దారికొచ్చిన డొనాల్డ్ ట్రంప్- హిందవుల ఓట్లపై గురి
Donald Trump vs Kamala Harris: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడిగా పతాక స్థాయికి చేరింది. ఎన్నికల ప్రచార ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లతో అక్కడి రాష్ట్రాలు హోరెత్తిపోతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డెమోక్రాట్లు, గెలిచి తీరాలనే పట్టుదలతో రిపబ్లికన్లు పోరాడుతున్నారు.
ఈ ఎన్నికల్లో డెమోక్రాట్ల తరపున ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో దిగిన విషయం తెలిసిందే. ట్రంప్ వరుసగా మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు. 2016 నాటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ఆయన ఆ తరువాతి ఎన్నికల్లో ఓడిపోయారు. మూడోసారి బరిలో నిలిచారు.

ఈ నెల 5వ తేదీన అక్కడ పోలింగ్ జరుగనుంది. దాదాపుగా 35 కోట్ల మంది అమెరికన్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నార్త్ కరోలినా, ఆస్టిన్, టెక్సాస్, పెన్సిల్వేనియా వంటి రాష్ట్రాల్లో ట్రంప్, ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ ఇప్పటికే ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు. ముమ్మర ప్రచారాన్ని సాగిస్తోన్నారు.
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ఉద్యోగ అవకాశాలు తగ్గుముఖం పట్టడం, అక్రమ వలసదారులు.. వంటి అంశాల ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపున్నాయి. అలాగే అబార్షన్ కూడా. 24 వారాల తరువాత అబార్షన్ చేయడాన్ని భ్రూణహత్యతో సమానంగా పరిగణిస్తారు రిపబ్లికన్ పార్టీ. దీన్ని వ్యతిరేకించే మహిళలు డెమోక్రాట్లకు మద్దతు ఇస్తోన్నారు.
ఈ పరిణామాల మధ్య కమల హ్యారిస్, డొనాల్డ్ ట్రంప్ హిందూ ఓటర్లపై గురిపెట్టారు. భారతీయులకు దీపావళి పండగ శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకీ విషెస్ తెలిపారు. చెడుపై మంచి సాధించే విజయానికి ప్రతీకగా జరుపుకొనే దీపాల పండగ అని అభివర్ణించారు.
ఈ క్రమంలో ట్రంప్ మరో అడుగు ముందుకేశారు. తమ దేశంలో నివసించే హిందువుల హక్కులను పరిరక్షిస్తానని హామీ ఇచ్చారు. రాడికల్ భావజాలం ఉన్న వాళ్లు, హిందూయిజాన్ని వ్యతిరేకించడమే తమ అజెండా పెట్టుకున్న వాళ్ల నుంచి అమెరికన్లలో హిందువులను కాపాడతానని అన్నారు.
2016 నుంచి 2019 వరకు తన పాలనలో భారత్తో సన్నిహిత సంబంధాలను కొనసాగించానని, ప్రధాని మోదీ తనకు నమ్మకస్తుడైన మితృడని కితాబిచ్చారు. మరోసారి భారత్- అమెరికా పరస్పర భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తామని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
బంగ్లాదేశ్లో మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తరువాత చోటు చేసుకున్న పరిణామాలపైనా డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులు, హింసాత్మక పరిస్థితుల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. హిందువులు, క్రైస్తవులు, ఇతర మైనారిటీలపై దాడిని అనాగరిక చర్యగా పేర్కొన్నారు.
ఇలాంటి దాడులు తన హయాంలో ఎప్పుడూ జరగలేదని ట్రంప్ గుర్తు చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ప్రభుత్వం అటు అమెరికాలో మాత్రమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా హిందువులు దోపిడీలకు గురి అవుతున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications