుల్లో ఉగ్రవాద స్థావరాలు, వారికి చెందిన ఆయుధాగారాలు పెద్ద ఎత్తున ఉన్నాయని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉన్న అమెరికా సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ల సహకారంతో ఇరాక్-సిరియా మిలీషియా గ్రూప్ దాడులు చేశారని స్పష్టం చేశారు. ఈ మిలీషియా గ్రూప్కు ఇరాన్ మద్దతు ఇస్తోందని తెలిపారు.
గురి తప్పలేదంటూ..
అమెరికా సైన్యంపై నిర్వహించిన దాడులకు కతాయిబ్ హెజ్బొల్లా, కతాయిబ్ సయ్యద్ అల్ షుహాదా మిలీషియా గ్రూపులు బాధ్యులుగా గుర్తించింది అమెరికా. ఫలితంగా ఈ రెండింటికి సంబంధించిన స్థావరాలు, ఆయుధాగారాలపై మిస్సైళ్లను సంధించింది. సరిహద్దుల్లో సిరియా భూభాగంపై ఉన్న రెండు, ఇరాక్ భూభాగంపై ఉన్న ఒక స్థావరాన్ని ధ్వంసం అయ్యాయి. ఈ దాడులు ప్రాణనష్టం సంభవించినట్లు జాన్ కిర్బీ వెల్లడించలేదు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇంకా సేకరించాల్సి ఉందని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. దాడులు గురి తప్పలేదని స్పష్టం చేశారు.
బిడెన్ సర్కార్లో రెండోసారి..
అధ్యక్షుడిగా జో బిడెన్ బాధ్యతలను స్వీకరించిన తరువాత అమెరికా.. ఇరాక్-సిరియాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులను చేపట్టడం ఇది రెండోసారి. ఇదివరకు ఫిబ్రవరిలో తొలిసారిగా ఇరాన్ ప్రోత్సాహిత మిలీషియా గ్రూపుల స్థావరాలను ధ్వంసం చేయడానికి అప్పట్లో ఇరాక్పై వైమానిక దాడులు చేసింది. తాజాగా ఉగ్రవాదులకు మరోసారి తన ప్రతాపాన్ని చూపింది. ఇరాక్, సిరియాల్లో విధి నిర్వహణలో ఉన్న తమ దేశ సైనికులపై ఎవరు దాడి చేసినా.. దాని ఫలితం ఇలాగే ఉంటుందని జాన్ కిర్బీ తెలిపారు. తమ దేశ సైనికుల ప్రాణాలను కాపాడటంలో రాజీ పడే ప్రసక్తే లేదని జో బిడెన్ మరోసారి నిరూపించినట్టయిందని పేర్కొన్నారు.
న్యూక్లియర్ డీల్ కోసమేనా?
ఇరాన్తో న్యూక్లియర్ డీల్ను పునరుద్ధరించుకోవాలని అమెరికా కొంతకాలంగా ప్రయత్నాలను సాగిస్తోంది. జో బిడెన్ ప్రభుత్వం కూడా అదే నిర్ణయంతో ఉంది. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన అణ్వాయుధ ఒప్పందాలు 2015లో ముగిసిపోయాయి. దీనికి ఇరాన్ సుముఖంగా ఉండట్లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. అమెరికా సైన్యంపై దాడులు జరిగిన ప్రతీసారీ- వాటిని తిప్పి కొడుతూ, సిరియా లేదా ఇరాక్లపై దాడులు సాగిస్తూ ఇరాన్కు అమెరికా పరోక్షంగా హెచ్చరిక సంకేతాలను పంపిస్తోందనే విమర్శలు లేకపోలేదు.