బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్: ‘మైలురాయి’ అంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
వాషింగ్టన్: బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన భారత సంతతి వ్యక్తి రిషి సునాక్కు భారత ప్రధాని నరేంద్ర మోడీ సహా ప్రపంచ దేశాధినేతలు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా రిషికి అభినందనలు తెలియజేశారు .అమెరికాకు అత్యంత సన్నిహితమైన దేశం బ్రిటన్ కావడంతో ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
ఇండో-అమెరికన్లతో నిర్వహించిన దీపావళి వేడుకల్లో జో బైడెన్ మాట్లాడారు. చీకటిని పారద్రోలి, ప్రపంచానికి వెలుగుని అందించే శక్తి ప్రజలకు ఉందని అన్నారు. ఈ సందర్భంగానే రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని ఎన్నికపైనా స్పందించారు. ఈ రోజే ఓ వార్త తెలిసింది.. రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికయ్యారు అని తెలిపారు. ఈ మాటలతో దాదాపు 200 మంది అతిథులు హర్షధ్వానాలు చేశారు.
అది ఒక ఎంపిక. మన నిత్యజీవితంలో, దేశం ప్రస్థానంలో అటువంటి ఎంపికలు చేస్తుంటాం. ముఖ్యంగా అమెరికా, భారత్, యూకే వంటి ప్రజాస్వామ్య దేశాల ప్రస్తానంలో జరుగుతుంటాయి. ఈ రోజు ఇప్పుడు ఓ వార్త విన్నాను. బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఎన్నికయ్యారు. ఒక సోదరుడిగా చెబుతున్నాను. అద్భుతంగా ఉంది. రేపు రాజును కలవనున్నారు. ఇది ఒక కీలకమైన మైలురాయి. అని బైడెన్ వ్యాఖ్యానించారు.
ఇప్పటికే రిషి సునాక్కు భారత ప్రధాని మోడీ సహా ప్రపంచ దేశాధినేతల నుంచి అభినందనల సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. రిషి బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఆయనతో కలిసి ప్రపంచ సమస్యపై సన్నిహితంగా కలిసి పనిచేసేందుకు, రోడ్ మ్యాప్ 2030 అమలు చేసేందుకు ఎదురుచూస్తున్నట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు.
కాగా, యునైటెడ్ స్టేట్స్ వైస్ ప్రెసిడెంట్ పదవికి భారతీయ సంతతికి చెందిన కమలా హారిస్ను ఎంపిక చేసి బిడెన్ చరిత్ర సృష్టించాడు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ అయిన మొట్టమొదటి భారతీయ సంతతి వ్యక్తి కూడా హారిస్. అమెరికా అధ్యక్షుడు తమ ప్రభుత్వంలో గతంలో కంటే ఎక్కువ మంది ఆసియా అమెరికన్లు ఉన్నారని, సంఘం అందించిన సహకారానికి ధన్యవాదాలు తెలియజేయాలని అన్నారు.