జో బైడెన్కు సోకిన ఆ ప్రమాదకర వేరియంట్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇదివరకే కరోనా బారిన పడ్డారు. వైరస్ తీవ్రత స్వల్పంగా ఉండటం వల్ల ఆయన వైట్హౌస్లో ఐసొలేషన్లో ఉంటూ బాధ్యతలను నిర్వర్తిస్తోన్నారు. యాంటీ వైరల్ ట్రీట్మెంట్ పాక్స్లోవిడ్ కోర్సును తీసుకుంటోన్నారు. జో బైడెన్ ఫుల్లీ వ్యాక్సినేటెడ్. ఏడాదిన్నర కిందటే రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ను తీసుకున్నారు. ఆ తరువాత రెండుసార్లు బూస్టర్ డోసులు వేసుకున్నారు. ఫలితంగా వైరస్ తీవ్రత స్వల్పంగా ఉంటోందని వైట్హౌస్ అధికారులు తెలిపారు.
తాజాగా జో బైడెన్కు సోకిన వైరస్.. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ5గా కావొచ్చని వైట్హౌస్ ఫిజీషియన్ డాక్టర్ కెవిన్ ఓ కానర్ తెలిపారు. 70 నుంచి 80 శాతం పాజిటివ్ కేసులు వ్యాప్తి చెందడానికి ఈ వేరియంటే కారణమని చెప్పారు. శరవేగంగా వ్యాప్తి చెందే లక్షణాలు ఈ వేరియంట్కు ఉన్నట్లు పేర్కొన్నారు. అదే వేరియంట్ బైడెన్కు సోకినట్లుగా భావిస్తున్నామని, దీనికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదికలు ఇంకా అందాల్సి ఉందని చెప్పారు.
ప్రస్తుతం బైడెన్ కోవిడ్ నుంచి శరవేగంగా రికవరీ అవుతున్నట్లు ఫిజీషియన్ పేర్కొన్నారు. పాక్స్లోవిడ్ కోర్సులను తీసుకుంటున్నారని వివరించారు. ఆయన ఆరోగ్యం ఇదివరకటి కంటే మెరుగుపడిందని చెప్పారు. గొంతులో ఇన్ఫెక్షన్, ముక్కు కారడం (Rhinorrhea), పొడిదగ్గు నుంచి కొంతమేరకు కోలుకున్నారని పేర్కొన్నారు. పల్స్ రేట్, బీపీ సాధారణ స్థాయిలోనే ఉన్నాయని, శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు లేవని డాక్టర్ కెవిన్ తెలిపారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్స్ లేవని చెప్పారు.
చివరిసారిగా ఆయనకు నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని, అయినప్పటికీ ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటున్నామని కెవిన్ చెప్పారు. బైడెన్ తన సిబ్బందితో ఫోన్లో మాట్లాడుతున్నారని, జూమ్ కాల్ లేదా ఫోన్ కాల్స్ ద్వారా అధికారిక సమావేశాల్లోనూ పాల్గొంటున్నారని వివరించారు. మరి కొన్ని నిర్ధారణ పరీక్షల తరువాత భౌతికంగా సమీక్షా సమావేశాలకు హాజరవుతారని స్పష్టం చేశారు.